టిడిపి నేతల తీరుతో జగన్ పార్టీకి ప్రయోజనం, తీరు మారకపోతే చంద్రబాబుకు కష్టమే
చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి అయితే శాంతిభద్రతలు అదుపులో ఉంటాయని, అరాచకానికి తెరపడుతోందనుకొన్న ప్రజల నమ్మకాన్ని టిడిపి నాయకులు వమ్ముచేస్తున్నారు.ప్రజల్లో సంపాదించుకొన్న ఇమేజీని కొందరు నాయకులు డ్యామేజీ
అమరావతి:చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి అయితే శాంతిభద్రతలు అదుపులో ఉంటాయని, అరాచకానికి తెరపడుతోందనుకొన్న ప్రజల నమ్మకాన్ని టిడిపి నాయకులు వమ్ముచేస్తున్నారు.ప్రజల్లో సంపాదించుకొన్న ఇమేజీని కొందరు నాయకులు డ్యామేజీ చేస్తున్నారని పార్టీ శ్రేణుల్లో ఆందోళన వ్యక్తమౌతోంది.
పదేళ్ళపాటు అధికారానికి దూరంగా ఉన్న టిడిపి నాయకులు ప్రజాక్షేతంలో రెచ్చిపోతున్న తీరు పార్టీ పరువుతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రజల్లో సంపాదించుకొన్న ఇమేజీని దెబ్బతీస్తున్నారని పార్టీ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి.
తాజాగా విజయవాడలో రవాణాశాఖ కమిషనర్ బాలసుబ్రమణ్యంపై టిడిపి ఎంపి కేశినేని నాని, ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, ఎమ్మెల్యీ బుడ్డా వెంకన్న , నాగుల్ మీరా చేసిన దాడి పార్టీ పరువును తీసిందనే భావన పార్టీ శ్రేణుల్లో వ్యక్తమౌతోంది.
రాష్ట్రంలో అక్రమ పద్దతుల్లో నడుస్తున్న ప్రైవేట్ బస్సులపై స్వంత పార్టీ ఎంపి కేశినేని నాని చేసిన ఆరోపణలు, నందిగామ వద్ద జరిగిన బస్సు ప్రమాద ఘటనపై వైసిపి అధినేత జగన్ చేసిన ఆరోపణలు కూడ ఒకటే కావడంతో పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి.
వైసిపి నేతలకు, టిడిపి నేతలకు వేర్వేరు నియమాలా?
నందిగామలో వైసిపి అధినేత జగన్ పై కేసులు పెట్టింది ప్రభుత్వం. రవాణాశాఖ కమిషనర్ బాలసుబ్రమణ్యం గన్ మెన్ పై టిడిపి నాయకులు దాడి చేయడంపై ప్రభుత్వం ఎందుకు కేసులు పెట్టలేదని వైసిపి నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఈ దాడి ఘటన ప్రసారసాధనాల్లో వచ్చింది.ఈ రెండు ఘటనలను ప్రజలు గమనిస్తారు. విపక్షానికి అస్త్రాలను తాము ఇస్తున్నామని ఓ పార్టీ సీనియర్ నాయకుడు అభిప్రాయపడ్డారు.
విచ్చలవిడితనం వల్లే ఇతర వర్గాలు పార్టీకి దూరం
కోస్తాకు చెందిన కొందరు పార్టీ నాయకులు వ్యవహరిస్తున్న తీరుతో ఇతర వర్గాలు పార్టీకి దూరమయ్యే పరిస్థితి ముంచుకొచ్చిందని టిడిపి సీనియర్ నాయకుడు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితులన్నీ పార్టీకి నష్టం చేస్తున్నాయని ఆయన చెప్పారు.రాష్ట్రంలో రౌడీరాజ్యం నడుస్తోందన్న విపక్షాల ఆరోపణలను నిజం చేయడమే అవుతోందని ఆయన అభిప్రాయపడుతున్నారు.
ప్రజా ప్రతినిధుల వారసుల పనులతో నష్టం
ఎమ్మెల్యేలు, మంత్రులు, పార్టీకి చెందిన సీనియర్లు, ఇతర ప్రముఖులు వారి వారసులు చేస్తోన్న పంచాయితీలు, అరాచకాలతో ఇప్పటికే వివిధ వర్గాలు పార్టీకి దూరమౌతున్నాయని పార్టీ సీనియర్లు కొందు అభిప్రాయపడుతున్నారు.ఇలాంటి చర్యలతో ఉద్యోగులు కూడ కూడ పార్టీకి దూరం కావడం ఖాయమనే ఆందోళనను వారు వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలే జరిగిన టీచర్, గ్రాడ్యుయేట్ నియోజకవర్గాల నుండి శాసనమండలికి జరిగిన ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా తీర్పు వచ్చిన విషయాన్ని సీనియర్లు ప్రస్తావిస్తున్నారు.
వైసిపి ప్రచారాస్త్రాలు ఇస్తోన్న టిడిపి నాయకులు
అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టేందుకుగాను వైసిపి చేస్తున్న ప్రయత్నాలకు ఊతమిచ్చేలా టిడిపి ప్రజా ప్రతినిధులు వ్యవహరిస్తున్నారని సీనియర్లు అభిప్రాయపడుతున్నారు. రవాణ శాఖ కమిషనర్ పై దాడి చేసి తిరిగి వారికి క్షమాపణ చెప్పడంతో తాము తప్పు చేసినట్టే అయిందని పార్టీ సీనియర్లు విశ్లేషిస్తున్నారు. కోస్తా జిల్లాల్లో ప్రధానంగా కృష్ణా, గుంటూరు జిల్లాల నేతల దాదాగిరి చర్యలతో పార్టీనే ఇబ్బందులు పడుతోందని ఇతర జిల్లాల నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
క్రమశిక్షణ చర్యలు తీసుకోంటే పార్టీ ఇమేజీ పెరిగేది
విజయవాడలో రవాణశాఖ కమిషనర్ బాలసుబ్రమణ్యంపై టిడిపి ఎంపి కేశినేని నాని ఇతర ప్రజా ప్రతినిధులు దాడి చేసిన ఘటనపై పార్టీ అధినేత చంద్రబాబునాయుడు క్రమశిక్షణ చర్యలు తీసుకొంటే బాగుండేదని కొందరు నాయకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ విషయంలో కమిషనర్ కు క్షమాపణ చెప్పి వదిలేయడంలో పార్టీపై బాబుకు పట్టు తప్పుతోందనే భావన ఏర్పడేందుకు దారితీస్తోందనే అభిప్రాయాలను కొందరు పార్టీ నాయకులు వ్యక్తం చేస్తున్నారు.రవాణ శాఖ కమిషనర్ పై దాడి ఘటనలో క్షమాపణతో పరిస్థితి కొంత సద్దుమణిగినట్టు కన్పించినా వ్యతిరేక భావనలను పోగొట్టడం కష్టమేనని పార్టీ నాయకులు అభిప్రాయపడుతున్నారు.బాబును గెలిపిస్తే శాంతిభద్రతల పరిస్థితి బాగుంటుందని , రౌడీయిజానికి కళ్ళెం వేస్తారని విశ్వసించిన ప్రజల్లో టిడిపి నాయకుల వ్యవహరశైలితో శాంతి భద్రతలకు విఘాతం కల్గిస్తున్నారరే భావన పెరగడం పార్టీకి మంచిదికాదని సీనియర్లు అభిప్రాయపడుతున్నారు. ఈ విషయమై చంద్రబాబునాయుడు కేంద్రీకరించాలని కోరుతున్నారు..