రాశి..రంభకు కోర్టు వార్నింగ్: వారిద్దరి మీద ఫిర్యాదు: అసలేం జరిగిందంటే..!
ప్రముఖ సినీ హీరోయిన్స్ రంభ..రాశీలకు ఊహించని విధంగా ఎదురుదెబ్బ తగిలింది. వారిద్దరు ఇచ్చిన ప్రకటన కారణంగా తాను చూసి మోసపోయానంటూ ఫిర్యాదు దాఖలైంది. దీని మీద ఫోరం కీలక వ్యాఖ్యలు చేసింది. సినీ నటులు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తూనే.. కొత్త చట్టం ద్వారా సెలబ్రెటీస్కు కూడా జరిమానా విధించే అవకాశం ఉందని స్పష్టం చేసింది. దీంతో..ఇప్పుడు ఈ వార్త అటు సినీ ఇండస్ట్రీలోనే కాదు.. సామాన్యుల్లనూ చర్చకు కారణమైంది. అదే విధంగా పీవీపీ కి సంబంధించిన మాల్స్ విషయంలోనూ విజయవాడ ఫోరం కీలక ఆదేశాలు ఇచ్చింది. ఇప్పుడు ఈ రెండు అంశాలు విజయవాడలో హాట్ టాపిక్ గా మారింది. అసలు ఏం జరిగిందంటే..
రాశి..రంభ ప్రకటనలతో మోసపోయాం
సినీ రంగంలో ప్రత్యేక గుర్తింపు పొందిన హీరోయిన్స్ రాశి...రంభ మీద వినియోగదారుల కోర్టులో కేసు ఫిర్యాదు నమోదైంది. వీరిద్దరూ టెలివిజన్స ఛానళ్లలో ప్రసారమవుతున్న కలర్స్ లో కనిపిస్తారు. కలర్స్ ప్రమోషన్స్ కోసం నటించారు. అయితే..విజయవాడకు చెందిన ఒక వినియోగ దారుడు తాను కలర్స్ కారణంగా నష్టపోయానంటూ వినియోదారుల ఫోరం ను ఆశ్రయించారు. అదే విధంగా రాశి, రంభ లాంటి నటుల ప్రకటనలు చూసి మోసపోయానంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపైన విచారణ చేపట్టిన ఫోరం చివరకు కలర్స్ కు రెండు లక్షల జరిమానా విధించింది.
బాధితుడికి రూ.74,652లను చెల్లించాలని
కలర్స్ పేరుతో ప్రకటనలు నిలిపివేయాలని ఆదేశించింది. బాధితుడి ఫిర్యాదును సీరియస్ గా తీసుకున్న ఫోరం 9శాతం వడ్డీతో బాధితుడికి రూ.74,652లను చెల్లించాలని ఆదేశించింది. ఈ సందర్భంగా సినీ నటులకు ఫోరం కీలక సూచనలు చేసింది. ప్రకటనల విషయంలో సినీ నటులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తూ.. కొత్త చట్టం ద్వారా సెలబ్రెటీస్కు కూడా జరిమానా విధించే అవకాశం ఉందని ఫోరం స్పష్టం చేసింది. ఇప్పుడు ఈ వ్యవహారం ఆసక్తి కర చర్చకు కారణమైంది.
పీవీపీ మాల్ కు జరిమానా..
వైసీపీ నేత పివిపికి చెందిన విజయవాడలోని పీవీపి మాల్ కు విజయవాడ వినియోగదారుల ఫోరం జరిమానా విధించింది. ప్రముఖ పారిశ్రామిక వేత్త..తాజాగా ఎన్నికల్లో వైసీపీ నుండి పోటీ చేసిన నేతకు చెందిన పీవీపీ మాల్ లో పార్కింగ్ ఫీజు వసూలు చేయటం పైన ఫోరంలో ఫిర్యాదు దాఖలైంది. దీని పైన ఫోరం విచారణ చేసింది. మాల్ లో ఫీజు వసూలు చేయటాన్ని తప్పు బట్టిన ఫోరం వినియోగదారుల సంక్షేమనిధికి రూ.5లక్షలు చెల్లించాలని పీవీపీ మాల్కు ఆదేశించింది. అంతేకాకుండా ఫిర్యాదుదారుడికి రూ.5వేలు చెల్లించాలని వినియోగదారుల ఫోరం తీర్పునిచ్చింది.
మాల్స్, మల్టిఫ్లెక్స్లలో ఉచిత పార్కింగ్కు చర్యలు తీసుకోవాలని మునిసిపల్ కమిషనర్, కలెక్టర్కు వినియోగదారుల ఫోరం ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇది కేవలం పీవీపీ మాల్ లో మాత్రమే కాకుండా అనేక షాపింగ్ మాల్స్ లో ఇదే తరహాలో పార్కింగ్ ఫీజు లు వసూలు చేస్తున్నారు. ఇప్పుడు ఈ తీర్పు ద్వారా కమిషనర్..కలెక్టర్ వీటి మీద ఫోకస్ చేసే అవకాశం కనిపిస్తోంది.