వీడియో: సేదతీరుతున్న బ్లేజ్ వాడ: ప్రకాశం బ్యారేజీకి పోటెత్తిన జనం!
విజయవాడ: విజయవాడలో స్థిరపడాలీ అంటే ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తుంటారు పొరుగు జిల్లాల ప్రజలు. దీనికి ప్రధాన కారణం.. వేసవిలో అక్కడ ఏర్పడే ఎండ తీవ్రత. వేసవిలో విజయవాడలో 40-45 డిగ్రీల ఉష్ణోగ్రత సర్వ సాధారణం. ఉక్కపోత దీనికి తోడు అవుతుంటుంది. ఇంట్లో కూర్చోలేని పరిస్థితి.. బయట అడుగు పెట్టలేని దుస్థితిని అనుభవిస్తుంటారు బెజవాడ వాసులు. అందుకే ఈ నగరానికి బ్లేజ్ వాడ అని అంటుంటారు. అలాంటి విజయవాడ ప్రస్తుతం కృష్ణానదికి సంబంవించిన వరదపోటుతో సేద దీరుతోంది. వాతావరణం చల్లగా మారడంతో నగర వాసులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీ కృష్ణమ్మ పరవళ్లను తిలకించడానికి పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు. ఆదివారం సెలవురోజు కావడంతో ప్రకాశం బ్యారేజీ వద్ద ఏర్పాటు చేసిన ఘాట్లు సందర్శకులతో పోటెత్తుతున్నాయి.
కృష్ణమ్మ పరవళ్లతో పరవశం
ఎగువ నుంచి భారీగా వరద నీరు ప్రకాశం బ్యారేజ్ రిజర్వాయర్కు వచ్చి చేరుతుండటంతో మంగళవారం సందర్శకుల తాకిడి పెరిగింది. జలకళను వీక్షించేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో బ్యారేజ్, సీతానగరం వద్దకు చేరుకుంటున్నారు. సెల్ఫీలు తీసుకుంటూ సందడి చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీ, పద్మావతి ఘాట్, పున్నమి ఘాట్లు సందర్శకులతో కిటకిటలాడుతున్నాయి. గుంటూరు జిల్లాలోని సీతానగరం సమీపంలో కృష్ణా తీరం ఒడ్డున నిర్మించిన పుష్కరఘాట్ల వద్దకు కూడా సందర్శకులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. సెల్ఫీలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉన్నందున పోలీసులు గస్తీని ఏర్పాటు చేశారు. ఘాట్ల వరకు ప్రవహిస్తోన్న నది వద్దకు సందర్శకులను ఎవ్వరినీ పోనివ్వట్లేదు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది సైతం ఘాట్ల వద్ద విధి నిర్వహణలో ఉన్నారు.
బోటింగ్ నిలిపివేత..
కృష్ణానదిలో విహారానికి బ్రేక్ పడింది. కృష్ణాలో బోటింగ్ ను అధికారులు రద్దు చేశారు. వరద ప్రవాహం తగ్గేంత వరకూ ఇదే పరిస్థితి కొనసాగుతుందని తెలిపారు. సాాధారణంగా కృష్ణానదిలో బోటింగ్ కు సందర్శకుల తాకిడి అధికంగా ఉంటుంది. శని, ఆదివారాల్లో జనం పెద్ద సంఖ్యలో బోటింగ్ కోసం వస్తుంటారు. ప్రస్తుతం కృష్ణానది వరద ప్రవాహంతోొ పోటెత్తుతున్నందు.. బోటింగ్ ను నిషేధించారు పర్యాటకాభివృద్ధి సంస్థ అధికారులు. బోధిసిరి డబుల్ డెక్కర్, భవానీ, కృష్ణవేణి, ఆమ్రపాలి బోట్లలో విహరించడాన్ని నిలిపివేశారు. ఫలితంగా- భవానీ ద్వీపం కూడా బోసిపోయింది. వరద కారణంగా భవానీ ద్వీపంలోని కాటేజీలు ఎప్పుడో ఖాళీ అయ్యాయి. కృష్ణానదికి పోటెత్తుతున్న వరద కారణంగా కృష్ణా, గుంటూరు జిల్లాల యంత్రాంగాలు అప్రమత్తం అయ్యాయి. కృష్ణలంక ఇప్పటికే మునిగిపోయింది. మంత్రులు ఈ ప్రాంతంలో పర్యటించారు. లోతట్టు ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
బ్యారేజీ మీదుగా వాహనాల రాకపోకలు బంద్..
కృష్ణానది వరద ప్రవాహాన్ని దృష్టిలో ఉంచుకుని ఇప్పటికే ప్రకాశం బ్యారేజీ మీదుగా వాహనాల రాకపోకలను నిషేధించారు అధికారులు. సుమారు ఎనిమిది లక్షలకు పైగా క్యూసెక్కుల వరద నీరు పులిచింతల నుంచి ప్రకాశం బ్యారేజీకి చేరుకుంటోంది. దీనివల్ల బ్యారేజీ వంతెన అంచులను తాకేలా ప్రవహిస్తోంది కృష్ణమ్మ. బ్యారేజ్ బలహీనంగా ఉందంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఫోర్ వీలర్స్.. ఆటోలు బ్యారేజీ పైకి వెళ్లకుండా నిషేదాజ్ఞలు విధించారు. భారీ స్థాయిలో నీరు ప్రకాశం బ్యారేజీకి చేరడంతో ముందు జాగ్రత్తగానే హెచ్చరికలు జారీ చేసినట్టు అధికారులు చెబుతున్నారు. ఆదివారం సాయంత్రానికి కృష్ణానదికి వరద ప్రవాహం తగ్గుముఖం పట్టొచ్చని తెలుస్తోంది. దీనికి అనుగుణంగా అవుట్ ఫ్లోను నియంత్రిస్తామని జిల్లా పాలనా యంత్రాంగం స్పష్టం చేస్తోంది. ఎంత మేర అవుట్ ఫ్లో ఉండొచ్చనే విషయాన్ని ఖచ్చితంగా అంచనా వేయలేమని చెబుతున్నారు.