రంగంలోకి జగన్, ఇదీ విషయం!: మాజీ మంత్రికి షాకిచ్చిన వంగవీటి రాధా
విజయవాడ: వంగవీటి రాధాకృష్ణ తీవ్ర అసంతృప్తితో ఉన్న నేపథ్యంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి మాజీ మంత్రి, పార్టీ సీనియర్ నేత పార్థసారథిని రంగంలోకి దించారు. గురువారం రాధతో ఆయన భేటీ అయ్యారు. టిక్కెట్ విషయమై చర్చించారు.
Recommended Video
విజయవాడ సెంట్రల్ సీటు మార్పుకు గల కారణాలు, విజయవాడ తూర్పులో పోటీ చేయమనడానికి గల కారణాలను ఆయనకు తెలిపారు. వైసీపీ అధిష్టానం తరఫున పార్థసారథి.. రాధతో చర్చలు జరిపారు. కానీ వైసీపీకు చుక్కెదురైంది. సెంట్రల్ సీటు విషయంలో ఎట్టి పరిస్థితుల్లో తగ్గేది లేదని, రెండో ఆలోచన లేదని రాధాకృష్ణ తేల్చి చెప్పారు.
తొందరపాటు నిర్ణయాలు వద్దు
విజయవాడ సెంట్రల్ సీటులో మరో ఆలోచన లేదని వంగవీటి రాధాకృష్ణ గట్టి షాకివ్వడంతో.. పార్థసారథి ఆయనకు పలు సూచనలు చేశారు. ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని హితవు పలికారు. వంగవీటి రాధాతో జరిగిన చర్చల సారాంశాన్ని ఆయన పార్టీ అధినేత వైయస్ జగన్కు తెలపనున్నారు.
టిక్కెట్ లేదు కానీ: తేల్చేసిన అంబటి, అన్యాయం చేశారు.. మాట్లాడతా: వంగవీటి ఆగ్రహం
అందుకే మధ్యవర్తిగా పార్థసారథి
తనకు విజయవాడ సెంట్రల్ సీటు కేటాయించకపోవడంపై వంగవీటి రాధా తీవ్ర అసంతృప్తితో ఉన్న విషయం తెలిసిందే. ఆయన రంగా రాధా మిత్రమండలి, తన మద్దతుదారులతో వరుసగా భేటీ అవుతున్నారు. మూడు రోజుల పాటు వేచి చూసి ఆ తర్వాత నిర్ణయం తీసుకుందామని రెండు రోజుల క్రితం అనుచరులకు సూచించారు. ఈ నేపథ్యంలో పార్థసారథి మధ్యవర్థిగా వచ్చారు.
పార్టీ మారుతారా?
సెంట్రల్ సీటును ఇప్పటికే మల్లాది విష్ణుకు కేటాయిస్తున్నట్లు సంకేతాలు ఇచ్చారు. ఆయనను ఇంచార్జిగా నియమించారు. మరోవైపు సీటు విషయంలో వంగవీటి రాధా తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో రాధా పార్టీ మారే అవకాశాలు లేదా స్వతంత్రంగా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. ఆయన చూపు జనసేన వైపు ఉందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.
అగ్రిగోల్డ్ ఆస్తులపై చంద్రబాబు, అనుచరుల కళ్లు
అగ్రిగోల్డ్ విషయంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని పార్థసారథి ఆరోపించారు. అఫ్పుల కంటే ఆస్తులు ఎక్కవగా ఉన్నా సమస్య పరిష్కారం కావడం లేదని ధ్వజమెత్తారు. అగ్రిగోల్డ్ ఆస్తులపై చంద్రబాబు నాయుడు, ఆయన అనుచరుల కళ్లు పడ్డాయన్నారు. ఈ వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అగ్రిగోల్డ్ ఆస్తులపై సీబీఐ విచారణ జరపకపోవడంపై బీజేపీ సమాధానం చెప్పాలని పార్థసారథి డిమాండ్ చేశారు.