వైసీపీ ఎంత దిగజారిందంటే.. షరీఫ్ బాత్రూమ్ వెళ్తే, విజయసాయి అక్కడే నిల్చున్నాడు: టీడీపీ ఎమ్మెల్సీ
ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో బుధవారం చోటు చేసుకున్న పరిణామాలు టీడీపీలో కోలాహలం నింపగా.. వైసీపీని డీలా పడేశాయి. మండలి ఛైర్మన్ 'సెలెక్ట్ కమిటీ' నిర్ణయాన్ని ఎలా ఎదుర్కోవాలని ముఖ్యమంత్రి జగన్ సహా వైసీపీ నేతలు తర్జనభర్జన పడుతున్నారు. మరోవైపు నిన్నటి పరిణామాలపై ఇరు పార్టీల మధ్య విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి. ఛైర్మన్పై చంద్రబాబు ఒత్తిడి తెచ్చారని వైసీపీ ఆరోపిస్తుంటే.. ఛైర్మన్పై వైసీపీ నేతలు దాడికి యత్నించారని టీడీపీ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
విజయసాయి రెడ్డి బాత్రూమ్ వద్దే నిల్చున్నారు : అర్జునుడు
శాసనమండలిలో వైసీపీ నేతలు అత్యంత దిగజారిపోయి వ్యవహరించారని ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు విమర్శించారు. ఆఖరికి ఛైర్మన్ షరీఫ్ బాత్రూమ్ వెళ్లినా సరే.. వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి డోర్ వద్దే నిల్చున్నారని అన్నారు. మతం పేరుతో షరీఫ్ను దూషించారని, మంత్రి బొత్స ఆయనపై దాడికి కూడా యత్నించారని ఆరోపించారు.
ఛైర్మన్పై వైసీపీ నేతల ఒత్తిడి..
షరీఫ్ సీటుకు ఇరువైపులా ఇద్దరు మంత్రులు నిల్చుని ఆయన్ను కదలకుండా కట్టడి చేశారని అర్జునుడు ఆరోపించారు. మంత్రులు ఎంత ఒత్తిడి చేసినప్పటికీ.. షరీఫ్ వాటన్నింటినీ ఎధుర్కొని ప్రజాస్వామ్యాన్ని రక్షించారని అభిప్రాయపడ్డారు.
వైసీపీ తర్జనభర్జన..
శాసనమండలి పరిణామాల నేపథ్యంలో.. సెలెక్ట్ కమిటీకి పంపిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని ఎలా ఎదుర్కోవాలో తెలియక వైసీపీ తర్జనభర్జనలు పడుతోంది. ఇందుకోసం గురువారం ఉదయం వైసీపీ నేతల కీలక సమావేశం జరిగింది. మండలి ఛైర్మన్ విచక్షణాధికారాలను ఉపయోగించిన తీసుకున్న నిర్ణయం చెల్లుబాటు అవుతుందా.. కాదా అన్న దానిపై నేతలు చర్చిస్తున్నారు. మండలి ఛైర్మన్ నిర్ణయాన్ని అసెంబ్లీ తీర్మానంతో అధిగమించవచ్చా.. అన్నదానిపై కూడా చర్చిస్తున్నట్టు సమాచారం.
రైతుల హర్షాతికేరాలు
మరోవైపు మండలి ఛైర్మన్ నిర్ణయంపై అమరావతి రైతుల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబుకు రాజధాని రైతులు కృతజ్ఞతలు తెలిపారు. గుంటూరులోని పార్టీ కార్యాలయం వద్ద జై అమరావతి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పలువురు రైతులు,రైతు కూలీలు చంద్రబాబును గజమాలతో సత్కరించారు.