నకిలీల సర్టిఫికెట్లకు అడ్డాగా విజయవాడ...నిర్వేదంలో ప్రజలు
విజయవాడ:విజయవాడలో ఏం జరుగుతోంది...ఎందుకు నేరగాళ్లు అందరూ ఈ నగరాన్ని తమ అడ్డాగా చేసుకుంటున్నారు. నిన్నటిదాకా నకిలీ వస్తువులకే విజయవాడ స్థావరం అనుకుంటే తాజాగా ఆ జాబితాలో నకిలీ సర్టిఫికెట్లు కూడా చేరడంతో ఇక బెజవాడ అన్ని రకాల అక్రమాలకు నెలవుగా మారినట్లు స్పష్టమవుతోంది. పూర్తిస్థాయి రాజధాని నగరంగా మారక ముందే విజయవాడలో పరిస్థితి ఈ విధంగా ఉంటే ముందు ముందు స్థితిగతులు ఇంకెలా ఉంటాయోనన్నఆందోళన తలెత్తుతోంది.
మొన్న ఫ్యామిలీ పెన్షన్ కుంభకోణం...నిన్నమగధ యూనివర్శిటీ పేరిట నకిలీ సర్టిఫికెట్లు...తాజాగా ఆర్టిసి ఎండి ఎం.మాలకొండయ్య వద్ద ఒఎస్డిగా పని చేస్తున్ననాగేశ్వరరావు సంతకం ఫోర్జరీ చేసి మరీ నకిలీ జాబ్ ఆర్డర్...ఈ వరుస ఘటనలతో విజయవాడ నకిలీ సర్టిఫికెట్ల రాకెట్కు కూడా కేంద్రంగా వెలుగొందుతున్న విషయం బైటపడింది.
ఈ నగరానికి ఏమైంది...ఆందోళనలో ప్రజలు...
రాజధాని ప్రాంతంలో...రాష్ట్రానికి సంబంధించి అత్యున్నత స్థాయి అధికారులు అత్యధికంగా ఉన్న ప్రదేశంలోనే ఇలా అక్రమాలు వరుసగా వెలుగు చూస్తుండటంతో ప్రస్తుత పరిస్థితులపై అందరిలో ఆందోళన నెలకొంది. తాజా ఘటనలో సాక్షాత్తూ డిజిపి దగ్గర, అదీ సిన్సియర్ ఆఫీసర్ గా పేరొందిన మాలకొండయ్య దగ్గర పనిచేస్తున్న ఓఎస్డి సంతకాన్నే నేరగాళ్లు ఏమాత్రం భయపడకుండా ఫోర్జరీ చేసిన వైనం అక్రమార్కుల నిర్భీతిని తేటతెల్ల చేస్తోంది.
తాజా ఘటనతో...పరిస్థితి తేటతెల్లం
తాజాగా జరిగిన నకిలీ జాబ్ ఆర్డర్ ఉదంతం పరిశీలిస్తే...విజయవాడ ఆర్టిసి రీజియన్ లో జూనియర్ అసిస్టెంట్ పోస్టుకు కడప జిల్లాకు చెందిన షేక్ చాన్బాషాకు జాబ్ కేటాయిస్తూ ఆర్టిసి ఎండి మాలకొండయ్య దగ్గర ఒఎస్డిగా విధులు నిర్వహిస్తున్న నాగేశ్వరరావు సంతకంతో ఓ ఫైలు ఎపిఎస్ఆర్టీసీ అధికారుల వద్దకు వచ్చింది. అయితే ఉద్యోగ నియామకాలు చేపట్టే అధికారం ఒఎస్డికి ఉండదనే విషయం తెలిసిన అధికారులు ఇదే విషయమై ఒఎస్డి నాగేశ్వరరావుకు సమాచారం అందించారు. దీంతో తాను అలాంటి లేఖ ఏదీ ఇవ్వలేదన్న నాగేశ్వరరావు విజయవాడ కృష్ణలంక పోలీస్స్టేషన్లో తన సంతకాన్ని ఫోర్జరీ చేశారంటూ ఫిర్యాదు చేశారు. దీంతో ఈ వ్యవహరం బైటపడగా కలకలం రేగింది.
ఇటీవలి...మరికొన్ని ఘటనలు...
విజయవాడలోనే ఇటీవలే ఇలా నకిలీ సర్టిఫికెట్లకు సంబంధించి కొన్ని అక్రమాలు వెలుగుచూసిన నేపథ్యంలో తాజా సంఘటన ద్వారా ఇక్కడ పెద్ద రాకెటే నడుస్తోందని స్పష్టమైంది. విజయవాడ ఎస్ఆర్ఆర్ కాలేజ్ లో ఇద్దరు అధ్యాపకులు మగధ విశ్వవిద్యాలయంలో నకిలీ పిహెచ్డి పట్టాలను సృష్టించడమే కాదు ఏకంగా ఎపిపిఎస్సినే బురిడీ కొట్టించి సుమారు రూ.70 లక్షల మేర ప్రభుత్వం నుంచి శాలరీ రూపంలో డ్రా చేసుకున్నట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. ఆ నివేదికను విజిలెన్స్ డిజిపికి ఇంకా ఇవ్వాల్సి ఉందని సమాచారం.
రెచ్చిపోతున్న అక్రమార్కులు...నిర్వేదంలో ప్రజలు...
మరోవైపు ఇదే కృష్ణా జిల్లాలో అసలు ఎన్నడూ ఉపాధ్యాయులుగా పనిచేయకుండానే తాము టీచర్లుగా పనిచేసి పదవీ విరమణ పొందినట్లు నెలవారీగా ప్రభుత్వ పింఛన్ పొందుతున్నవారు సుమారు 20 మందికి పైగా ఉన్నట్లు...వీరిని విజిలెన్స్ దర్యాప్తు అధికారులు సైతం గుర్తించినట్లు ప్రచారం జరుగుతోంది...ఇలా రాజధాని జిల్లాలోనే నకిలీ సర్టిఫికెట్లు, ఫోర్జరీ సంతకాలతో ఉద్యోగాలు వెలగబెడుతున్నవారు...వారికి సహకరిస్తున్న వారు ఈ స్థాయిలో రెచ్చిపోతున్న విషయం తెలిసి ప్రజలు తాము చూడటం తప్ప చెయ్యగలిగిందేముందన్ననిర్వేదానికి లోనవుతున్నారు.