విజయవాడ విమానాశ్రయానికి పక్షుల బెడద:ఆందోళనలో ఎయిర్ పోర్ట్ అధికారులు
Recommended Video
విజయవాడ:కడివెడు గుమ్మడి కాయైనా కత్తిపీటకు లోకువే అన్న సామెత చందంగా గన్నవరం విమానాశ్రయం పరిసరాల్లో పక్షుల సంచారం అంతకంతకూ అధికమవుతుండటంపై విమానాశ్రయ అధికారులు ఆందోళన చెందుతున్నారు.
కారణం ఎంత పెద్ద లోహవిహంగమైనా చిన్న పక్షి కారణంగా కూలిపోయే ప్రమాదం ఎదుర్కొనే అవకాశం ఉంటుందని విమానయాన రంగంలో అందరికీ తెలిసిన విషయం. ఈ క్రమంలో గన్నవరం విమానాశ్రయం చుట్టూ వందలాది పక్షులు ఎల్లవేళలా చక్కర్లు కొడుతుండటంతో ఈ సమస్య ఎలా పరిష్కరించాలో తెలియక విమానాశ్రయం అధికారులు తలపట్టుకుంటున్నారు.
గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి నిత్యం 52 విమాన సర్వీసులు రాకపోకలు సాగిస్తుంటాయి. వాటిద్వారా ఏటా 9 లక్షల మంది వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తుంటారు. విమానాశ్రయాల పరిసరాల్లో పక్షుల సంచారంపై నిషేధం ఉంటుంది. కానీ గన్నవరం విమానాశ్రయం జాతీయ రహదారి చేరువనే ఉండటంతో.. చుట్టుపక్కల రెస్టారెంట్లు, హోటళ్ల నిర్వాహకులు సహా స్థానికులు వ్యర్థాలు, చెత్తను తెచ్చి ప్రతిరోజు అక్కడే పారబోస్తుంటారు.
ఈ క్రమంలో ఆ వ్యర్థాలను తినేందుకు తరలివస్తున్న పక్షులు ప్రక్కనే ఉన్న విమానాశ్రయం ప్రాంగణంలోకి ప్రవేశించడమో, అక్కడే చక్కర్లు కొట్టడమో చేస్తున్నాయి. దీంతో వీటి ఉనికి ఎయిర్ క్రాఫ్ట్ ల ప్రయాణానికి ఆటంకంగా పరిణమిస్తుండటం సర్వసాధారణంగా మారింది. గతంలో పక్షి ఢీ కొని విమానాలు కూలిన ఘటనలు విదేశాల్లో చోటుచేసుకోగా...తాజాగా చోటుచేసుకున్న మరో రెండు ఉదాహరణలు...
జపాన్ నుంచి న్యూయార్క్కు వెళుతున్న ఒక జపాన్ ఎయిర్ లైన్స్ విమానం అత్యవసరంగా ల్యాండింగ్ చేయవలసి రాగా...ఇదే కారణంతో మరో విమానం ను కార్డిఫ్ ఎయిర్ పోర్టులో దింపేశారు. ఈ పక్షుల వల్ల లోహ విహంగాలకు పెనుముప్పు పొంచి ఉండటంతో ప్రయాణికులు ఆందోళన చెందుతుండగా ఈ సమస్యను ఏ విధంగా పరిష్కరించాలో తెలియక అధికారులు మథనపడుతున్నారు.