భారీ వర్షాలు, వరదలు వస్తే విజయవాడది చెన్నై పరిస్థితే
విజయవాడ: తమిళనాడు రాజధాని చెన్నైలో భారీ వర్షం, వరదల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి సమీపంలోని విజయవాడ అంశం చర్చకు వస్తోంది. ప్రస్తుతం ఏపీ పరిపాలన హైదరాబాద్ తర్వాత ఎక్కువగా విజయవాడ నుండి సాగుతోంది.
చెన్నైలో వచ్చిన వర్షం, వరదలు వస్తే విజయవాడ పరిస్థితి దారుణంగా ఉంటుందని అంటున్నారు. దాదాపు చెన్నై నగరవాసుల పరిస్థితే ఎదురు కావొచ్చని చెబుతున్నారు. ప్రధానంగా విజయవాడలో డ్రెయినేజీలో పరిస్థితి ఏమాత్రం బాగా లేదు.
గతంలో వర్షాలు పడినప్పుడు నగరంలోని చాలా ప్రాంతాలు నీట మునిగాయి. ఇప్పుడు చెన్నైలో ఏర్పడిన పడవల పరిస్థితే అక్కడా కనిపించింది. ఇప్పుడు కనుక నగరంలో 300 మిల్లీ మీటర్ల వర్షం పడితే చెన్నైలాంటి పరిస్థితే ఎదురు కావొచ్చునని అంటున్నారు.
తుఫాను నీటి డ్రెయినేజీ ప్రాజెక్టు నిమిత్తం కేంద్ర ప్రభుత్వం రూ.వెయ్యి కోట్లను అలాట్ చేసింది. కానీ ఈ ప్రాజెక్టు ముందుకు కదలని పరిస్థితిలో ఉందని చెబుతున్నారు. చెన్నైలో భారీ వర్షాలు నగరాన్ని అతలాకుతలం చేసిన విషయం తెలిసిందే.