బోగీలను వదిలి పరుగులు పెట్టిన విశాఖ ఎక్స్ప్రెస్ రైలింజన్..ఎంత దూరం వెళ్లిందంటే..?
విశాఖపట్నం: సాధారణంగా రైలు ప్రమాదం అని విన్నప్పుడు రైలు పట్టాలు తప్పి ఉంటుందనేది ముందుగా మనకు తడుతుంది. రైలు పట్టాలు తప్పడం అనేది ఈ మధ్యకాలంలో ఎక్కువైపోయాయి. ఇక పట్టాలు తప్పి రైళ్లు ప్రమాదానికి గురవుతుంటే... కొన్ని రైళ్లు మాత్రం బోగీలను మరిచి అలానే ముందుకు వెళుతున్న ఘటనలు చూస్తున్నాం. తాజాగా విశాఖపట్నంలో ఇలాంటిదే వెలుగు చూసింది.
భువనేశ్వర్ నుంచి సికింద్రాబాద్ వెళ్లాల్సిన విశాఖ ఎక్స్ప్రెస్ రైలు నర్సీపట్నం తుని రైల్వే స్టేషన్ల మధ్య బోగీల నుంచి ఇంజిన్ వేరుపడింది. అలా 10 కిలోమీటర్లు వరకు బోగీలు లేకుండానే ఇంజిన్ ముందుకు ప్రయాణించింది. కొంత దూరం వెళ్లిన తర్వాత డ్రైవర్ గమనించి ఇంజిన్ను నిలిపివేశాడు. వెనకాలే బోగీలు కూడా కొద్ది దూరం వరకు ప్రయాణించి నిలిచిపోయాయి. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. అలా ఇంజిన్ లేకుండా వెళుతున్న బోగీలను చూసి స్థానికులు ఆశ్చర్యపోయారు. వెంటనే తమ సెల్ఫోన్ కెమెరాలకు పనిచెప్పారు. బోగీలు వెళుతున్న దృశ్యాన్ని తమ కెమరాల్లో బంధించారు.
ఈ ఘటనలో బోగీల్లో ఉన్న ప్రయాణికులకు ఎలాంటి హానీ జరగలేదు. అందరూ సురక్షితంగానే ఉన్నట్లు అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న సాంకేతిక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ఇంజిన్కు బోగీలను లింక్ చేసే వ్యవస్థకు మరమత్తులు చేశారు. దీంతో కొన్ని రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ఘటనపై విచారణకు ఆదేశించింది రైల్వే శాఖ.