రైల్వే జోన్ ప్రకటించారు..అయినా: ఆదాయానికి రెడ్ సిగ్నల్ : రెండు జోన్లుగా ఏపి జిల్లాలు..!
Recommended Video
ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. దీని పై బిజెపి హర్షం వ్యక్తి చేస్తోంది. ఇదే సమయంలో ఈ జోన్ నిర్ణయం పై అనేక అనుమానాలు ..సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.కొత్త జోన్ కారణంగా ఏపికి ప్రయోజనమా కాదా అనే చర్చ మొదలైంది.
విశాఖ కేంద్రంగా రైల్వే జోన్..
ఇప్పటిదాకా దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఉన్న విజయవాడ, గుంతకల్లు, గుంటూరు డివిజన్లతో విశాఖపట్నం రైల్వే జోన్ ఏర్పాటు చేస్తున్నట్లు పీయూష్ ప్రకటించారు. అత్యంత కీలకమైన, 125 ఏళ్ల చరిత్ర ఉన్న వాల్తేరు డివిజన్ను కేంద్రం చరిత్రలో కలిపేసింది. దీంతో.. ఈ డివిజన్ను రెండు ముక్కలు చేసింది. ఒక ముక్కను విజయవాడ డివిజన్ లో కలిపారు. మరో ముక్కతో ఒడిసాలోని రాయగఢ కేంద్రంగా కొత్త డివిజన్ ఏర్పాటు చేస్తున్నారు. అంటే... విశాఖ కేంద్రంగా జోన్ ఉంటుందికానీ, డివిజన్ ఉండదు. ఇప్పటిదాకా డివిజన్ కేంద్రాన్ని జోన్గా అప్గ్రేడ్ చేసినప్పుడు, డివిజన్లను యథాతథంగానే ఉంచారు. ఇప్పుడు వాల్తేరు విషయంలో కొత్త సంప్రదాయానికి తెరలేపారు. విశాఖ జోన్గా ఉన్నప్పటికీ... డివిజన్ లేకపోతే సమన్వయం కష్టమవుతుందని చెబుతున్నారు.
ఆదాయ పరంగానూ నష్టమే..
విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు లో తీసుకున్న కొత్త డివిజన్ల నిర్ణయం తో ఆదాయ పరంగానూ నష్టం ఏర్పడే అవకాశం కని పిస్తోంది. వాల్తేర్ డివిజన్తో మనకు వచ్చిన ‘వాటా'. వాల్తేర్ డివిజన్ ఆదాయంలో దేశంలోనే ఐదో స్థానంలో ఉంది. గత ఏడాది రూ.7,500 కోట్ల ఆదాయం సంపాదించి పెట్టింది. కోరాపుట్, కిరండోల్ లైన్ల పరిధిలో బైలదిల్లా గనుల నుంచి ఇనుప ఖనిజం రవాణాయే దీని ప్రధాన ఆదాయ వనరు. ఇప్పుడు... ఇప్పుడు ఈ ఆదాయమంతా కొత్తగా ఏర్పడనున్న రాయగఢ డివిజన్కు దక్కుతుంది. ప్రయాణికుల ఆదాయం మాత్రమే విశాఖ జోన్ పరిధిలోకి వస్తుంది. ఎందుకంటే... సరుకు రవాణాలో కీలకమైన కోరాపుట్, కిరండోల్ లైన్లను రాయగఢలోనే కలిపేశారు. దీని ద్వారా ఆ ఆదాయం మొత్తం భువనేశ్వర్ కేంద్రంగా ఉన్న ఈస్ట్ కోస్ట్ రైల్వేకే దక్కుతుంది. దీని కారణంగా విశాఖ రైల్వే జోన్ కేవలం ప్యాసింజర్ ఆదాయం పైనే ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
ఒక్కటిగా కాకుండా..ముక్కులుగా..
కొత్త రైల్వే జోన్ ఏర్పాటులో కేంద్రం తీసుకున్న నిర్ణయం లో మరో కొత్త కోణం ఉంది. గుంటూరు, గుంతకల్లు, విజయవా డ తోపాటు వాల్తేరు డివిజన్లోని తెలుగు ప్రాంతాలతో కలిపి విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని పోరాటం జరిగింది. కేంద్ర ప్రభుత్వం కనీసం ఈ పని కూడా చేయలేకపోయింది. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో పలాస నుంచి ఇచ్ఛాపురం వరకూ ఉన్న రైల్వే స్టేషన్లు ఖుర్దా (ఒడిసా) డివిజన్లో ఉన్నాయి. ఇకపైనా అలాగే ఉంటాయి. వీటన్నింటినీ విశాఖ జోన్లో కలపాలన్నది ఉత్తరాంధ్ర వాసుల డిమాండ్. దీనిని కూడా పరిగణలోకి తీసుకోలేదు. దీంతో..ఇప్పుడు తెలుగు ప్రాంతాలు సైతం రెండు జోన్ల పరిధిలోకి రానున్నాయి. దక్షిణ మధ్య రైల్వేకు తెలంగాణ ప్రాంతానికి పరిమతం చేసే లా కేంద్ మంత్రి ప్రకటన ఉందనే అభిప్రాయం వినిపిస్తోంది.