నల్లమల అడవుల్లో ఘోరం: అరిష్టం పేరుతో: గర్భిణీ మృతదేహాన్ని చెట్టుకు కట్టేసి: రెండ్రోజుల తరువాత
కర్నూలు: కర్నూలు జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. అరిష్టం పేరుతో కొందరు గ్రామస్తులు ఓ మహిళ మృతదేహాన్ని ఖననం చేయకుండా అడ్డుకున్నారు. అంత్యక్రియలను నిర్వహించకుండా అడ్డుపడ్డారు. మృతదేహాన్ని ఊరికి దూరంగా నల్లమల అడవుల్లో ఓ చెట్టుకు కట్టేసి చేతులు దులుపుకొన్నారు. కుటుంబ సభ్యులు ప్రాథేయపడుతున్నా వినిపించుకోలేదా గ్రామస్తులు. రెండురోజుల తరువాత ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. అప్పటికే ఈ మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో కనిపించింది.
కర్నూలు జిల్లాలోని రుద్రవరం మండలం బీ నాగిరెడ్డి పల్లి గ్రామంలో శనివారం చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతురాలి పేరు లావణ్య. వయస్సు 21 సంవత్సరాలు. మహానంది సమీపంలోని ఓ గ్రామానికి చెందిన లావణ్యకు రెండేళ్ల కిందట బీ నాగిరెడ్డి పల్లెకు చెందిన ధర్మేంద్రతో వివాహమైంది. ప్రస్తుతం ఆమె నిండు గర్భిణి. శుక్రవారం రాత్రి ఆమెకు కడుపునొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఆమెను శిరివెళ్లలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. డాక్టర్లు నంద్యాలకు తీసుకెళ్లాలని సూచించారు. దీనితో వారు ఆమెను హుటాహుటిన నంద్యాలలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
తెలంగాణ నుంచి ఏపీలో ఎంట్రీపై బ్యాన్: రోజూ 12 గంటలే గడువు: ఆ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ ఉంటేనే
బీపీ అధికం కావడం, ఇతరత్రా అనారోగ్య సమస్యలు తలెత్తడంతో ఆమె బిడ్డను ప్రసవించకుండానే మరణించారు. కరోనా వైద్య పరీక్షలను నిర్వహించిన అనంతరం నెగెటివ్ రిపోర్డు రావడంతో లావణ్య మృతదేహాన్ని డాక్టర్లు ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించారు. శనివారం ఉదయం వారు లావణ్య మృతదేహాన్ని నాగిరెడ్డి పల్లెకు తీసుకొచ్చారు. అంత్యక్రియలను నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తుండగా.. గ్రామస్తులు అడ్డుకున్నారు.
నిండు గర్భిణీ మృతదేహానికి అంత్యక్రియలను నిర్వహించడం గ్రామానికి మంచిది కాదని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆమె ఉసురు తగిలి.. గ్రామం సర్వనాశనమౌతుందని వాదించారు. కుటుంబ సభ్యులు ప్రాథేయపడుతున్నప్పటికీ వినిపించుకోలేదు. లావణ్య మృతదేహానికి అంత్యక్రియలను చేయనివ్వలేదు. శ్మశానానికి తీసుకెళ్లడానికి కుటుంబ సభ్యులు చేసిన ప్రయత్నాలకు అడ్డుపడ్దారు. దౌర్జన్యానికి పాల్పడ్డారు. దీనితో చేసేదేమీ లేక మృతదేహాన్ని గ్రామస్తులకు అప్పగించారు.
గ్రామస్తులు ఓ వాహనంలో ఆమె మృతదేహాన్ని నల్లమల అడవుల్లోకి తీసుకెళ్లి.. ఓ చెట్టుకు కట్టేసి వెనక్కి వచ్చేశారు. లావణ్య మృతదేహాన్ని కట్టేసిన ప్రదేశంలో ఓ వాగు ప్రవహిస్తుంటుంది. రుద్రవరం మండలంలోని కొన్ని గ్రామలవారు తమ పశువులను ఆ వాగు వద్దకు మేత కోసం తీసుకెళ్తుంటారు. పశువుల కాపరులు కొందరు లావణ్య మృతదేహాన్ని చూశారు. దీనితో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. గ్రామస్తులతో మాట్లాడి అంత్యక్రియలు చేయించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.