విశాఖ గ్యాస్ లీక్ ఘటన హైపవర్ కమిటీ విచారణ ... రెండో రోజు విచారణ సాగుతుందిలా!!
విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ దుర్ఘటనపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించిన హైపవర్ కమిటీ మలివిడత విచారణను ప్రారంభించింది. నిన్నటి నుండి విచారణ జరుపుతున్న హైపవర్ కమిటీ ఎల్జీ పాలిమర్స్ కు సంబంధించి వివిధ అంశాలపైన, స్థానిక ప్రజల సమస్యలపైన దృష్టిసారించింది. ఇక మూడురోజులపాటు జరగనున్న విచారణలో మొదటిరోజు పూర్తిగా సాంకేతిక అంశాలపైనే చర్చ జరిగింది. ఇక హైపవర్ కమిటీ విచారణకు ఎల్జి పాలిమర్స్ ప్రతినిధులు హాజరయ్యారు.
అనుమతులే లేకుండా నడుస్తున్న ఎల్జీ పాలిమర్స్ ... పర్యావరణ నిపుణుల కమిటీ ఏం తేల్చిందంటే!!
మొదటి రోజు సాంకేతిక అంశాలపై చర్చించిన కమిటీ
మొదటిరోజు స్టైరీన్ గ్యాస్ లీక్ ఘటన సాంకేతిక అంశాలపై విచారణ జరిపారు . గ్యాస్ లీక్ ఘటన తర్వాత ఏర్పాటైన సబ్ కమిటీ లు ఘటనకు సంబంధించిన అన్ని నివేదికలను కలెక్టర్ కు అందించాయి. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇచ్చిన నివేదికలు,గ్యాస్ లీక్ ఘటనపై సబ్ కమిటీలు ఇచ్చిన నివేదిక ఆధారంగా ప్రమాదానికి గల కారణాలపై చర్చలు జరిపింది హైపవర్ కమిటీ. ఇక పలువురు సాంకేతిక నిపుణుల అభిప్రాయాలను సైతం తీసుకుంది.అంతేకాకుండా ఐఐపీఎం,ఆంధ్ర యూనివర్సిటీకి చెందిన రసాయన శాస్త్ర నిపుణులతో దీర్ఘకాలంలో కెమికల్స్ వల్ల ఎదురయ్యే ప్రమాదం పై చర్చించింది.
నేడు రాజకీయ పార్టీలు , ప్రభావిత గ్రామాల ప్రజల అభిప్రాయాల సేకరణ
ఇక రెండో రోజు విచారణ జరుపుతున్న హైపవర్ కమిటీ పరిసర గ్రామాల ప్రజలతోనూ, రాజకీయ పార్టీ నేతలతోనూ, ఎల్జీ పాలిమర్స్ సంస్థ ప్రతినిధులతోనూ చర్చ జరుపుతోంది. బాధిత గ్రామాల ప్రజలు,వివిధ పార్టీల నేతలు గ్యాస్ లీక్ ఘటన నేపథ్యంలో అక్కడి పరిస్థితిని వివరించి, ఎల్జి పాలిమర్స్ ను అక్కడి నుంచి తరలించాలని హైపవర్ కమిటీ కి విజ్ఞప్తి చేశారు. గ్యాస్ లీక్ ఘటనతో తమ గ్రామం పూర్తిగా దెబ్బతిందని ఆర్ .వెంకటాపురం గ్రామస్తులు హైపవర్ కమిటీ దృష్టికి తీసుకెళ్లారు. గ్రామానికి ఎక్కువ నష్టపరిహారం ఇవ్వాలని వారు కోరారు.
ఎల్జీ పాలిమర్స్ లైసెన్సులు రద్దు చేసి సంస్థను తరలించాలన్న రాజకీయ పార్టీలు
ఇక అంతే కాదు ఆయా గ్రామాల పరిధిలో మల్టీస్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మించాలని,అంతేకాకుండా ఉద్యోగాలు కోల్పోయిన ఐదు వందల మందికి ఉపాధి కల్పించాలంటూ కమిటీ దృష్టికి తీసుకు వెళ్లారు. ప్రభావిత సమీప గ్రామాల ప్రజలు తమకు శాశ్వత ప్రాతిపదికన హెల్త్ కార్డులు ఇవ్వాలని కమిటీ దృష్టికి తీసుకు వెళ్లారు. ఇక రాజకీయ పార్టీల నేతలు ఎల్జీ పాలిమర్స్ కంపెనీస్ లైసెన్సులు రద్దు చేసి కంపెనీ అక్కడినుండి తరలించాలని డిమాండ్ చేశారు.
మూడు రోజుల పార్టు కొనసాగే విచారణలో కమిటీ ముందు హాజరైన ఎల్జీ పాలిమర్స్ ప్రతినిధులు
పరిశ్రమ ఉన్నచోట తరచూ మాక్ డ్రిల్ నిర్వహించకపోవడం ప్రమాద తీవ్రత పెరగడానికి ఒక కారణమని వారు హైపవర్ కమిటీ దృష్టికి తీసుకు వెళ్లారు. ఇక ఎల్ జి పాలిమర్స్ ప్రతినిధులు సైతం విచారణ కమిటీ ముందు హాజరై కమిటీ విచారణకు సహకరిస్తున్నారు. విశాఖ ఎల్జీ పాలిమర్స్ ఘటనపై హైపవర్ కమిటీ భేటీలో కమిటీ సభ్యులు పరిశ్రమలశాఖ కార్యదర్శి కరికాల వలవన్, విశాఖ జిల్లా కలెక్టర్ వినయ్ చంద్, సీపీ ఆర్కే మీనా పాల్గొంటున్నారు.