టిడిపి నేత కాట్రగడ్డ బాబు బాబు ప్లెక్సీలపై బిజేపి నేతల గరంగరం...టిడిపికి హెచ్చరికలు
విజయవాడ: ఎపిలో టీడీపీ, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం మరింత ముదురుతోంది. తాజాగా టిడిపి నేత కాట్రగడ్డ బాబు విజయవాడలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు బిజెపి ఆగ్రహానికి కారణమయ్యాయి.
సోమవారం విజయవాడలో జరిగిన మీడియా సమావేశంలో బీజేపీ నేతలు సోము వీర్రాజు, విష్ణుకుమార్ రాజు, మాధవ్ మాట్లాడుతూ టిడిపి నేతల చర్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడలో టీడీపీ నేత కాట్రగడ్డ బాబు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల గురించి ప్రస్తావించి టిడిపి నేతలు బీజేపీని కించపరిచే చర్యలు మానుకోవాలని హితవు పలికారు. టీడీపీ నేతలు ఇదేవిధంగా చేస్తే వాళ్ల అవినీతిపై నిలదీయాల్సి వుంటుందని హెచ్చరించారు. చంద్రబాబుకు అమిత్ షా ఫోన్ చేయడాన్ని టీడీపీ నేతలు అనుకూలంగా ప్రచారం చేసుకుంటున్నారని బిజెపి నేతలు ఎద్దేవా చేశారు.
విజయవాడలో జరిగిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ "టీడీపీ అధికార ప్రతినిధి మమ్మల్ని గుడ్డలు విప్పికొడతామని అంటున్నారు...టివి ఛానల్స్ చర్చా వేదికల్లో టీడీపీ వాళ్లు ఆ తీరుగా మాట్లాడటాన్ని ఏమంటారు?...అమిత్ షా ఫోన్ చేస్తే భయపడి ఫోన్ చేశారని అంటున్నారు...ప్రత్యేక హోదా పొడిగించలేదని బీజేపీ ఎంపీ హరిబాబు చెప్పారు...కేంద్ర పార్టీ కూడా స్పష్టం చేసింది...పవన్ కల్యాణ్ లాంటి కమిటీలు చాలా ఉంటాయి. జేఎఫ్సీ నివేదిక చూసి స్పందిస్తాం" అని చెప్పారు.
తాను వార్డ్ మెంబర్గా పోటీ చేయలేదని సోము వీర్రాజు చెప్పారు...తనను ఎన్నో మాటలు అంటున్నారని...ఎన్నికల్లో ఓడినా 40 ఏళ్లుగా రాజకీయాల్లోనే ఉన్నానని అన్నారు. "నాకు నోటు లేదు..ఓటు లేదు...నా అధిష్టానం ఆదేశిస్తే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తా...నాకు భిక్షగా వేసిన ఎమ్మెల్సీ వల్ల ఒరిగేది ఏమీలేదు...ఎప్పుడైనా వదులుకుంటా" అని సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు.