రంగా హత్య కేసులో నేనా?...నిరూపిస్తే రాజకీయ సన్యాసం:టీడీపీ ఎమ్మెల్యే ఛాలెంజ్
విశాఖపట్నం: రంగా హత్య కేసుకు సంబంధించి వైసిపి నేత విజయ్ సాయి రెడ్డి తనపై చేసిన ఆరోపణలను విశాఖ తూర్పు తూర్పు నియోకవర్గం టిడిపి ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ఘటుగా స్పందించారు.
వంగవీటి రంగా హత్య కేసులో తాను ఉన్నానని విజయ్ సాయి రెడ్డి నిరూపిస్తే రాజకీయాల నుంచే తప్పుకుంటానని ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు అన్నారు. అయితే తనపై కేసులున్నట్లు నిరూపించలేకపోతే విజయసాయిరెడ్డి రాజకీయాల నుంచి తప్పుకుంటారా అని ఆయన సవాల్ విసిరారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని, 19 విభజన హామీలను అమలు చేయాలని ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు డిమాండ్ చేశారు.
ఈనెల 22న విశాఖపట్టణంలో జరగనున్న ధర్మ పోరాట దీక్ష విజయవంతం కావాలని కోరుతూ పోలమాంబ ఆలయంలో ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ తెలుగుదేశం పార్టీ ఈ నెల 22వ తేదీన నగరంలో ధర్మ పోరాట దీక్ష నిర్వహించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమాన్ని తొలుత 20వ తేదీ ఆదివారం నిర్వహిస్తే బాగుంటుందని భావించినా ఆ తరువాత 22కు మార్చారు.
ఈ కార్యక్రమం ఎక్కడ నిర్వహించాలి?, ఎంతమందిని సమీకరించాలి?, ఎవరెవరు వస్తారు? తదితర ఏర్పాట్లపై శనివారం నగర పార్టీ కార్యాలయంలో జరిగే ప్రత్యేక సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకటరావు, ఇన్చార్జి మంత్రి చినరాజప్ప, జిల్లా మంత్రులు అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అంతా కలిసి ఈ విషయమై చర్చిస్తారు.