వైసిపిలో చేరనున్న మల్లాది విష్ణు, భవిష్యత్ లేదా, బిజెపి బలోపేతంకానుందా?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రోజురోజుకు బలహీనమౌతోంది. ఆ పార్టీలో ఇంతకాలంపాటు ఉన్న నాయకులు ప్రత్యామ్నాయం వైపు చూస్తున్నారు.తాజాగా విజయవాడ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లాది విష్ణు వైసీపీలో
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రోజురోజుకు బలహీనమౌతోంది. ఆ పార్టీలో ఇంతకాలంపాటు ఉన్న నాయకులు ప్రత్యామ్నాయం వైపు చూస్తున్నారు.తాజాగా విజయవాడ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లాది విష్ణు వైసీపీలో చేరనున్నారు.
రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ పార్టీ అనుకూలంగా 2014 లో నిర్ణయం తీసుకొంది. దీంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలుగా విభజించారు.
అయితే రాష్ట్ర విభజనన విషయంలో కాంగ్రెస్ పార్టీ కీలకంగా వ్యవహరించిందని ఆంద్రప్రాంత ప్రజలు భావించారు. 2014 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఈ ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓడించారు.
అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా పోటీచేసిన వారికి డిపాజిట్లు కూడ దక్కలేదు. ఎన్నికల ముందే కాంగ్రెస్ పార్టీ నుండి టిడిపి, వైసీపీ లలో చేరారు చాలా మంది నాయకులు. అయితే ఎన్నికల తర్వాత కూడ కాంగ్రెస్ ను నమ్ముకొని ఉన్న నేతలు ఇక పార్టీని వీడాలని నిర్ణయానికి వచ్చారు.
మల్లాది విష్ణు వైసీపీలో చేరిక
విజయవాడ నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లాది విష్ణు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు.ఆయన మంగళవారం నాడు వైసీపీ చీఫ్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. కొంత కాలంగా ఆయన పార్టీని వీడుతారనే ప్రచారం సాగుతోంది. ఇవాళ మధ్యాహ్నం ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఆయన సన్నిహితుడుగా పేరుంది. 2004 లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి రాగానే వైఎస్ విష్ణుకు ఉడా ఛైర్మెన్ పదవిని కట్టబెట్టారు. 2009 ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గాన్ని మల్లాది విష్ణుకు కేటాయించి, విజయవాడ తూర్పు సీటును వంగవీటి రాధాకు కేటాయించారు. గత ఎన్నికల్లో విష్ణు పోటీచేసి ఓటమిపాలయ్యారు.
విజయవాడలో ఖాళీ అవుతున్న కాంగ్రెస్ పార్టీ
విజయవాడ నగరంలో కాంగ్రెస్ పార్టీ నుండి కీలక నేతలు తమ రాజకీయ భవితవ్యం కోసం ప్రత్యామ్నాయమార్గాలను వెతుక్కొంటున్నారు. ఆరుమాసాల క్రితమే మాజీ మంత్రి దేవినేని నెహ్రు కాంగ్రెస్ పార్టీని వీడి టిడిపిలో చేరారు. దేవినేని తన కొడుకు అవినాష్ రాజకీయ భవితవ్యం కోసం పార్టీని వీడారని చెబుతారు.అయితే దురదృష్టవశాత్తు ఆయన మరణించారు. అయితే దేవినేని మరణం తర్వాత కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న మల్లాది విష్ణు కూడ పార్టీని వీడారు. అయితే వీరిద్దరి కంటే ముందుగానే వెల్లంపల్లి శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ నుండి బిజెపిలో చేరారు. బిజెపికి కూడ రాజీనామా చేసి ఆయన వైసీపీలో చేరారు.
కాంగ్రెస్ కు భవిష్యత్ లేదా?
ఏపీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్ లేదనే నెపంతో ఆ పార్టీలో కీలకంగా వ్యవహరించిన నేతలంతా ఒక్కొక్కరు ఆ పార్టీని వీడుతున్నారు. వైసీపీ కానీ, టిడిపిలో కానీ చేరకుండా ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన నేతలు ప్రత్యామ్యాయాలను చూసుకొంటున్నారు. కొంత కాలం క్రితం మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు వైసీపీలో చేరారు. అంతకుముందే ఆయన సోదరుడు వైసీపీలో ఉన్నారు. ధర్మాన చేరిన తర్వాత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కూడ కాంగ్రెస్ పార్టీని వీడి వైసీపీలో చేరారు.నెల్లూరు జిల్లాకు చెందిన ఆనం సోదరులు కాంగ్రెస్ పార్టీని వీడి టిడిపిలో చేరారు. మెజార్టీ నాయకులు 2014 ఎన్నికల ముందే ప్రత్యామ్నాయపార్టీల్లో చేరారు. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో చోటుచేసుకొన్న పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా భవిష్యత్ లేదనే అభిప్రాయం ఆ పార్టీ నేతల్లో ఉందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు .దీంతో ఆ పార్టీకి చెందిన నేతలు పార్టీని వీడుతున్నారని పరిశీలకులు అభిప్రాయంతో ఉన్నారు.
బిజెపి బలోపేతమయ్యేనా?
రాష్ట్రంలో ప్రధానంగా టిడిపి, వైసీపీల మధ్యే పోరు సాగుతోందనే అభిప్రాయాన్ని రాజకీయ పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఏపీలో కూడ తమ బలాన్ని పెంచుకోవాలని బిజెపి కూడ ప్రయత్నాలను చేస్తోంది.అయితే బిజెపిలో కూడ కాంగ్రెస్ పార్టీ నుండి చేరిన నాయకులే ఎక్కువగా ఉన్నారు.అయితే వచ్చే ఎన్నికల్లో బిజెపి రాష్ట్రంలో ప్రదాన శక్తిగా అవతరించే శక్తిగా మారే అవకాశం ఉందా అంటే ఇప్పటికిప్పుడు చెప్పే పరిస్థితుల్లో లేమనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు పరిశీలకులు.అయితే 2014 ఎన్నికల కంటే ఎక్కువ స్థానాలను ఏపీ నుండి గెల్చుకోవాలని బిజెపి ప్లాన్ చేస్తోంది. అయితే ఏ మేరకు బిజెపి ప్లాన్ సక్సెస్ అవుతోందోననేది ఎన్నికల సమయంలో నెలకొనే పరిస్థితులు కూడ నిర్ణయిస్తాయి.