విశాఖ భూకబ్జాలో విజయమ్మ పేరును లాగిన టీడీపీ: అందుకే కక్ష: చంద్రబాబు హీరో: బుద్ధా వెంకన్న
అమరావతి: విశాఖపట్నంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఆక్రమించినట్లుగా భావిస్తోన్న భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటోన్న ప్రక్రియ..చిలికి చిలికి గాలివానగా మారుతోంది. భూములను స్వాధీనం చేసుకోవడాన్ని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా తప్పుపడుతోంది. దీన్ని కక్షసాధింపు చర్యగా అభివర్ణిస్తోంది. విశాఖపట్నానికి చెందిన తమ పార్టీ నాయకులనే కాకుండా.. బడుగు బలహీన వర్గాల ప్రజలపై అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కక్షసాధిస్తోందని, దీనిికి మూలకారకుడు రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డేనని ధ్వజమెత్తుతోంది.
Delhi violence: ఆ ఇద్దరికీ బెయిల్: జామియా స్టూడెంట్కూ: ప్రశాంత్ కీలక కామెంట్స్
బడుగులే టార్గెట్..
విశాఖపట్నం ప్రజలు అమయాకులని, బయటి నుంచి వచ్చిన విజయసాయి రెడ్డి, అవంతి శ్రీనివాస్ వంటి నేతలు వారిపై పెత్తనం చెలాయిస్తోన్నారని టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఆరోపించారు. యాదవులు, కొప్పుల వెలమ, గవర సామాజిక వర్గాన్ని లక్ష్యంగా చేసుకున్నారని మండిపడ్డారు. కొప్పుల వెలమ సామాజిక వర్గానికి చెందిన అయ్యన్న పాత్రుడిపై అక్రమ కేసు దీనికి నిదర్శనమని అన్నారు. ఆయా సామాజిక వర్గాలకు చెందిన వారి ఆర్థిక మూలాలను దెబ్బకొట్టడానికి వైసీపీ నేతలు ప్రయత్నిస్తోన్నారని ఆరోపించారు.
పల్లా శ్రీనివాస్ లొంగలేదు..
వైసీపీలో చేరాలంటూ స్వయంగా విజయసాయి రెడ్డి అల్లుడు తమ పార్టీ నాయకుడు పల్లా శ్రీనివాస్ ఇంటికి వెళ్లి ఒత్తిడి తెచ్చారని, అయినప్పటికీ- ఆయన దానికి లొంగలేదని బుద్ధా వెంకన్న చెప్పారు. అందుకే ఆయనను టార్గెట్ చేశారని మండిపడ్డారు. ఈ విషయంలో పల్లాకు తమ పార్టీ క్లీన్చిట్ ఇస్తోందని అన్నారు. బయటి నుంచి వచ్చి విశాఖలో తిష్ట వేసిన సాయిరెడ్డి..విశాఖ ప్రజల అమాయకత్వంతో ఆడుకుంటోన్నారని విమర్శించారు. విజయసాయిరెడ్డికి దమ్ము, ధైర్యం ఉంటే విశాఖ లోక్సభ స్థానం నుంచి పోటీ చేయాలని సవాల్ విసిరారు. దోపిడీదారులందరూ వైసీపీలోనే ఉన్నారని బుద్ధా వెంకన్న విరుచుకుపడ్డారు.
విజయమ్మను ఓడించినందుకే..
2014 నాటి ఎన్నికల్లో విశాఖపట్నం లోక్సభ నుంచి పోటీ చేసిన విజయమ్మను అక్కడి ఓటర్లు ఓడించారని బుద్ధా వెంకన్న గుర్తు చేశారు. ఆ అక్కసుతోనే విజయసాయి రెడ్డి వంటి నాయకులు విశాఖలో తిష్ఠ వేసి, ప్రజలపై కక్షసాధింపు చర్యలకు దిగారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో వైసీపీకి 151 సీట్లు వచ్చినప్పటికీ.. విశాఖ సిటీలో తమ పార్టీకి నలుగురు ఎమ్మెల్యేలను విశాఖ ఇచ్చిందని, అందుకే అక్కడి ఓటర్లపై కక్ష కట్టారని ఆరోపించారు. 2024 ఎన్నికల్లో తాము అధికారంలోకి రావడం ఖాయమైందని అందరి లెక్కలు తేలుస్తామని అన్నారు. ఒకటికి ఒకటిన్నర, రెండుకు మూడు ఇలా వడ్డీతో సహా వసూలు చేస్తామని బుద్ధా వెంకన్న వైసీపీ నేతలను హెచ్చరించారు.
చంద్రబాబుకు బ్రహ్మరథం
చంద్రబాబు ఎప్పుడూ హీరోనే అని, దేశంలో రాజకీయాల్లో ఆయన ఇమేజ్ ఎప్పుడూ తగ్గదని బుద్ధా వెంకన్న అన్నారు. చంద్రబాబు దేశంలో ఏ మారుమూల గ్రామానికి వెళ్లినా గుర్తు పడతారని.. బ్రహ్మరథం పడతారని అన్నారు. అది చంద్రబాబు ఇమేజ్. పది మంది సైనికులు చంద్రబాబు వెంట ఉన్నారని, 2024లో గ్యారంటీగా అధికారంలోకి అలాంటి వారు చాలని అన్నారు. వైఎస్ జగన్, కరోనా దెబ్బకు రాష్ట్రం కుదేల్ అయినప్పటికీ.. దాని గురించి పట్టించుకోకుండా రాజకీయ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని బుద్ధా వెంకన్న ఆరోపించారు. విశాఖలో భూకబ్జాపై చర్చకు సిద్ధం కావాలని అన్నారు.