యుద్ధ ప్రాతిపదికన శుద్ధి: హెలికాప్టర్ను రంగంలో దింపిన జీవీఎంసీ: 8 చదరపు కి.మీ పరిధిలో..
విశాఖపట్నం: విశాఖపట్నంలో సమీపంలోని ఆర్ఆర్ వెంకటాపురంలో గల ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో విష వాయువుల లీకేజీపై స్థానిక అధికార యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన స్పందించింది. విష వాయువులు విస్తరించిన ప్రాంతాలన్నింటినీ శుద్ధి చేస్తోంది. దీనికోసి హెలికాప్టర్ను రంగంలోకి దించింది. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) అధికారుల నేతృత్వంలో ఈ పనులు కొనసాగుతున్నాయి.
Recommended Video
ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీపై మోడీ, రాహుల్ గాంధీ దిగ్భ్రాంతి: వైఎస్ జగన్కు ప్రధాని ఫోన్
పలు ప్రాంతాల్లో కొనసాగుతున్న శుద్ధి కార్యక్రమాలు..
ఎల్జీ పాలిమర్స్ సంస్థ ఉన్న ఆర్ఆర్ వెంకటాపురం సహా టైలర్స్ కాలనీ, ఇందిరానగర్, నాయుడుతోట, వ్యవసాయ మార్కెట్ కమిటీ రోడ్డు, సింహాచలానికి వెళ్లే మార్గాలు, కొత్తపాలెం, భగత్సింగ్ నగర్, మాధవాపురం, సింహపురి కాలనీ, కృష్ణరాయపురం, పొర్లుపాలెం, సంతోష్ నగర్, కాకాని నగర్, సింహపురి కాలనీ.. వంటి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున శుద్ధి కార్యక్రమాలను చేపట్టారు. హెలికాప్టర్ ద్వారా సముద్రపు నీటిని తీసుకొచ్చి ఆయా ప్రాంతాల్లో చల్లుతున్నారు.
ఎనిమిది చదరపు కిలోమీటర్ల పరిధిలో..
ఎల్జీ పాలిమర్స్ కంపెనీ గల ఆర్ఆర్ వెంకటాపురాన్ని కేంద్రబిందువుగా చేసుకుని చుట్టూ ఆరు నుంచి ఎనిమిది చదరపు కిలోమీటర్ల పరిధిలో ఈ శుద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. దీనికోసం అందుబాటులో ఉన్న అన్ని వనరులను అందుబాటులోకి తీసుకుని వచ్చారు గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు. ఇదివరకు కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా నివారించడానికి వినియోగించిన వాహనాలను ప్రస్తుతం దీనికోసం వాడుతున్నారు. విష వాయువులు మరింత విస్తరించకుండా ఉండటానికి అన్ని చర్యలను యుద్ధ ప్రాతిపదికన చేపట్టినట్లు మున్పిపల్ కమిషనర్ గుమ్మళ్ల సృజన తెలిపారు.
ముందుజాగ్రత్త చర్యలు తప్పనిసరి..
ఈ ఎనిమిది చదరపు కిలోమీటర్ల పరిధిలో ఉన్న ప్రజలు మాస్కులను ధరించాలని ఆదేశించారు. విష వాయువుల ప్రభావం ఉన్నట్టయితే వెంటనే జీవీఎంసీ ప్రధాన కార్యాలయం లేదా.. జోన్ కార్యాలయాలకు ఫోన్ చేయాలని సూచించారు. పలుచోట్ల మూగ జీవాలు, గేదెలు మరణించినట్లు సమాచారం అందిందని జీవీఎంసీ అధికారులు తెలిపారు. ఆయా ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఎలాంటి అనారోగ్యకర లక్షణాల బారిన పడినప్పటికీ.. వెంటనే సమీప ఆసుపత్రికి వెళ్లాలని సూచించారు.
రెండువేల మందికి పైగా అస్వస్థత..
ఘటన రాష్ట్రం మొత్తాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఈ కంపెనీ నుంచి వెలువడిన విషవాయువుల వల్ల ముగ్గురు మరణించడం.. వెయ్యిమందికి పైగా స్థానికులు అస్వస్థతకు గురి కావడం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తమౌతోంది. విష వాయువులను పీల్చిన స్థానికులు ఎక్కడికక్కడే సొమ్మసిల్లిపోతున్నారు. ఊపిరి అందక అల్లాడుతున్నారు. తెల్లవారు జామున 3 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు అధికారులు ధృవీకరించారు. సుమారు రెండువేల మందికి పైగా స్థానికులు అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది.