విజయవాడ టీడీపీలో వర్గపోరు- సామంతరాజుల్లా ఓడిన ఎమ్మెల్యేలు- కేశినేని కామెంట్స్
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధమవుతున్న వేళ విజయవాడ టీడీపీలో వర్గ పోరు మళ్ల తెరపైకి వచ్చింది. ముఖ్యంగా విజయవాడ మేయర్ సీటుకు టీడీపీ తరఫున ఇప్పటికే ఎంపీ కేశినేని నాని కుమార్తె శ్వేతను బరిలోకి దింపాలని టీడీపీ నిర్ణయించింది. అయితే ఇందుకు సుముఖంగా లేని మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ పార్టీలో మరికొందరితో కలిసి వర్గ రాజకీయాలకు తెరతీస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో బోండాతో పాటు ఇతర నేతల తీరుపై ఇవాళ కేశినేని తీవ్రంగా మండిపడ్డారు.
బెజవాడ టీడీపీలో వర్గపోరు
పంచాయతీ ఎన్నికలు ముగిశాక వచ్చే నెలలో మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్దమవుతున్న నేపథ్యంలో విజయవాడ టీడీపీలో వర్గపోరు మరోసారి తెరపైకి వచ్చింది. గత ఎన్నికల్లో వైసీపీ హవాలో ఇక్కడ టీడీపీకి చెందిన గద్దె రామ్మోహన్ మాత్రమే ఎమ్మెల్యేగా ఎన్నిక కాగా.. ఎంపీగా అతికష్టం మీద కేశినేని నాని గెలిచారు. కృష్ణాజిల్లాలోనూ వీరిద్దరూ మినహా మిగతా టీడీపీ నేతలంతా ఓడిపోయారు. ఈ నేపథ్యంలో గతేడాది మొదలైన మున్సిపల్ ఎన్నికల్లో ఎంపీ కేశినేని కుమార్తె శ్వేతకు టీడీపీ విజయవాడ మేయర్ అభ్యర్ధిగా ప్రకటించింది. అయితే అప్పట్లో దీనిపై మాట్లాడని ఇతర నేతలు, ఇప్పుడు మాత్రం ఆమెకు వ్యతిరేకంగా వర్గపోరు ప్రారంభించినట్లు తెలుస్తోంది.
చంద్రబాబు వద్దంటే శ్వేత నామినేషన్ వెనక్కి
విజయవాడ ఎంపీ కేశినేని నాని కుమార్తె కేశినేని శ్వేతను మేయర్ అభ్యర్ధిగా టీడీపీ నిలబెట్టడంపై స్ధానిక తూర్పు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్తో పాటు సెంట్రల్లో ఓడిన మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ కూడా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.. దీనిపై ఇవాళ ఓ టీవీ ఛానల్తో మాట్లాడిన కేశినేని నాని తమ కుమార్తె వద్దని అధినేత చంద్రబాబు చెబితే నామినేషన్ వెనక్కి తీసుకుంటానని ప్రకటించడం సంచలనంగా మారింది. బోండా, గద్దె కుటుంబాల నుంచి మేయర్ అభ్యర్ధిని నిలబెట్టుకోవచ్చని సూచించారు.
ఓడిపోయిన ఎమ్మెల్యేలు సామంతరాజుల్లా వ్యవహరిస్తున్నారంటూ
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత బోండా ఉమామహేశ్వరరావుపై కేశినేని నాని ఇవాళ విరుచుకుపడ్డారు. వర్గమే లేనితో ఆయనతో వర్గపోరు ఎలా ఉంటుందని నాని ప్రశ్నించారు. అలాగే ఓడిపోయిన ఎమ్మెల్యేలు కూడా సామంత రాజుల్లా వ్యవహరిస్తున్నారంటూ కేశినేని నాని తీవ్ర విమర్శలు చేశారు. ఎంపిగా గెలిచిన తనను తమ నియోజకవర్గాల్లో ప్రచారానికి రావాలంటే చెప్పి రావాలంటున్నారని మండిపడ్డారు. దీంతో కేశినేని వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి.