నిన్న విలేజ్ కోర్టులు ... నేడు విలేజ్ క్లినిక్ లు .. గ్రామాలపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి గ్రామాల సమగ్రాభివృద్ధికి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. నిన్నటికి నిన్న 42 గ్రామ న్యాయాలయాలను ఏర్పాటు చేసి గ్రామాల్లో సమస్యలను గ్రామ పరిధిలోనే పరిష్కరించాలని నిర్ణయిస్తే, ఇక తాజాగా గ్రామాల్లో ఉన్న ప్రజల ఆరోగ్య రక్షణ కోసం విలేజ్ క్లినిక్ లను ఏర్పాటు చెయ్యాలని నిర్ణయం తీసుకున్నారు.
ఏపీ సర్కార్ మరో ముందడుగు: మొన్న గ్రామ సచివాలయాలు..నేడు గ్రామ న్యాయాలయాలు
గ్రామాల్లో వైఎస్సార్ విలేజ్ క్లినిక్ లను ఏర్పాటు చేయాలన్న సీఎం జగన్
ఆరోగ్యశాఖపై సీఎం జగన్ నిర్వహించిన సమీక్షలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందించటమే లక్ష్యంగా వైద్య, ఆరోగ్యశాఖ సేవలు ఉండాలని సీఎం జగన్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఇక గ్రామాల్లో విలేజ్ క్లినిక్ లను ఏర్పాటు చెయ్యాలని చెప్పారు. రెండు వేల జనాభా ఒక యూనిట్గా తీసుకుని అక్కడి పరిస్ధితులకు తగినట్లుగా వైఎస్సార్ విలేజ్ క్లినిక్ లను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. బీఎస్సీ నర్సింగ్ చదివిన నర్సు ఈ క్లినిక్లో ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని పేర్కొన్నారు.
నిరుపేదలకు ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా ఉచిత వైద్యం
నిరుపేదలకు ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా ఉచితంగా వైద్యం చేయడం లక్ష్యంగా ప్రతీ గ్రామ, వార్డు సచివాలయం ఉన్న చోట క్లినిక్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వైఎస్సార్ విలేజ్ క్లినిక్ లు రోగికి ఏ సమయంలో అయినా వైద్య సేవలు అందించేలా ఉండాలని సీఎం జగన్ పేర్కొన్నారు. అక్కడికి వెళ్తే తప్పక సరైన వైద్యం దొరుకుతుంది అనే భరోసా ప్రజలకు ఇచ్చేలా విలేజ్ క్లినిక్ లు ఉండాలని సీఎం జగన్ అధికారులకు చెప్పారు.
సీఎం జగన్ ఆదేశాలతో గ్రామాల రూపు రేఖలలో మార్పు
అదే విధంగా 25 పార్లమెంట్ నియోజకవర్గాల్లో 25 టీచింగ్ హాస్పిటల్స్ ఉండాలని పేర్కొన్న సీఎం జగన్ టీచింగ్ ఆసుపత్రులకు అవసరమైన మౌలిక సదుపాయాలన్నీ పక్కాగా ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు . డాక్టర్లు, నర్సుల కొరత అధిగమించేందుకు జిల్లాకు ఒక టీచింగ్ హాస్పిటల్ ఉంటే బాగుంటుందనే ప్రతిపాదన చేశారు . ప్రతి టీచింగ్ హాస్పిటల్లో డెంటల్ ఎడ్యుకేషన్ కూడా ఉండాలి అని సీఎం జగన్ అధికారులతో పేర్కొన్నారు. సీఎం జగన్ ఆదేశాలతో గ్రామాల రూపు రేఖలు మారనున్నాయి.
Recommended Video
గ్రామాల సమగ్రాభివృద్ధి , ఆరోగ్య రక్షణ కై సీఎం జగన్ నిర్ణయం
గ్రామ సచివాలయాల ద్వారా గ్రామాల పరిపాలన సుగమం చేసిన సీఎం జగన్ ఇప్పుడు గ్రామ న్యాయాలయాలను ఏర్పాటు చేసి గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి గ్రామాల పరిధిలోనే కృషి జరగాలని చెప్పారు. ఇక తాజాగా విలేజ్ క్లినిక్ లతో గ్రామాల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేలా కృషి చెయ్యాలని ఆయన పేర్కొన్నారు. పల్లె సీమలే దేశానికి పట్టు కొమ్మలు అని చెప్పి మాటలకే పరిమితమవుతున్న వారున్న నేటి రోజుల్లో గ్రామాల సమగ్రాభివృద్ధికి సీఎం జగన్ ఈ తరహా నిర్ణయాలు తీసుకోవటం ముదావహం అనే భావన వ్యక్తం అవుతుంది. అయితే సీఎం జగన్ ఆలోచనలు, అందించే పథకాలు మంచివే అయినా వాటి అమలే కీలకం .