విశాఖ కంటకుడు చంద్రబాబు పార్ట్ 3.. టీడీపీ పాలనలో విశాఖ అభివృద్ధి విచ్చిన్నం : విజయసాయి ధ్వజం
విశాఖ కంటకుడు చంద్రబాబు అంటూ విజయసాయిరెడ్డి విశాఖపై చంద్రబాబు విషం చిమ్ముతున్నారు అని ఇప్పటికి రెండు పార్ట్ లుగా చంద్రబాబు పై నిప్పులు చెరిగిన విషయం తెలిసిందే . తాజాగా మూడో పార్ట్ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసిన విజయసాయి రెడ్డి చంద్రబాబు విశాఖను ఏ మాత్రం అభివృద్ధి చేయలేదని అందుకు ఉదాహరణలు సూచిస్తూ పలు అంశాలను ప్రస్తావించారు. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి చంద్రబాబు అధికారంలో ఉండగా బాబు కుట్రలో విశాఖ జిల్లా విచ్ఛిన్నమైంది అంటూ పేర్కొన్నారు.
Recommended Video
రాష్ట్రానికి ప్రత్యేక హోదా వద్దని ప్యాకేజ్ పంచుకోవాలని బాబు కుట్ర
రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తే గరిష్టంగా లబ్ది పొందేది విశాఖపట్నంలోని కంపెనీలు. అందుకనే హోదా అవసరం లేదంటూ చంద్రబాబు కేంద్రానికి లేఖ రాశారని, ప్యాకేజీ అయితే పంచుకోవచ్చు అనుకున్నాడు అంటూ విజయసాయి రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విశాఖపట్నం జిల్లాలో బీసీ, ఎస్సీ, ఎస్టీ జనాభా ఎక్కువగా ఉన్నందున,వారిలో చైతన్యం లేదు, తనను ప్రశ్నించలేరనే ఉద్దేశంతోనే అభివృద్ధి ని పూర్తిగా విస్మరించారని ఆయన పేర్కొన్నారు.పర్యాటకానికి విశాఖ పెట్టింది పేరని, అటువంటి విశాఖను విస్మరించారని మండిపడ్డారు.
సముద్రాన్ని ఆనుకుని రోడ్లు వేస్తానని చంద్రబాబు కోతలు
విశాఖలోని ప్రకృతి వనరులను, సుందర పర్యాటక ప్రాంతాలను టూరిజం ద్వారా అభివృద్ధి చేస్తే వేలాది మందికి ఉపాధి లభించడమే కాకుండా, సహజసిద్ధ పర్యాటకంగా విశాఖకు గుర్తింపు వచ్చేదని పేర్కొన్నారు. కానీ చంద్రబాబు అవేమీ చేయకుండా భవాని ఐలాండ్ కోసం ఖజానా నుంచి నిధులను విచ్చలవిడిగా ఖర్చు చేశారని పేర్కొన్నారు.సముద్రాన్ని ఆనుకుని రాష్ట్రమంతా రోడ్లు వేస్తానంటూ కోతలు కోసిన చంద్రబాబు విశాఖ భీమిలి బీచ్ రోడ్డు కూడా వేయలేక పోయాడు అని విమర్శించారు .విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ నిధులతోనే రోడ్లు వేశారు తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇచ్చిన పాపాన పోలేదు అంటూ ఆయన పేర్కొన్నారు .
రైల్వే జోన్ మాట లేదు , కనీసం విశాఖ-అరకు మధ్య ఒక ట్రాన్స్పరెంట్ బోగీలు ఉన్న ట్రైన్ లేదు
చంద్రబాబు అనుంగు నాయకుడు ఎర్రన్నాయుడు రైల్వే బోర్డు చైర్మన్ గా ఉన్నప్పుడైనా విశాఖ రైల్వే జోన్ సాధించలేకపోయారు అని విశాఖ-అరకు లోయ మధ్య ఒక ట్రాన్స్పరెంట్ బోగీలు ఉన్న ట్రైన్ తీసుకు రాలేకపోయారని విమర్శించారు. అంతేకాదు వైయస్సార్సీపి ఎంపీలు ఒత్తిడి చేయడం ,రాజీనామాలు చేయడం వల్ల చివరికి ఒక ప్రకటన వచ్చిందని తన 14 ఏళ్ల పాలనలో విశాఖ రైల్వేజోన్ గురించి చంద్రబాబు ఎన్నడూ మాట్లాడింది లేదని విజయసాయి రెడ్డి దుయ్యబట్టారు.
ఆంధ్రా యూనివర్సిటీకి నిధులు ఇవ్వలేదు .. 14 ఏళ్ళ పాలనలో చేసింది శూన్యం
రాష్ట్రంలోనే తొలి మునిసిపాలిటీ భీమిలి, బ్రిటిష్ వారి కాలంలోనే అది మున్సిపాలిటీగా ఉండేదని అలాంటి మున్సిపాలిటీని చంద్రబాబు నాయుడు 14 ఏళ్ల పాలనలో ఏనాడు పట్టించుకోలేదని విమర్శించారు.అక్కడ ఎక్కువగా బీసీలు ఉండడం వల్ల వారి అభివృద్ధి బాబుకు ఎప్పుడూ పట్టలేదని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.దాదాపు వందేళ్ళ చరిత్ర కలిగిన ఆంధ్ర యూనివర్సిటీకి చంద్రబాబు పద్నాలుగేళ్ల లో ఇచ్చిన నిధులు శూన్యమని, తిరిగి ఏయూ ఆస్తులను తన సొంత పార్టీ వ్యవహారాలకు కూడా వాడుకున్న ఘనత చంద్రబాబుదని విజయసాయి రెడ్డి ఆరోపించారు.
విశాఖ రోడ్ల విస్తరణ పేరుతో బడుగు బలహీనవర్గాల భూములు లాక్కున్నారు తప్పా చంద్రబాబు తన అనుయాయుల జోలికి జోలికి వెళ్లలేదని పేర్కొన్నారు.
విశాఖ జిల్లాలో ఎవర్నడిగినా బాబు బాగోతాలు చెప్తారు
విశాఖ జిల్లాలో ఎవరినడిగినా చంద్రబాబు బాగోతాలు పూసగుచ్చినట్లు చెప్తారని పేర్కొన్న విజయసాయిరెడ్డి. నాడు వైఎస్ఆర్ హయాంలో గాజువాక ,అనకాపల్లి వైపు సెజ్ లను ఏర్పాటు చేసి వేలాది మందికి వైయస్సార్ ఉద్యోగాలు ఇస్తే ఉద్దేశపూర్వకంగా చంద్రబాబు ఆ సెజ్ లను నిర్లక్ష్యం చేశాడని పేర్కొన్నారు.విశాఖలో ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థల వల్ల కోట్లాది రూపాయలు రాష్ట్రానికి వస్తాయని పోర్ట్, స్టీల్ ప్లాంట్ , బిహెచ్ఇయల్ లాంటి సంస్థల వల్ల వచ్చిన ఆదాయంలో విశాఖపట్నం కోసం తిరిగి చంద్రబాబు నాయుడు అసలు ఖర్చు చేసింది లేదని విజయ సాయి విమర్శించారు . చంద్రబాబు హయాంలోనే విశాఖ అభివృద్ధి విచ్ఛిన్నం కొనసాగిందని , విశాఖ కంటకుడు చంద్రబాబు అని తీవ్ర విమర్శలు గుప్పించారు విజయసాయి రెడ్డి.