ఇది హైదరాబాద్ లవ్ స్టోరీ: రాజస్థాన్ అమ్మాయి-విజయవాడ అబ్బాయి! సాహసమే చేశారు
హైదరాబాద్/అమరావతి: ఆ అమ్మాయిది రాజస్థాన్. అబ్బాయిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ. వారిద్దరి మధ్యలో ప్రేమ పుట్టింది మాత్రం హైదరాబాద్లో. హైదరాబాద్ నగరంలో తరచూ వీరిద్దరు కలుసుకోవడం, మాట్లాడుకోవడం వీరి మధ్య ప్రేమ చిగురించింది.
ఈ క్రమంలో మూడు ముళ్ల బంధంతో ఒక్కటవ్వాలని నిర్ణయించుకున్నారు. అయితే, వారి పెళ్లికి పెద్దలు అంగీకరించలేదు. ఒకరిని వదిలి మరొకరిని ఉండలేని స్థితిలో ఉన్నవారిద్దరూ చివరకు పెద్దలను ఎదురించి పెళ్లి చేసుకున్నారు. అయితే, అమ్మాయి తరపు వారు రాజస్థాన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
రాజస్థాన్ అమ్మాయి హైదరాబాద్లో..
ఆ జంట ప్రేమ, పెళ్లి వివరాల్లోకి వెళితే.. విజయవాడకు చెందిన ఆలూరి రాజేష్ హైదరాబాద్లోని ఈసీఐఎల్ ప్రాంతంలో ఒక షోరూంలో పనిచేస్తున్నారు. రాజస్థాన్కు చెందిన ప్రియాంకను మిఠాయి దుకాణం నిర్వహించే ఆమె పెద్దనాన్న పెంచుకుంటున్నారు.
పరిచయం, ప్రేమగా... కానీ..
ఇరుగుపొరుగున ఉంటున్న రాజేష్, ప్రియాంకల మధ్య స్నేహబంధం ఏర్పడి, ప్రేమకు దారితీసింది. కాగా, ఈ విషయం తెలుసుకున్న పెద్దనాన్న నటుల్ ఉమ్మన్ ఆ యువతిని రాజస్థాన్కు పంపించేశారు.
రాజస్థాన్ వెళ్లిన రాజేష్.. పెళ్లితో..
ఆమె లేక ఉండలేని రాజేష్ ఏకంగా రాజస్థాన్ వెళ్లాడు. ఆ యువతిని వెంట తీసుకొని వచ్చి హైదరాబాద్ ఆర్యసమాజ్లో వివాహం చేసుకున్నారు. బాలిక తండ్రి కైలాష్ తమ కుమార్తెను కిడ్నాప్ చేశారని రాజస్థాన్ పుఫుబారా పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదుతో అరెస్ట్
కాల్డాటా ఆధారంగా రాచర్ల వచ్చిన రాజస్థాన్ పోలీసులు స్థానిక పోలీసులను ఆశ్రయించారు. అనుములవీడులోని బంధువుల ఇంటి వద్ద ఉన్న వీరిని అదుపులోకి తీసుకుని తహసీల్దారు ఎలిజబెత్రాణి వద్ద హాజరు పరిచారు. ఆమె వీరితో విడివిడిగా మాట్లాడాగా తాము వివాహం చేసుకున్నామని తెలిపారు.
రాజేష్తోనే ఉంటానన్న యువతి
యువతి విద్యార్హత ధ్రువీకరణ పత్రాలు, ఆధార్కార్డులను పరిశీలించగా ఆమె మేజర్గా నిర్ధరణ అయ్యింది. అంతేగాక, తాను రాజేష్ వద్దనే ఉంటానని యువతి స్పష్టం చేసింది. దీంతో చేసేదేం లేక, రాజస్థాన్ పోలీసులు వారిద్దరి వాంగ్మూలాలను నమోదు చేసుకుని, తిరిగి వెనక్కి వెళ్లిపోయారు.