విజయవాడ రైల్వేస్టేషన్ అభివృద్ధి:ప్రైవేట్ సంస్థల గొంతెమ్మ కోరికలు...ఖంగుతిన్న రైల్వే శాఖ అధికారులు
విజయవాడ:దక్షిణ మధ్య రైల్వే పరిధిలోనే అతి పెద్ద రైల్వే జంక్షన్ అయిన విజయవాడలో మెయిన్ రైల్వేస్టేషన్ అభివృద్ధి చేసేందుకు ప్రైవేట్ సంస్థల సహకారం తీసుకోవాలని భావించిన రైల్వే శాఖ అధికారుల ప్రయత్నం బెడిసికొట్టంది.
ఈ అభివృద్ది పనులు చేసేందుకు ప్రైవేటు సంస్థలు గొంతెమ్మ కోరికలు కోరడంతో వారి షరతులు చూసి రైల్వే శాఖ అధికారులు ఖంగుతిన్నారు. రైల్వేస్టేషన్ అభివృద్ధి నిర్వహణ 10,15 ఏళ్లయితే చాలదని...ఏకంగా 99 సంవత్సరాల కాలానికి తమకు అప్పగించాలని ఇన్వెస్టర్లు కోరడం ఆ షరతుల్లో మచ్చుకు ఒకటి. వారి షరతులు ఏమాత్రం మింగుడుపడని అధికారులు ప్రైవేట్ కి అప్పగింతల ప్రక్రియను ప్రస్తుతానికి పక్కన పెట్టినట్టు సమాచారం. వివరాల్లోకి వెళితే...
అభివృద్ది ప్రైవేట్ కి...నిర్ణయం
విజయవాడ రైల్వేస్టేషన్ను కార్పొరేట్ హంగులతో అభివృద్ధి చేయటానికి, కమర్షియల్గా తీర్చిదిద్దటానికి ప్రైవేటు ఇన్వెస్టర్లకు అప్పగించాలని రైల్వే శాఖ అధికారులు నిర్ణయించారు. విజయవాడ డివిజన్ పరిధిలో ఎ ప్లస్ కేటగిరి రైల్వేస్టేషన్గా ఉన్న విజయవాడ మొయిన్ స్టేషన్తో పాటు, పలు ఎ కేటగిరీ స్టేషన్లను ప్రైవేటు ఇన్వెస్టర్ల చేత అభివృద్ధి చేయాలని రైల్వే శాఖ అధికారులు భావించారు. ఆ క్రమంలోనే కొన్ని ప్రైవేటు సంస్థల ప్రతినిధులతో రైల్వే శాఖ అధికారులు రహస్య సమావేశం నిర్వహించి తమ ఆలోచనను వారి ముందుంచినట్లు తెలిసింది.
స్టేషన్ ఇచ్చేందుకు...రహస్య సమావేశం...
ఇప్పటికే వివిధ రకాలుగా తమ శాఖలో ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహిస్తున్న రైల్వే శాఖ తాజాగా మౌలిక సదుపాయాల కల్పన రంగానికి సంబంధించి కూడా పూర్తిస్థాయి ప్రైవేటు దిశలో అడుగులు వేయటం ఇదే మొదటిసారని తెలుస్తుంది. ఇప్పటికే రైల్వేలో ఆపరేషన్ మినహా మిగిలిన విభాగాలన్నీ ప్రెవేటీకరణ బాటపట్టాయి. రైల్వే టిక్కెట్ల బుకింగ్, టిక్కెట్ల జారీ, ఆన్లైన్ విధానంలో టిక్కెట్లు,క్యాటరింగ్ సర్వీసులు, టూర్ సర్వీసులు,వెయిటింగ్ హాల్స్, మాల్స్ వంటి విభాగాలన్నీ ప్రైవేటుపరం అయ్యాయి. ఆఖరుకు హమాలీల వ్యవస్థను కూడా రైల్వే శాఖ ప్రైవేటుపరం చేసేసింది.అంతేకాదు రైల్వే స్టేషన్లను కమర్షియల్గా అభివృద్ధి చేసే క్రమంలో విలువైన రైల్వే భూములను ప్రైవేటు సంస్థల చేతుల్లో పెట్టిన అధికారులు తాజాగా విజయవాడ రైల్వేస్టేషన్ అభివృద్ది మొత్తాన్ని కూడా ప్రైవేటు సంస్థకే అప్పగించాలని నిర్ణయించడం గమనార్హం.
రైల్వే శాఖ...ప్రతిపాదనలు ఇవి
విజయవాడ మెయిన్ రైల్వేస్టేషన్ను మరింత అభివృద్ధి చేయడం,ఆధునికీకరించడం కోసం...మోడరన్ వెయిటింగ్ హాల్స్, ఫుట్ బ్రిడ్జిలు, ప్లాట్ ఫామ్ల విస్తరణతో పాటు ఈ రైల్వేస్టేషన్లో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో లిఫ్టులు, ఎస్క్ లేటర్లు, స్వీపింగ్, యూరినల్స్, టాయ్లెట్స్ వంటివి ఉన్నత ప్రమాణాలతో అభివృద్ధి చెయ్యాలని, వీటికి సంబంధించి తమ ప్రణాళికలను రైల్వే అధికారులు ప్రైవేటు సంస్థలతో జరిగిన ఏకాంత సమావేశంలో వారి ముందుంచినట్లు సమాచారం. అందుకు ప్రతిగా వారికి రైల్వేస్టేషన్లో కమర్షియల్ స్పేస్ను డెవలప్ చేసుకునే అవకాశం కల్పిస్తామని...తద్వారా వచ్చే ఆదాయంలో తమకు కూడా కొంత రాయల్టీ చెల్లించాలన్న రైల్వే శాఖ అధికారులు కోరినట్లు తెలిసింది.
