కన్న కూతురిని కడతేర్చమన్న తల్లి: అక్రమ సంబంధాన్ని ప్రశ్నించిందని: ద్వారక హత్య వెనుక అమానుషం..!
అమానుషం. అమ్మతనానికే మచ్చ తెచ్చ ఘటన. పేగు బంధాన్ని కాపాడుకోవాల్సిన తల్లే ప్రియుడితో చంపించిన అమానవీయ పరిణామం. పరాయి వ్యక్తితో సన్నిహితంగా ఉండటాన్ని చూసి.. ప్రశ్నించిందనే కారణంగానే కన్నబిడ్డనే కడ తేర్చేందుకు సహకరించింది ఆ దుర్మార్గపు తల్లి. ఎనిమిదేళ్ల చిన్నారిని తల్లి అనుమతితోనే అత్యంత పాశవికంగా హత్యచేసి మూట కట్టి, బీరువాలో దాచిన హృదయవిదాకర ఘటన విజయవాడ గ్రామీణ పరిధిలోని గొల్లపూడిలో చోటు చేసుకుంది. తొలుత బాలిక అపహరణకు గురైందని..ఆ తరువాత ఇంటి పక్కన ఉండే వ్యక్తే హత్య చేసాడని వెలుగులోకి వచ్చిన ఈ ఘటనలో అసలు సూత్ర ధారి కన్నతల్లి అనే విషయం పోలీసు విచారణలో వెల్లడైంది.
అక్రమ సంబంధం చూసిందనే కారణంతో..
మొవ్వ అనిల్, వెంకటరమణలు భార్యాభర్తలు. అనిల్ ప్రభుత్వ మద్యం సరఫరా గోదాంలో కూలి పనికి వెళ్తుండగా.. వెంకటరమణ సమీపంలోని ఓ ప్రైవేటు కళాశాలలో స్వీపర్గా పనిచేస్తోంది. తమ ఇద్దరు అబ్బాయిలను నందిగామ మండలం గోళ్లమూడిలో బంధువుల ఇంటి దగ్గర ఉంచి చదివిస్తున్నారు. ఎనిమిదేళ్ల కుమార్తె ద్వారక తల్లిదండ్రులతోనే ఉంటూ స్థానిక పాఠశాలలో రెండో తరగతి చదువుతోంది.
వీరి పక్కింట్లో పెంటయ్య అలియాస్ ప్రకాష్ తన భార్యతో కలిసి అద్దెకు ఉంటున్నాడు. అతని భార్య పుట్టింటికి వెళ్లింది. ఆదివారం సెలవు కావడంతో ద్వారక ఇంట్లోనే ఉండి... టీవీ చూసేందుకు పెంటయ్య ఇంటికి వెళ్లింది. అక్కడ తన తల్లి వెంకటరమణ, పెంటయ్య సన్నిహితంగా ఉండటాన్ని చూసింది. ఈ విషయమై తల్లిని నిలదీసింది. నాన్నకు చెబుతానంది. దీంతో..ఏదో ఒకటి చెయ్యమని చెప్పేసి..తల్లి తన ఇంటికి వెళ్లిపోయింది. దీంతో.. పెంటయ్య బాలికను తీసుకెళ్లి హత్య చేశాడు.
పరుపు చాటున దాచి..నాటకాలు
కన్న కూతురిని ఏదో ఒకటి చేయమని చెప్పేసి వెళ్లిపోయిన తల్లి.. సాయంత్రం ఇంటికి వస్తూనే ఏమీ తెలియనట్లుగా నటించింది. అమ్మాయి ఏదంటూ భర్తనే ప్రశ్నించింది. ఎంతకీ బాలిక రాకపోవటంతో అక్కడడక్కడా తిరుగుతూ వెతుకుతున్నట్లు నిందితురాలు నటించింది. బాలిక కనిపించడం లేదని తెలియడంతో గ్రామస్థులంతా వెతకడం ప్రారంభించారు.
ఈ విషయమై రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు స్పందించి బాలిక ఆచూకీ కోసం గాలింపు ప్రారంభించారు. అయితే, అప్పటికే నిందితుడు పెంటయ్య బాలిక ను హత్య చేసి..మృతదేహాన్ని బయటకు తరలించే అవకాశం లేకపోవడంతో సంచిలో మూటగట్టి, దాన్ని పరుపు చాటున దాచాడు.
పెంటయ్య భార్య పట్టించి..స్థానికులు దేహ శుద్ది చేసి..
బాలిక ఆచూకీ కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేసి.. ప్రతి ఇంటిని తనిఖీ చేశారు. నిందితుడు పెంటయ్య ఏమీ తెలియనట్లుగానే బాలిక కోసం తాను వెతుకుతున్నట్లుగా నటించాడు. తన మీద ఎక్కడా అనుమానం రాకుండా జాగ్రత్త పడ్డాడు. అదే సమయంలో ఇంటికి చేరుకున్న నిందితుడు భార్య సునీత కూడా బాలిక కోసం గాలించింది. ఇంట్లోని పరుపును పక్కకు తీయగా మృతదేహం ఉన్న మూట కనిపించింది. నిర్ఘాంతపోయిన ఆమె విషయాన్ని గ్రామస్థులతో చెప్పడంతో విషయం బయటపడింది.
వెంటనే పెంటయ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాలిక ముఖం, మెడపై కమిలిన గుర్తులు కనిపించాయి. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రోజంతా బాలిక కోసం వెతికిన గ్రామస్థులు హత్య విషయం తెలుసుకుని పెద్ద ఎత్తున సంఘటన స్థలానికి చేరుకున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని కోరారు. ఇలా..అసలు విషయం బయటకు రావటంతో..ఇప్పుడు అందరూ ఆ తల్లి చేసిన దుర్మార్గాన్ని అసహ్యించుకుంటున్నారు.