విశాఖ టీడీపీలో అంతర్యుద్ధం .... హాట్ టాపిక్ గా లేఖాస్త్రం .. పార్టీ శ్రేణుల్లో అంతర్మధనం...
గత ఎన్నికల్లో అధికారం కోల్పోయి, చావు తప్పి కన్ను లొట్ట పోయిన చందంగా బయటపడిన టీడీపీకి అటు అధికార పక్షంతోనే కాదు, ఇక స్వపక్ష నాయకుల తోనూ తలనొప్పి తయారైంది. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఏకతాటి మీద పని చేయాల్సిన నాయకులు అలా కాకుండా ఒకరికొకరు సహాయ నిరాకరణ చేస్తే పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం విశాఖ జిల్లాలో నాయకుల తీరు అదే విధంగా కనిపిస్తుంది. ఇది టీడీపీ అధిష్టానానికి, పార్టీ శ్రేణులకు పెద్ద తలనొప్పిగా మారింది.
విశాఖ టీడీపీలో అంతర్గత కలహాలు .. సైలెంట్ గా కీలక నాయకులు
విశాఖపట్నంలో టిడిపి క్యాడర్ రెండు వర్గాలుగా చీలిపోయింది. వీరి మధ్య అంతర్గత విభేదాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఒకరికి ఒకరు మద్దతివ్వకుండా, ఎవరికి వారు స్వతంత్రంగా పని చేసుకుంటూ పోతున్నారు. ఇక ప్రెస్ మీట్లు పెట్టినా , ఏ కార్యక్రమం చేసినా ఎవరికి వారే చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. గతంలో జిల్లా మంత్రులుగా పనిచేసిన నాయకులు సైతం ప్రస్తుతం పెద్దగా పార్టీ కార్యక్రమాల మీద దృష్టి సారించడం లేదు. అధికారపార్టీ ఒత్తిడితో, తమకు ఎక్కడ ఇబ్బంది కలుగుతుందో అని సైలెంట్ గా చూస్తున్నారు.
ఎమ్మెల్యే వర్సెస్ అర్బన్ జిల్లా పార్టీ ప్రెసిడెంట్ రెహమాన్ ... నారా లోకేష్ కు ఫిర్యాదు
ఇక విశాఖ టీడీపీ లో నడుస్తున్న కోల్డ్ వార్ గురించి చెప్పాలంటే విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ కు , విశాఖ అర్బన్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ ఎస్ ఏ రెహమాన్ కు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. వీరిద్దరి మధ్య ప్రచ్ఛన్న యుద్ధం నడుస్తోంది. అర్బన్ జిల్లా అధ్యక్షుడు చేసే కార్యక్రమానికి విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ సహాయ సహకారాలు అందించడం లేదు. వాసుపల్లి గణేష్ కుమార్ పై రహమాన్ తాజాగా ఒక ఫిర్యాదు చేశారని సమాచారం . నర్సీపట్నం పర్యటన సందర్భంగా విశాఖ ఎయిర్ పోర్ట్ కు వచ్చిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ కు రహమాన్ అక్కడ వాసుపల్లి గణేష్ వైఖరిపై ఫిర్యాదు చేశారు. కనీసం పార్టీ కార్యాలయాన్ని కూడా రావడం లేదని, తనకు సహకరించడం లేదని నారా లోకేష్ కు చెప్పినట్లుగా తెలుస్తోంది.
విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ కు లేఖాస్త్రం సంధించిన అర్బన్ అధ్యక్షుడు రెహమాన్
ఇక దీంతో వీరి మధ్య ప్రచ్ఛన్న యుద్ధం మరింత ముదిరింది. ఇక ఇటీవల విశాఖ అర్బన్ జిల్లా పార్టీ అధ్యక్షుడు రెహమాన్ విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ కు ఒక లేఖాస్త్రం సంధించారు. గతంలో అర్బన్ జిల్లా అధ్యక్షుడిగా పని చేసిన వాసుపల్లి గణేష్ కుమార్ పార్టీ నియమ నిబంధనలు తెలుసుకుని ఉండాలని, తాను అర్బన్ జిల్లా అధ్యక్షుడుగా ప్రమాణ స్వీకారం చేసే సమయంలో కూడా వాసుపల్లి గణేష్ కుమార్ రాలేదని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. అంతేకాదు క్రమశిక్షణ కలిగిన నాయకులుగా పార్టీ కోసం పని చేయాలని, విశాఖ దక్షిణ ఎమ్మెల్యేగా పార్టీని బలోపేతం చేయడానికి తన వంతు సహాయ సహకారాలు అందించాలని, లేకుంటే హైకమాండ్ దృష్టికి ఈ వ్యవహారాన్ని తీసుకెళ్లాల్సి వస్తుందని ఆయన ఎమ్మెల్యే గణేష్ కుమార్ కు లేఖ రాశారు.
ముఖ్య నేతల అంతర్గత కుమ్ములాటలతో అయోమయంలో పార్టీ శ్రేణులు .. ఇలా అయితే కష్టమే అంటున్న తెలుగు తమ్ముళ్ళు
ప్రస్తుతం ఈ లేఖ విశాఖ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. మరి విశాఖ అర్బన్ జిల్లా పార్టీ అధ్యక్షుడు రాసిన లేఖకు ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఏం సమాధానం చెబుతారు అన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతున్న అంశం. ఒకపక్క వైసీపీ అధికారంలోకి వచ్చి టీడీపీని టార్గెట్ చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తుంది అని అధిష్టానం భావిస్తుంటే, అందరూ ఏకతాటి మీద పనిచేసి వైసీపీని ఎదుర్కోవలసింది పోయి అలా కాకుండా తెలుగు తమ్ముళ్లు ఈ విధంగా అంతర్గత కలహాల కు పాల్పడడం పార్టీ శ్రేణుల్లో అంతర్మధనానికి కారణమవుతుంది. ఇక ఇప్పటికైనా ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఆయన తెలుగు తమ్ముళ్లు మారకుంటే విశాఖ జిల్లాలో పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా తయారవుతుంది. గత ప్రభుత్వ హయాంలో విశాఖ నుండి మంత్రులుగా పనిచేసిన కీలక నాయకులు ఇప్పుడు పరిస్థితుల దృష్ట్యా సైలెంట్ గా ఉంటే, పార్టీలోని ముఖ్య నాయకులు ఈ విధంగా ఘర్షణల తో పార్టీ పరువును రచ్చకీడ్చటం పార్టీని భవిష్యత్తులో కష్టాల్లోకి నెడుతుంది అనటం నిర్వివాదాంశం.