మరో 75 రోజులు: బెజవాడకు ఆ ఇబ్బందులు తప్పవు.. ఓపిక పట్టాల్సిందే
ఫ్లై ఓవర్ నిర్మాణ పనుల సందర్భంగా ఏర్పడిన ట్రాఫిక్ ఇబ్బందుల నుంచి బయటపడేందుకు మరో 75 రోజులు ఓపిక పట్టాలని కమిషనర్ గౌతమ్ నవాంగ్ కోరారు.
విజయవాడ: .కనకదుర్గ ఫ్లై ఓవర్ నిర్మాణ పనుల నేపథ్యంలో బెజవాడ వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ట్రాఫిక్ను దారి మళ్లించడంతో అసౌకర్యానికి గురవుతున్నారు. మరోవైపు ఫ్లైఓవర్ నిర్మాణ పనుల్లోను తీవ్ర జాప్యం జరుగుతుండటంతో అధికారులపై వారు మండిపడుతున్నారు.
విజయవాడ పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్ ఈ సమస్యలపై స్పందించారు. ఫ్లై ఓవర్ నిర్మాణ పనుల సందర్భంగా ఏర్పడిన ట్రాఫిక్ ఇబ్బందుల నుంచి బయటపడేందుకు మరో 75 రోజులు ఓపిక పట్టాలని కోరారు. ఆదివారం కనకదుర్గ ఫ్లై ఓవర్ నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. అలాగే ట్రాఫిక్ మళ్లింపులను కూడా పర్యవేక్షించారు.
విద్యాధరపురం కుమ్మరిపాలెం సెంటర్ నుంచి హెడ్ వాటర్ వర్క్స్ వరకు కమిషనర్ కాలినడకనే కలియతిరిగారు. ఈ సందర్భంగా సోమా కంపెనీ ప్రతినిధులు, ఆర్అండ్బీ అధికారులతో పలు విషయాలు చర్చించారు. బెజవాడ ప్రజలు ట్రాఫిక్ సమస్యలు ఎదుర్కొంటున్నప్పటికీ.. ఫ్లై ఓవర్ పూర్తయేంతవరకు ఓపిక పట్టాల్సిందేనన్నారు.
ఫ్లైఓవర్ నిర్మాణ పనులు జరుగుతున్న ప్రదేశాలను మినహాయించి, మిగతా మార్గాల్లో ట్రాఫిక్ ను మళ్లించేందుకు చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న తెలిపారు. నిర్మాణ పనుల్లో జాప్యం జరుగుతున్న మాట వాస్తవమేనని అంగీకరించారు. అయితే దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఈ నిర్మాణం జరుగుతోందని, ఆ క్రమంలో తలెత్తిన సాంకేతిక కారణాల వల్లే జాప్యం జరుగుతోందని అన్నారు.