ఏపీలో కరోనా తొలి మరణం?: విశాఖ కలెక్టర్ వివరణ, హెచ్చరిక
విశాఖపట్నం: కరోనావైరస్ వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ప్రభుత్వం, అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. కరోనావైరస్ కారణంగా ఏపీలో తొలి మరణం సంభవించిందంటూ సోషల్ మీడియాలో వదంతులు వచ్చాయి. ఈ నేపథ్యంలో విశాఖ జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ తెలిపారు.
కలెక్టర్ వివరణ, హెచ్చరిక..
విశాఖపట్నం జిల్లా వ్యాప్తంగా కరోనా వైరస్కు సంబంధించి అప్రమత్తంగా ఉన్నామని కలెక్టర్ వినయ్ చంద్ చెప్పారు. విశాఖ నగరంలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులన్నింటిలో ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేశామని తెలిపారు. విశాఖలో కరోనా పాజిటివ్గా తేలిన వ్యక్తి క్షేమంగానే ఉన్నాడని చెప్పారు. ఐసోలేషన్ వార్డులో బాధితుడికి చికిత్స కొనసాగుతుందని వెల్లడించారు. అతడు చనిపోయాడనే వార్తల్లో వాస్తవం లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఆందోళన అవసరం లేదు.. కానీ..
విశాఖ నగరంలో క్వారంటైన్ కోసం 4వేల బెడ్లు సిద్ధం చేస్తున్నామని తెలిపారు కలెక్టర్. ఇందులో 500పైగా బెడ్స్ ఐసోలేషన్ కోసం వినియోగించనున్నట్లు తెలిపారు. విశాఖలో ఒకటే పాజిటివ్ కేసు నమోదైందని, ఈ నేపథ్యంలో 115 బృందాలతో మరొకసారి కొన్ని ప్రాంతాలలో ఇంటింటి సర్వే చేపడతామని వివరించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇప్పటికే జిల్లాలో విద్యాసంస్థలు, సినిమా థియేటర్లు, స్విమ్మింగ్ ఫూల్స్, మాల్స్ మూసివేశామని తెలిపారు. కరోనాపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అయితే, ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం మంచిదని అన్నారు. ఆంధ్రా యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థులంతా ఇళ్లల్లోనే ఉండాలని వర్సిటీ రిజిస్ట్రార్ సూచించారు. హాస్టళ్లు ఖాలీ చేయించామని తెలిపారు.
ఆదివారం జనతా కర్ఫ్యూ..
కాగా, మంత్రి అవంతి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ.. కరోనాపై తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కరోనావైరస్ పట్ల ప్రజలు నిర్లక్ష్యంగా ఉండవద్దని, జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మార్చి 31 వరకు అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకి రావొద్దని సూచించారు. ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు ఈ ఆదివారం ప్రజలంతా స్వచ్ఛందంగా జనతా కర్ఫ్యూలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.