విక్రంగౌడ్ కాల్పుల లాగే: తనపై హత్యాయత్నానికి తానే ప్లాన్, శ్యాంకుమార్ అరెస్ట్
తోడల్లుడితో ఉన్న ఆర్థిక వివాదాల నేపథ్యంలో.. అతని నుంచి భారీగా డబ్బు గుంజేందుకే అతనీ ఎత్తుగడ వేసినట్లు తెలుస్తోంది.
విజయవాడ: హైదరాబాద్లో కలకలం రేపిన విక్రంగౌడ్ కాల్పుల ఘటన తరహాలోనే మరో ఘటన చోటు చేసుకుంది. విజయవాడకు చెందిన శ్యాంకుమార్ అనే వ్యాపారి తనపై తానే దాడి చేయించుకున్నాడు. తోడల్లుడితో ఉన్న ఆర్థిక వివాదాల నేపథ్యంలో.. అతని నుంచి భారీగా డబ్బు గుంజేందుకే అతనీ ఎత్తుగడ వేసినట్లు తెలుస్తోంది.
'నిజం' పట్టేశారు: విక్రమ్ కాల్పుల మిస్టరీలో సంచలన విషయాలు.. అలా గట్టెక్కడానికే?
వివరాల్లోకి వెళ్తే.. విజయవాడలోని సీతారాంపురంలో శ్యాంకుమార్ ఓ సాయంకాల దినపత్రిక కార్యాలయాన్ని నడుపుతున్నాడు. తోడల్లుడు దేవశెట్టి సుబ్బారావుతో కలిసి విద్యాధరపురంలో ఓ ప్రింటింగ్ ప్రెస్ కూడా నిర్వహిస్తున్నాడు.
కొద్దిరోజుల క్రితం సుబ్బారావు తన అవసరాల కోసం శ్యాంకుమార్కు సంబంధించిన ఆస్తిని బ్యాంకులో షూరిటీగా పెట్టి రూ.20లక్షలు రుణం తీసుకున్నాడు. అయితే తిరిగి చెల్లించే విషయంలో జాప్యం చేయడంతో శ్యాంకుమార్ తో అతనికి విబేధాలు వచ్చాయి. బ్యాంకు నుంచి నోటీసులు అందుకున్న శ్యాంకుమార్ సుబ్బారావును నిలదీశాడు. దీనిపై పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ జరగ్గా.. రూ.15లక్షలు చెల్లించడానికి సుబ్బారావు అంగీకరించాడు.
అయితే శ్యాంకుమార్ మాత్రం మరో ప్లాన్ వేశాడు. తనపై సుబ్బారావు హత్యాయత్నం చేయించినట్లుగా డ్రామా క్రియేట్ చేస్తే.. మరిన్ని డబ్బులు గుంజవచ్చునని భావించాడు. అనుకున్నట్లుగానే భవానీపురానికి చెందిన తన స్నేహితులు నాగేంద్ర, మధురానగర్కు చెందిన కృష్ణప్రసాద్తో కలిసి హత్యకు ప్లాన్ వేశాడు.
ప్లాన్ ప్రకారం.. వారం రోజుల క్రితం శ్యాంకుమార్ ను నాగేంద్ర, కృష్ణప్రసాద్ లు కత్తితో పొడిచి పరారయ్యారు. తర్వాత శ్యాంకుమార్ ఆసుపత్రిలో చేరగా.. అమెరికాలో ఉన్న సుబ్బారావు కొడుకును ఆయన మనుషులు బెదిరించారు. రూ.40లక్షలు ఇవ్వాలంటూ శ్యాంకుమార్ మనుషులు బెదిరించడంతో అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసును దర్యాప్తు చేసిన పోలీసులు ఈ వ్యవహారం మొత్తాన్ని బయటపెట్టారు. ప్రస్తుతం శ్యాంకుమార్ సహా మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.