రామ్గోపాల్ వర్మకు షాక్: కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశం
విజయవాడ: వంగవీటి సినిమాపై ఇంకా వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు విజయవాడ కోర్టు స్పందించింది. వంగవీటి సినిమా దర్శకుడు రామ్గోపాల్ వర్మ, నిర్మాత దాసరి కిరణ్లపై కేసు నమోదు చేయాలని విజయవాడ కోర్టు ఆదేశించింది.
వంగవీటి సినిమాపై మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ విజయవాడ ఒకటవ చీఫ్ మెట్రో పాలిటన్ మేజిస్ట్రేట్కు ఫిర్యాదు చేశారు. వంగవీటి సినిమా ద్వారా తమ కుటుంబ గౌరవానికి భంగం కలిగించారని రాధా పిటిషన్ దాఖలు చేశారు.
ఈ ఫిర్యాదు మేరకు దర్శకుడు వర్మ, దాసరి కిరణ్, ఇతరులపై వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని కోర్టు ఆదేశించింది.ఈ సినిమా విడుదలైన సమయంలోనే సినిమాలో తమ కుటుంబాన్ని తప్పుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారని వంగవీటి రాధాకృష్ణ ఆరోపించారు.
ఈ విషయమై సినిమా యూనిట్కు తమ అభ్యంతరాలను వ్యక్తం చేశారు. అంతేకాదు కోర్టును కూడ ఆశ్రయించారు. దీంతో కోర్టు ఈ విషయమై మంగళవారం నాడు స్పందించింది.