విశాఖలో మళ్లీ వింతజీవి! ఈసారి అచ్చం మనిషిని పోలిన చేప!? సోషల్ మీడియాలో వైరల్!
విశాఖపట్నం: సోషల్ మీడియా అందరికీ అందుబాటులోకి వచ్చాక వైరల్ ఫొటోలు, వైరల్ వీడియోలు ఎక్కువైపోయాయి. ఎక్కడ ఏం జరిగినా వెంటనే వైరల్గా మారిపోతోంది. నెటిజన్లు కూడా ఇలాంటి వాటిని చూస్తూ.. లైకులు, షేర్లు చేస్తున్నారు.
ఈ మధ్య విశాఖపట్నంలో వింతజీవులంటూ నెట్లో ఓ వీడియో హల్చల్ చేసింది. తీరా చూస్తే అవి ఏలియన్స్ కావు.. ఓ రకం గుడ్లగూబలు అని తేల్చేశారు. తాజాగా అలాంటి వార్తే మరొకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈసారి విశాఖ తీరంలో మత్స్యకారులకు అచ్చం మనిషిని పోలిన చేప దొరికిందట. దీనికి సంబంధించిన రెండు ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ముందు ఉదర భాగం, చేతులు అచ్చం మనిషిని పోలి ఉందీ చేప.
ఈ చేప వీడియో, ఫొటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అది కదులుతూ ఉండడంతో జాలర్లు భయపడి దాని రెండు చేతులు వెనక్కి విరిచి కట్టేసి ఉంచారు. ఇంతకీ ఇది నిజంగా విశాఖ తీరంలోనే దొరికిందా? లేక ఇంకెక్కడైనా దొరికిందా? అనే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది.