విశాఖ పోర్ట్ గెస్ట్హౌస్: రాజ్భవన్గా కాదు..క్యాంపు కార్యాలయం వైపే మొగ్గు..!
విశాఖపట్నం: పరిపాలనా రాజధానిగా విశాఖపట్నాన్ని బదలాయించడంలో అధికార యంత్రాంగం మరో అండుకు వేసింది. సచివాలయం కోసం రుషికొండ మధురవాడ ప్రాంతంలోని మిలీనియం టవర్స్ను ఎంపిక చేసుకున్న తరువాత అధికారులకు ఎదురైన ఇబ్బందులు.. రాజ్భవన్, ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం. ఈ రెండింటి కోసం అధికారులు కొన్ని భవనాలను ఇదివరకే పరిశీలించినప్పటికీ.. ఓ పట్టాన కొలిక్కి రాలేదు. అప్పట్లో వారు పరిశీలించిన భవనాల జాబితాలో విశాఖ పోర్ట్ గెస్ట్హౌస్ కూడా ఉంది.
వెంకటేశ్వర స్వామివారి రథానికి దుండగుల నిప్పు: బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతున్న సమయంలో..
విశాఖపట్నం నుంచి పరిపాలనను చేపట్టిన తరువాత.. రాజ్భవన్ కూడా అక్కడికే వెళ్లాల్సి ఉంటుంది. రాజ్భవన్, సచివాలయం సహా వివిధ శాఖలు, విభాగాధిపతుల కార్యాలయాలు విశాఖపట్నానికి తరలి వెళ్తాయంటూ ఇదివరకు మంత్రివర్గ సమావేశం ఆమోదించిన తీర్మానంలోనూ ఈ విషయాన్ని పొందుపరిచారు. ఈ నేపథ్యంలో- సచివాలయం, ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంతో పాటు రాజ్భవన్ కోసం అనువైన భవనాలను అధికారులు పరిశీలించారు.
ఇందులో భాగంగా పోర్ట్ గెస్ట్హౌస్ను కూడా పరిశీలించారు. రాజ్భవన్గా మార్చడానికి అనువుగా ఉంటుందని తొలుత భావించారు. ఈ గెస్ట్హౌస్ను గవర్నర్ అధికారిక నివాసంగా తీర్చిదిద్దాలని ప్రయత్నించారు. దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలను కూడా గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కార్యాలయానికి పంపించారు. అదే సమయంలో- ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి అవసరమైన, అనువైన భవనాలు వారి కంట్లో పడలేదు.
ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం కోసం ప్రతిష్ఠాత్మక ఆంధ్రా యూనివర్శిటీకి చెందిన కొన్ని భవనాలను అధికారులు పరిశీలించారు. యూనివర్శిటీ నుంచి మిలీనియం టవర్స్ మధ్య దూరం అధికం కావటం వల్ల ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నట్లు తెలుస్తోంది. రాజ్భవన్ను అప్పటికప్పుడు తరలించాల్సిన అవసరం లేనందున.. దాని కోసమంటూ గుర్తించిన పోర్ట్ గెస్ట్హౌస్ను ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంగా తీర్చిదిద్దాలని నిర్ణయించుకున్నారు. దీనిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన అంగీకారాన్ని ఇంకా తెలియజేయాల్సి ఉన్నట్లు చెబుతున్నారు.