ఎపి పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి...విజయవాడలో అరెస్ట్!
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కోరుతూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా జాతీయ రహదారుల దిగ్భందం కార్యక్రమం చేపట్టింది.ఈ ఆందోళన కార్యక్రమంలో పాల్గొనేందుకు గాను విజయవాడ వచ్చిన ఆ పార్టీ అధ్యక్షుడు రఘువీరారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జాతీయ రహదారుల దిగ్బంధనం జరిగింది. విజయవాడలో ఈ ఆందోళనలో పాల్గొన్నఏపీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డితో సహా పలువురు కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేసి కంకిపాడు పోలీస్ స్టేషన్ కు తరలించారు.
విభజన హామీలు అమలు చేసేంత వరకు తమ పోరాటం కొనసాగుతుందని, స్వాతంత్ర్య పోరాటం స్ఫూర్తితోనే ప్రత్యేక హోదా కోసం పోరాడుతామని ఎపి పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. అలాగే రాష్ట్ర హక్కుల కోసం ఎవరితోనైనా కలిసి పనిచేస్తామని రఘువీరారెడ్డి అన్నారు.
ప్రత్యేక హోదా కోసం చేపడుతున్న ఆందోళనల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈనెల 6,7,8 తేదీల్లో పార్లమెంట్ ముట్టడి జరగనుంది. అయితే ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నేతలు మీడియాతో మాట్లాడుతూ తమని ఎన్నిసార్లు అరెస్ట్ చేసినా ప్రత్యేక హోదా కోసం తమ పార్టీ పోరాటం ఆగదని, కొనసాగుతూనే ఉంటుందని స్పష్టం చేశారు.