విశాఖపట్నం మరో రికార్డు... ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అనే ప్రభుత్వ ప్రకటనతోనే..!
విశాఖపట్నం: ఇప్పటికే కేంద్రం ప్రకటించిన స్వచ్ఛ్ సర్వేక్షన్లో తొమ్మిదవ స్థానం పొందిన విశాఖపట్నం మరోసారి వార్తల్లో నిలిచింది. ఈ సారి మన విశాఖనగరం పెట్టుబడులకే కాకుండా పర్యాటక రంగం,మౌలిక సదుపాయాలకు కూడా ఇష్టమైన గమ్యస్థానంగా మారింది. విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా వస్తుందని ప్రభుత్వం ప్రకటన చేసినప్పటి నుంచే విశాఖపై ప్రత్యేక దృష్టి సారించింది. అదే సమయంలో చాలామంది పెట్టుబడిదారులను సైతం ఆకట్టుకుంది ఈ సుందర నగరం. ఓ ప్రైవేట్ సంస్థ చేపట్టిన సర్వేలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.
విశాఖపట్నం... ఈ పేరు వింటేనే ఏదో తెలియని అనుభూతి కలుగుతుంది. ఏపీ ఆర్థిక రాజధానిగా గుర్తింపు పొందిన విశాఖపట్నం మరో కొత్త రికార్డు తన వెనకేసుకుంది. దేశవ్యాప్తంగా అత్యంత ధనిక నగరాల్లో విశాఖ నగరం టాప్టెన్లో స్థానం పొందింది. ప్రోగ్రామింగ్ మరియు ఫార్మాసూటికల్ ఇండస్ట్రీలు, పలు ప్రభుత్వ రంగ సంస్థలకు నెలవై ఉన్న విశాఖ నగరం 26 బిలియన్ డాలర్ల జీడీపీతో దేశవ్యాప్తంగా టాప్ టెన్ నగరాల్లో చోటు దక్కించుకుంది. ఓ ప్రైవేట్ సంస్థ చేసిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది.
విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్, దేశంలోనే అతి ప్రాచీనమైన నౌకాశ్రయం హిందుస్తాన్ షిప్యార్డ్తో పాటు పలు పెద్ద సీపోర్టులు, గెయిల్, వైజాగ్ స్టీల్, హిందుస్తాన్ స్టీల్ లాంటి పరిశ్రమలు ఉన్నాయి. అంతేకాదు ఐటీ హబ్గా విశాఖ నగరాన్ని ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. ఇక సర్వే చేయగా విశాఖపట్నంతో పాటు ముంబై, ఢిల్లీ, కోల్కతా, బెంగళూరు, చెన్నై, హైదరాబాదు, పూణే, అహ్మదాబాదు, సూరత్ నగరాలు కూడా అత్యంత ధనిక నగరాలుగా నిలిచాయి.
ఇక భారత్ 5 ట్రిలియన్ డాలర్ల జీడీపీతో మూడవ అతిపెద్ద ధనిక దేశంగా నిలిచిందని ఆ ప్రైవేట్ సంస్థ చేసిన సర్వేలో వెల్లడైంది. ఇది పట్టణీకీకరణ, పారిశ్రామికీకరణతోనే సాధ్యమైందని ఆ నివేదిక వెల్లడించింది. గత వారమే స్వచ్ఛ సర్వేక్షన్లో విశాఖపట్నం అత్యంత పరిశుభ్రమైన నగరాల్లో విశాఖపట్నం టాప్టెన్లో నిలిచింది. ఇదిలా ఉంటే విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా మార్చేందుకు ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తుండగా... కోర్టుల్లో ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. విశాఖను కార్యనిర్వహక రాజధానిగా ఉత్తరాంధ్ర ప్రజలు స్వాగతిస్తున్నారు. అదే సమయంలో ఇన్వెస్టర్లు కూడా విశాఖలో పెట్టుబడులు పెట్టేందుకు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. అయితే అన్ని అడ్డంకులను అధిగమించి విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా అధికారికంగా వస్తేనే ఇది సాధ్యమవుతుందని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.