విశాఖ అందాలు కట్టిపడేశాయి: నటుడు సంపూర్ణేష్ బాబు
విశాఖపట్నం: విశాఖ అందాలు తనను కట్టిపడేశాయని టాలీవుడ్ నటుడు సంపూర్ణేష్ బాబు అన్నారు. ఎవరినైనా విశాఖ ప్రకృతి రమణీయత కట్టిపడేస్తుందని చెప్పారు. తనకు విశాఖపట్నం అంటే చాలా ఇష్టమని తెలిపారు.
ఎంపి టి సుబ్బిరామిరెడ్డి జన్మదిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన తిరిగి వెళ్తూ గ్రీన్ పార్క్ హోటల్లో మాట్లాడారు. తాను మూడోసారి విశాఖకు వచ్చానని తెలిపారు. ఏడాది క్రితం నగరాన్ని కుదిపేసిన హుధుద్ తుఫాను ఆనవాళ్లు పూర్తిగా తొలగిపోవడం ఆనందంగా ఉందని అన్నారు.
తాను నటించిన మూడో చిత్రం ‘కొబ్బరిమట్ట' అని, ఇందులో తాను పెదరాయుడు, పాపారాయుడు, ఆండ్రాయుడు అనే మూడు పాత్రలు పోషిస్తున్నట్లు తెలిపారు. ఇది పూర్తిగా సందేశాత్మక హాస్య చిత్రమని చెప్పారు.
ఉమ్మడి కుటుంబం విలువలు పెంచేలా ఈ చిత్రం ఉంటుందని వివరించారు. మోహన్ బాబు, ఉపేంద్ర, పవన్ కళ్యాణ్లు తన అభిమాన నటులని సంపూర్ణేష్ బాబు తెలిపారు. ‘హృదయ కాలేయం', ‘సింగం 123' చిత్రాలతో సంపూర్ణేష్ బాబు సుపరిచితులైన విషయం తెలిసిందే.