పిచ్చిని వదిలిస్తాం: వర్మపై బీజేపీ మహిళా నేతల ఫిర్యాదు
విజయవాడ: ప్రముఖ వివాదాస్పద సినీ దర్శక, నిర్మాత రాంగోపాల్ వర్మపై భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చ నేతలు శుక్రవారం విజయవాడ సూర్యారావుపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. జీఎస్టీ(గాడ్ సెక్స్ అండ్ ట్రూత్) వెబ్ సిరీస్ ద్వారా భారతీయ సంస్కృతిని వర్మ భ్రష్టు పట్టిస్తున్నాడంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు.
కాగా, ఫిర్యాదును పరిశీలించిన అనంతరం చర్యలు చేపడతామని పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా బీజేపీ మహిళా మోర్చ నేతలు మాట్లాడుతూ.. వర్మకు పిచ్చి పట్టడం వల్లే ఇటువంటి అర్థంపర్థం లేని పనులు చేస్తున్నాడని మండిపడ్డారు.
అందుకే ఆయనను భార్యతో పాటు కూతురు కూడా వెలివేశారని అన్నారు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకోకపోతే రాంగోపాల్ వర్మ పిచ్చి వదిలిస్తామని బీజేపీ మహిళా మోర్చ నేతలు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మహిళా నేతలు షర్మిలా ఖటూన్, గాయత్రి, తదితరులు పాల్గొన్నారు.