ఒక్క షరతుతోనే...దిమ్మ తిరిగింది
ఆ సమావేశం సందర్భంగా రైల్వేస్టేషన్ను ఎలా అభివృద్ధి చేశారు, కమర్షియల్ స్పేస్ యుటిలైజేషన్ ఎలా చేస్తారు?...తదిదర అంశాలపై తమకు నివేదిక ఇవ్వాల్సిందిగా రైల్వే అధికారులు ఆయా ప్రైవేట్ సంస్థలను కోరినట్లు తెలిసింది. ఇందుకుగాను రైల్వే స్టేషన్ ను 10,15 ఏళ్లు అప్పగిస్తామని చెప్పారట. అయితే అందుకు ప్రతిగా వారి నుంచి వచ్చిన మొదటి షరతే రైల్వే అధికారులకు దిమ్మతిరిగేలా చేసిందని సమాచారం. విజయవాడ రైల్వే స్టేషన్ మీరు కోరిన విధంగా అభివృద్ది చేయడంలో తమకు అభ్యంతరం లేదని...అయితే రైల్వే స్టేషన్ ని 10,15 ఏళ్లకు కాకుండా 99 సంవత్సరాలు అప్పగించాలని వారు తమ నివేదికలో షరతు విధించటంతో రైల్వే అధికారులు ఖంగుతిన్నారట. ఇంత సుదీర్ఘకాలం ప్రైవేటు సంస్థలకు అప్పగించే ఆలోచనే లేని రైల్వే అధికారులు పునరాలోచనలో పడి రైల్వే స్టేషన్ అభివృద్ది విషయాన్ని ప్రస్తుతానికి పక్కన పెట్టినట్టు తెలిసింది.
ముందే మాస్టర్ ప్లాన్...మరి ఏమైంది?
వాస్తవానికి విజయవాడ రైల్వేస్టేషన్ అభివృద్ధికి రైల్వే అధికారులు ముందే ఒక మాస్టర్ ప్లాన్ రూపొందించారని తెలిసింది. రైల్వేస్టేషన్ ను ఆధునీకరించేందుకు రూ.40 కోట్ల అంచనాతో ప్రతిపాదనలు సైతం సిద్ధం చేశారని సమాచారం. ఇందులో భాగంగా ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, నూతన ప్లాట్ఫామ్లు, ఎస్కలేటర్లు, లిఫ్టులు, వెయిటింగ్ హాల్స్ విస్తరణ, రెస్ట్రూమ్స్ రెన్నోవేషన్, స్మార్ట్ పార్కింగ్ వంటివి సొంత నిధులతో ఏర్పాటు చేయాలని నిర్ణయించిన వారే...ఆ తరువాత ఏమైందో ఏమో మొత్తం స్టేషన్ను ప్రైవేటు సంస్థలకు అప్పగించాలని భావించడం అనుమానాలకు తావిస్తోంది. కమర్షియల్ యాక్టివిటీ పెంచటానికి కొన్ని అంశాల్లో ప్రైవేట్ సంస్థల తోడ్పాటు తీసుకున్నా...అభివృద్ధి పనులకు సంబంధించి మాత్రం ఇప్పటివరకు రైల్వేశాఖ ప్రైవేటీకరణ దిశగా వెళ్లలేదు. మరి అలాంటి ఉన్నట్టుండి రైల్వేస్టేషన్ మొత్తంగా ప్రైవేటు సంస్థల చేతుల్లో పెట్టాలన్న నిర్ణయం అధికారులు ఎందుకు తీసుకున్నారో వారే వెల్లడించాల్సి ఉంది.
మరోవైపు...కార్మిక సంఘాలు భగ్గు
ఇదిలావుంటే విజయవాడ ప్రధాన రైల్వేస్టేషన్ను ప్రైవేటు పరం చేయాలని రైల్వే ఉన్నతాధికారులు ఆలోచన చేయటంపై కార్మిక సంఘాలు భగ్గుమంటున్నాయి. ఇప్పటికే రైల్వేలో ఒక్క అపరేషన్ విభాగం తప్ప మొత్తంగా అన్నీ ప్రైవేటుపరం చేస్తున్నారని...ఇప్పుడు తాజాగా రైల్వేస్టేషన్మొత్తాన్ని ప్రైవేటు సంస్థల చేతుల్లో పెట్టడమంటే మామూలు విషయం కాదని...అసాధారణ నిర్ణయమని కార్మిక సంఘాల నేతలు మండిపడుతున్నారు. ఇలాగే ఉంటే రానున్న రోజుల్లో ఆపరేషన్ను కూడా ప్రైవేటు సంస్థలకు అప్పగించినా ఏమాత్రం ఆశ్చర్యపడాల్సిన పని లేదని, అయితే ఈ విధానాలను తాము చూస్తూ ఊరుకోమని...పోరాటం చేస్తామంటూ పలు కార్మిక సంఘాల నేతలు హెచ్చరిస్తున్నారు.