ఉత్తరాంధ్ర ద్రోహి టీడీపీ: చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్: ఆంధ్రా వర్శిటీ ఉద్యోగుల ఆగ్రహం.. !
విశాఖపట్నం: శాసన మండలిలో ఏపీ వికేంద్రీకరణ బిల్లును అడ్డుకున్న తెలుగుదేవం పార్టీపై ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమౌతోంది. అత్యంత వెనుకబడిన, ఉపాధి అవకాశాలు లేక వలసలను ఎదుర్కొంటోన్న ఉత్తరాంధ్ర అభివృద్ధిని చంద్రబాబు, ఆయన సారథ్యంలోని తెలుగుదేశం పార్టీ అడ్డుకుందనే ఆగ్రహావేశాలు వ్యక్తమౌతున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాల్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలను చేపట్టారు స్థానికులు.
ఏపీలో ఎన్పీఆర్: పౌర నమోదు అమలుకు జగన్ సర్కార్: ఉత్తర్వులు జారీ..!
చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం
ఏపీ వికేంద్రీకరణ బిల్లును శాసన మండలి సెలెక్ట్ కమిటీకి పంపించడం పట్ల విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్శిటీ ఉద్యోగ సంఘాల నాయకులు, బోధన, బోధనేతర సిబ్బంది పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలను చేపట్టారు. విశ్వవిద్యాలయం ప్రధాన ముఖద్వారం వద్ద బైఠాయించారు. చంద్రబాబు, తెలుగుదేశం పార్టీకి నిరసనగా నినాదాలు చేశారు. చంద్రబాబు ఉత్తరాంధ్ర ద్రోహి అంటూ నినదించారు.
విశాఖపట్నం ద్రోహులు అంటూ బ్యానర్లు..
చంద్రబాబు, ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు, గణేష్ కుమార్, గంటా శ్రీనివాస రావు, మాజీ ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్నపాత్రుడు చిత్రపటాలతో కూడిన బ్యానర్లను ఆంధ్రా యూనివర్శిటీ ప్రధాన గేటుకు కట్టారు. దానిపై విశాఖపట్నం ద్రోహులు అని రాశారు. విశాఖపట్నాన్ని పరిపాలనా రాజధానిగా బదలాయించడాన్ని అడ్డుకున్నారని, వారికి బుద్ధి చెప్పి తీరుతామని మండిపడ్డారు. ఇక భవిష్యత్తులో జరిగే ఎలాంటి ఎన్నికల్లోనయినా తెలుగుదేశం అభ్యర్థులను గెలవనీయబోమని హెచ్చరించారు.
చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్..
తెలుగుదేశం పార్టీకి తాము నలుగురు శాసన సభ్యులు, ఇద్దరు శాసన మండలి సభ్యులను అందించామని, అయినప్పటికీ.. కనీస కృతజ్ఙత కూడా లేకుండా చంద్రబాబు నాయుడు వ్యవహరించారని విమర్శించారు. తెలుగుదేశం సభ్యులు గానీ, చంద్రబాబు గానీ.. అడ్డుకున్నది ఏపీ వికేంద్రీకరణ బిల్లును కాదని.. ఉత్తరాంధ్ర అభివృద్ధిని అని చెప్పారు. చంద్రబాబుకు అదిరి పోయేలా రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని ఆంధ్రా యూనివర్శిటీ ఉద్యోగులు స్పష్టం చేశారు.
అచ్చెన్నాయుడు, రామ్మెహన్ నాయుడు సమాధానం చెప్పాలి..
మరోవంక- శ్రీకాకుళం జిల్లాలో కూడా ఏపీ వికేంద్రీకరణ బిల్లును అడ్డుకున్న ప్రభావం కనిపిస్తోంది. స్థానికులు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలను చేపట్టారు. విశాఖపట్నాన్ని పరిపాలనా రాజధానిగా మార్చడం వల్ల కొద్దో, గొప్పో తమ బతుకులు బాగుపడతాయని ఆశించామని, తమ మనోభావాలకు భిన్నంగా తెలుగుదేశం పార్టీ ప్రవర్తించిందని అన్నారు. దీని పట్ల తమ వైఖరి ఏమిటనేది మాజీమంత్రి అచ్చెన్నాయుడు, లోక్సభ సభ్యుడు కింజరాపు రామ్మోహన్ నాయుడు వెల్లడించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.