విజయవాడ, వైజాగ్ లాక్ డౌన్ తో స్తంభించనున్న ఆర్ధిక కార్యకలాపాలు- భారీ నష్టం తప్పదా ?
కరోనా వైరస్ ప్రభావం నేపథ్యంలో దేశవ్యాప్తంగా 75 జిల్లాల్లో లాక్ డౌన్ విధించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ఏపీపై పెను ప్రభావం చూపబోతోంది. కరోనా పాజిటివ్ కేసులు నమోదైన విజయవాడ, విశాఖ నగరాల్లో లాక్ డౌన్ విధించడం వల్ల ఆర్ధిక కార్యకలాపాలకు తీవ్ర విఘాతం కలగబోతోంది. ముఖ్యంగా రవాణా రంగంతో ముడిపడిన రాష్ట్ర ఆర్ధిక రంగంపై ఈ నిర్ణయం తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఆర్ధిక కేంద్రాలు విజయవాడ, విశాఖ..
విభజన తర్వాత ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారీగా వనరుల కొరత ఉంది. హైదరాబాద్ కోల్పోవడంతో ఆర్ధిక కార్యకలాపాలకు విజయవాడ, విశాఖపైనే ఆధారపడాల్సిన పరిస్ధితి. అందులోనూ రోడ్డు, జల రవాణాకు ప్రధాన ఆధారమైన ఈ రెండు నగరాల ద్వారా వేల కోట్ల రూపాయల విలువైన రవాణా జరుగుతుంటుంది. ఇక్కడి మార్కెట్లు, ఓడ రేవుల నుంచి కోట్ల రూపాయల సరకు దేశవిదేశాలకు సైతం రవాణా అవుతుంటుంది. రాష్ట్రంలోని దాదాపు అన్ని ప్రాంతాలకు సరకు రవాణా విజయవాడ కేంద్రంగానే జరుగుతోంది. పప్పుదినుసులతో పాటు బియ్యం, నూనెలు కూడా ఇక్కడి నుంచే ఇతర ప్రాంతాలకు రవాణా అవుతాయి. అటు విశాఖ కేంద్రంగా కూడా జలరవాణాతో పాటు ఆర్ధిక కార్యకలాపాలు భారీగా జరుగుతుంటాయి.
ఆర్ధికరంగంపై లాక్ డౌన్ ప్రభావం
విజయవాడ, విశాఖ నగరాల కేంద్రంగా ఏపీలో జరిగే ఆర్ధిక కార్యకలాపాలే మిగతా నగరాలు, పట్టణాలకు ప్రాణాధారం. ఇక్కడి నుంచి జరిగే సరకు రవాణాతో పాటు కొనుగోళ్లు, అమ్మకాలు రాష్ట్ర ఆదాయంలో కీలక పాత్ర పోషిస్తుంటాయి. రాష్ట్రంలో మిగిలిన నగరాలు, పట్టణాలతో పోలిస్తే జీఎస్టీతో పాటు రిజిస్ట్రేషన్లు, ఇతర పన్ను వసూళ్లు కూడా ఈ రెండు జోన్లలో అధికంగా ఉంటాయి. అలాంటిది ఇప్పుడు కరోనా వైరస్ ప్రభావంతో ఇవాళ్టితో కలిపి పది రోజుల పాటు ఈ రెండు నగరాలు స్తంభించిపోతే భారీగా ఆర్ధిక రంగానికి నష్టం తప్పదనే అంచనాలు వెలువడుతున్నాయి.
ప్రభుత్వ ఆదాయానికీ గండి...
విజయవాడ కేంద్రంగా సాగే రోడ్డు, రైలు రవాణాతో పాటు విశాఖ కేంద్రంగా సాగే జల రవాణా, ఎగుమతులపై తాజాగా ప్రభుత్వం ప్రకటించిన లాక్ డౌన్ ప్రభావం పడబోతోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా పాసింజర్, ఎక్స్ ప్రెస్ రైలు సర్వీసులన్నీ రద్దయ్యాయి. రాష్ట్రంలో బస్సు సర్వీసులు కూడా నిలిచిపోయాయి. రేపటి నుంచి వస్తు రవాణా కూడా నిలిచిపోతుంది. దీంతో వీటిపై ఆధారపడిన సగటు జీవులతో పాటు రాష్ట్ర ఆర్ధిక రంగం కూడా అతలాకుతలం కాక తప్పదు. ముఖ్యంగా రాష్ట్రానికి పన్నుల రూపంలో వచ్చే కోట్లాది రూపాయల ఆదాయానికి గండి పడుతుంది. దీన్ని పూడ్చుకోవాలంటే కనీసం మరో ఏడాదైనా పడుతుందని అంచనా వేస్తున్నారు.
ఆర్ధిక పరిస్ధితి అంతంతమాత్రం..
విభజన తర్వాత ఏపీకి దాదాపు 16 వేల కోట్లకు పైగా రెవెన్యూ లోటు ఉంది. దీన్ని భర్తీ చేయడానికి ఇప్పటివరకూ కేంద్రం ముందుకు రాలేదు. ఈ లోటు అంతకంతకూ పెరుగుతూ పోతోంది. మరోవైపు పన్నుల ఆదాయంలో రాష్ట్రాల వాటా కూడా తగ్గింది. ఇప్పుడు కరోనా ప్రభావం నేపథ్యంలో తప్పనిసరి పరిస్ధితుల్లో లాక్ డౌన్ విధించాల్సి రావడం కచ్చితంగా ఆర్ధిక రంగానికి పెద్ద దెబ్బగా పరిణమించబోతోంది. అయినా రాష్ట్ర ప్రభుత్వం ఏమీ చేయలేని పరిస్ధితి. 9 రోజుల పాటు ఆర్ధిక కార్యకలాపాలు నిలిచిపోతాయన్న వార్త ఇప్పుడు విజయవాడతో పాటు విశాఖ నగరాల్లోని వ్యాపారులకు గుండెల్లో గుబులు రేపుతోంది. ఒకటి రెండు రోజులు సెలవులు వస్తేనే నష్టాన్ని లెక్కేసుకునే పరిస్ధితుల్లో ఏకంగా 9 రోజుల పాటు వ్యాపారాలు మూసుకోవాల్సి వస్తే ఇక తమ పరిస్ధితి ఏంటనే ఆవేదన వ్యాపారుల్లో కనిపిస్తోంది.