హీరో రామ్ ట్వీట్పై విజయవాడ సీపీ తీవ్ర స్పందన: వారి సమాచారం ఇస్తే రూ. లక్ష నజరానా
విజయవాడ: హీరో రామ్ ట్వీట్లపై విజయవాడ పోలీస్ కమిషనర్ శ్రీనివాసులు పరోక్షంగా స్పందించారు. రామ్ పేరును ప్రస్తావించకుండానే.. పోలీసులకు కులం, మతం ఉండదని.. తమకు అందరూ సమానమేనని సీపీ స్పష్టం చేశారు. స్వర్ణ ప్యాలెస్ ఘటనలో హీరో రామ్ కుల ప్రస్తావనతో ట్వీట్లు చేసిన విషయం తెలిసిందే.
రామ్ పేరు ప్రస్తావించకుండానే..
ఎవరో ఏదో కామెంట్ చేశారని తాను స్పందించడం లేదని, విచారణలో ఎలా చేయాలో తమకు తెలుసునని సీపీ శ్రీనివాసులు స్పష్టం చేశారు. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించి ఉంటే అందరూ బతికేవారని, ఎటువంటి జాగ్రత్తలు, నిబంధనలు లేకుండా ఆస్పత్రి నిర్వహించారని ఆయన తెలిపారు.
స్వర్ణ ప్యాలెస్.. కోవిడ్ కేర్ సెంటర్ కాకున్నా..
స్వర్ణ ప్యాలెస్ కేసులో ఇప్పటికే చాలా మందిని విచారించామని, తమకు సందేహం ఉన్న అందరికీ నోటీసులు ఇచ్చి విచారిస్తామని సీపీ తెలిపారు. స్వర్ణ ప్యాలెస్లో క్వారంటైన్ సెంటర్ కాకుండా కోవిడ్ కేర్ సెంటర్ పేరుతో నిర్వహించారన్నారు. ఈ ఆస్పత్రిలో బోర్డు నిర్ణయాలు మేరకే అన్నీ జరుగుతాయని, ఆ కాపీలు వస్తే.. ఆయా వ్యక్తులను కూడా విచారిస్తామని సీపీ చెప్పారు.
స్వర్ణ ప్యాలెస్, రమేష్ ఆస్పత్రి మధ్య ఏం ఒప్పందాలు జరిగాయో..?
ఈ కేసు విచారణకు ముద్దాయిలు, అనుమానితులు సహకరించడం లేదని సీపీ తెలిపారు. స్వర్ణ ప్యాలెస్, హోటల్, రమేష్ ఆస్పత్రి యాజమాన్యాల మధ్య ఏ ఒప్పందం జరిగిందో కూడా చెప్పలేకపోతున్నారన్నారు. ట్రీట్మెంట్కు అధికంగా
డబ్బులు వసూలు చేశారని తేలిందని, 91 నోటీసులు కూడా ఆస్పత్రి బోర్డు సభ్యులకు ఇచ్చామన్నారు. కీలకంగా ఉన్న మేనేజ్మెంట్ కోసం వెతుకుతున్నామని తెలిపారు.
Recommended Video
వారి సమాచారం ఇస్తే రూ. లక్ష బహుమతి..
ఈ ఘటనలో అన్యాయంగా పది మంది మృతి చెందారని, అందులో ఎనిమిది మందికి నెగిటివ్ కూడా వచ్చిందని సీపీ తెలిపారు. ఈ కేసుకు సంబంధించి విచారణ కొనసాగుతోందన్నారు. ఈ కేసులో కీలక వ్యక్తుల సమాచారం ఇస్తే రూ. లక్ష బహుమతి ఇస్తామని సీపీ శ్రీనివాసులు ప్రకటించారు. కాగా, స్వర్ణ ప్యాలెస్ ఘటనపై విచారణ కమిటీ ప్రభుత్వానికి బుధవారం నివేదిక అందించిన విషయం తెలిసిందే.రమేష్ ఆస్పత్రి అన్ని రకాలుగా ప్రభుత్వ నియమాలను, నిబంధనలను పూర్తిగా ఉల్లంఘించిందని ఈ కమిటీ తేల్చింది.