విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్..గ్రేట్ డెసిషన్: బసవపున్నయ్య స్టేడియంలో..బరి దాటితే భారీ ఫైన్..!
విజయవాడ: ప్రాణాంతక కరోనా వైరస్ విస్తరిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కఠిన చర్యలను అనుసరిస్తున్నారు. లాక్డౌన్ ప్రకటించిన నేపథ్యంలో.. నిబంధనలను ఉల్లంఘించిన దుకాణాలను ఇప్పటికే సీజ్ చేసి పారేసిన కార్పొరేషన్ అధికారులు.. మరో సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. ప్రజలను సోషల్ డిస్టెన్సింగ్ పాటించేలా ఆదేశాలను జారీ చేశారు. దీన్ని ఉల్లంఘించిన వారిపై భారీ జరిమానాను విధిస్తామని హెచ్చరించారు.
కరోనా విజృంభణకు బ్రేక్: మందు దొరికినట్టే:ఆ డ్రగ్ ఎగుమతులపై కేంద్రం నిషేధం:రాత్రికి రాత్రి ఉత్తర్వులు
సామాజిక దూరం కోసమే..
భయానక కరోనా వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తిం చెందాకుండా నిరోధించడం వల్ల ఈ మహమ్మారిని తరిమి కొట్టవచ్చని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేస్తున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని దేశవ్యాప్తంగా లాక్డౌన్ను ప్రకటించాయి. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా అన్ని రాష్ట్రాలు కూడా దీన్ని అమలు చేస్తున్నాయి. సోషల్ డిస్టెన్సింగ్ పాటించడం కష్టతరమౌతుందనే ఉద్దేశంతోనే ప్రజలు తమ ఇళ్ల గుమ్మాలను దాటి బయటికి రానివ్వకుండా కట్టుదిట్టమైన చర్యలను తీసుకున్నాయి.
సోషల్ డిస్టెన్సింగ్ తప్పనిసరి..
ప్రజలు తమ నిత్యావసర సరుకులను కొనుగోలు చేయడానికి లాక్డౌన్ కొనసాగినన్ని రోజులూ తెల్లవారు జామున 6 గంటల నుంచి ఉదయం 9 గంటల వరకు మార్కెట్లను తెరిచి ఉంచడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఆ మార్కెట్ల నిర్వహణ బాధ్యతను స్థానిక సంస్థలకు అప్పగించింది. ఈ నేపథ్యంలో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు నగరంలోని అజిత్సింగ్ నగర్లోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో ప్రత్యేకంగా మార్కెట్లను ఏర్పాటు చేశారు.
గిరిగీసిన చోటే కొనుగోలుదారులు నిల్చోవాల్సిందే..
మాకినేని బసవ పున్నయ్య స్టేడియానికి వచ్చే వారు సామాజిక దూరాన్ని పాటించడం కోసం ప్రత్యేకంగా అధికారులు ముగ్గుతో గిరి గీశారు. ఆ సర్కిల్లోనే నిల్చోవాలని ఆదేశించారు. ఒక్క సర్కిల్ మధ్య దూరం ఒకటిన్నర మీటర్ వరకు ఉంటోంది. ఆ సర్కిల్లోనే నిల్చోవాలని, దాన్ని దాటి బయటికి వస్తే.. కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు. అలా బయటికి వచ్చిన వారికి భారీగా జరిమానా విధిస్తామని చెబుతున్నారు.
Recommended Video
వందలాది మంది బెజవాడవాసులు..
నిత్యావసర సరుకులను కొనుగోలు చేయడానికి బుధవారం తెల్లవారు జామున 6 గంటలకే విజయవాడవాసులు మాకినేని బసవపున్నయ్య స్టేడియానికి చేరుకున్నారు. అయినప్పటికీ.. ఎక్కడా గుమికూడటం గానీ, తోపులాట గానీ చోటు చేసుకోలేదు. దీనికి కారణం- సోషల్ డిస్టెన్సింగే. ముందుగానే వేసిన సర్కిళ్లలో నిల్చొన్నారు. సామాజిక దూరాన్ని తప్పనిసరిగా పాటించాలని మైకుల ద్వారా అధికారులు ప్రకటనలు చేస్తున్నారు.