విశాఖ స్టీల్ ప్రైవేటీకరించొద్దు, వాటిలో విలీనం చేయండి: కేంద్రమంత్రితో ఏపీ బీజేపీ నేతలు
న్యూఢిల్లీ: కేంద్ర ఉక్కు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్తో ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలు సోమవారం భేటీ అయ్యారు. బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, కేంద్ర మాజీ మంత్రి పురంధేశ్వరి, ఎమ్మెల్సీ మాధవ్, మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఈ భేటీలో పాల్గొన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయంపై పునరాలోచించాలని ఈ సందర్భంగా కేంద్రమంత్రి ప్రధాన్ను కోరారు. ఈ మేరకు వినతి పత్రం అందజేశారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించొద్దు..
అనంతరం సోము వీర్రాజు మీడియాతో మాట్లాడుతూ.. స్టీల్ పాంట్పై ప్రజల సెంటిమెంటును కేంద్రమంత్రికి వివరించినట్లు తెలిపారు. విశాఖస్టీల్ ప్లాంట్పై ప్రత్యామ్నాయాలు చూడాలని కోరామన్నారు. బ్యాంకుల విలీనం తరహాలోనే.. వేరే ప్రభుత్వ రంగ సంస్థలలో విశాఖ స్టీల్ ప్లాంటును విలీనం చేయాలని విజ్ఞప్తి చేసినట్లు తాలిపారు. అందరి ప్రయోజనాలు కాపాడాలని కోరినట్లు సోము వీర్రాజు తెలిపారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, పలువురు ముఖ్య నేతలను కలిసి విశాఖ ఉక్కు కర్మాగారం విషయంలో ఉన్న మనోభావాలను వివరిస్తామని తెలిపారు.
వైజాగ్ స్టీల్ ప్లాంట్ను వాటిలో విలీనం చేయండి..
పురంధేశ్వరి మాట్లాడుతూ.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు పలు ప్రత్యామ్నాయాలు సూచించామని తెలిపారు. సెయిల్, ఎన్ఎండీసీలో విలీన ప్రతిపాదనలు చేశామన్నారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల శ్రేయస్సును పరిరక్షించాలని కేంద్రమంత్రిని కోరినట్లు పురంధేశ్వరి తెలిపారు. స్టీల్ ప్రైవేటీకరణపై పునరాలోచించాలని కోరామని, ఉద్యోగుల పరిస్థితిపై వివరించామని మాధవ్ తెలిపారు.
స్టీల్ ప్లాంట్పై జగన్ లేఖ, పవన్ ఢిల్లీ టూర్..
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలు ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే బీజేపీ నేతలు కూడా ఈ విషయంపై కేంద్రమంత్రులను కలిసి సమస్యను వివరిస్తున్నారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రధానికి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై లేఖ రాయగా, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లి కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు. స్టీల్ ప్లాంట్ ప్రవేటీకరణను వ్యతిరేకిస్తూ ఉద్యోగ సంఘాలు కూడా పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నాయి.