ముంపు ప్రాంతాల్లో గ్రామ వలంటీర్ల తెగువ: వరద సహాయక చర్యల్లో చురుగ్గా..!
గుంటూరు: ఉద్యోగాల్లో చేరిన తొలిరోజుల్లోనే క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నారు గ్రామ వలంటీర్లు. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో తెగువ చూపిస్తున్నారు. వరద బాధితులకు సహాయ, పునరావాస చర్యల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. వరద బాధితులకు భోజనాన్ని సమకూరుస్తున్నారు. రెవిన్యూ సిబ్బంది వెళ్లలేని ప్రాంతాలకు గ్రామ వలంటీర్లు చొరవగా వెళ్తున్నారు. లంక గ్రామాల్లో పర్యటిస్తూ, స్థానికులకు అవసరమైన సామాగ్రి, నిత్యావసర సరుకులను అందజేస్తున్నారు. ఉద్యోగాల్లో చేరిన తొలిరోజుల్లోనే ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పటికీ.. గ్రామ వలంటీర్లు వెనుకాడట్లేదు. తెగువ చూపిస్తున్నారు.
గుంటూరు జిల్లాలోని అనేక మండలాలు వరద ప్రభావానికి గురైన విషయం తెలిసిందే. దాచేపల్లి, కొల్లిపర, కొల్లూరు, దుగ్గిరాల మండలాల్లోని కృష్ణానది తీర గ్రామాలు వరద ముంపునకు గురయ్యాయి. 15 మండలాల్లో సుమారు 40 వరకు గ్రామాలు వరద ప్రభావానికి గురయ్యాయి. 550కి పైగా కుటుంబాలు కృష్ణానదికి సంభవించిన వరద వల్ల నిరాశ్రయులయ్యాయి. వారిని సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు. వారి కోసం ఒక్క గుంటూరు జిల్లాలోనే ఎనిమిది సహాయ, పునరావాస శిబిరాలను ఏర్పాటు చేశారు అధికారులు. ప్రస్తుతం 1650 మంది వరకు ఆయా శిబిరాల్లో తలదాచుకుంటున్నారు.
వరద ప్రభావిత రెండు జిల్లాల్లోనూ పలువురు అగ్నిమాపక సిబ్బంది విధుల్లో పాల్గొంటున్నారు. సుమారు 200 మంది జాతీయ విపత్తు నిర్వహణ బలగాలు (ఎన్డీఆర్ఎఫ్) వరద బాధితులను ఆదుకుంటున్నాయి. కృష్ణా జిల్లాలో మోపిదేవి, కృష్ణా, తొట్లవల్లూరు, రాణిగారితోట, కంచికచెర్ల ప్రాంతాల్లో సహాయ, పునరావస శిబిరాలను నెలకొల్పారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో 60కి పైగా పునరావాస శిబిరాలు ఏర్పాటు చేశారు. శిబిరాల్లో తలదాచుకుంటున్న నిరాశ్రయుల కోసం 15 వేల ఆహార ప్యాకెట్లను సిద్ధం చేశారు. మంచినీటి సౌకర్యాలను కల్పించారు.
బాధితులకు ఆహార ప్యాకెట్లను అందజేయడంలో గ్రామ వలంటీర్లే కీలక పాత్ర పోషిస్తున్నారు. అగ్నిమాపక దళాలు, జాతీయ విపత్తు నిర్వహక బలగాల వెంటే ఉంటూ, వారికి సహాయకారులుగా నిలిచారు. గ్రామ వలంటీర్లలో అందరూ యువతీ యువకులే కావడం కలిసొచ్చింది. పరిస్థితులపై అప్పటికప్పుడు అవగాహన ఏర్పరచుకుంటూ నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రభుత్వం సరఫరా చేసిన టీషర్టులను ధరించడం వల్ల గ్రామ వలంటీర్లను సులువుగా గుర్తించగలుగుతున్నారు. వారి పట్ల అవగాహన లేని లంక గ్రామాల ప్రజలకు తమను తాము పరిచయం చేసుకుని, చొరవగా సహాయక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.