మాజీ ఎమ్మెల్యే కూతురుతో సంబంధం, హత్యకు రూ.కోటి, రౌడీషీటర్ హత్య: ఈ డీఎస్పీ మామూలోడు కాదు
విశాఖపట్టణంలో సంచలనం సృష్టించిన రెండు హత్య కేసులలో ఆర్టీసీలో విజిలెన్స్ డీఎస్పీ దాసరి రవిబాబును ప్రధాన నిందితుడని పోలీసు అధికారులు తేల్చారు.
విశాఖపట్నం: విశాఖపట్టణంలో సంచలనం సృష్టించిన రెండు హత్య కేసులలో ఆర్టీసీలో విజిలెన్స్ డీఎస్పీ దాసరి రవిబాబును ప్రధాన నిందితుడని పోలీసు అధికారులు తేల్చారు.
రౌడీ షీటర్ కొప్పెర్ల సత్యనారాయణ రాజు అలియాస్ గేదెల రాజు హత్యతో పాటు గత ఏడాది సెప్టెంబరు 22న అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ప్రియురాలు పద్మలతది హత్యగా పరిగణిస్తూ ఆ కేసులోను రవిబాబు ప్రధాన నిందితుడిగా చెప్పారు.
పద్మలతను పెళ్లి చేసుకుంటానని చెప్పి
రవిబాబు పోలీసు శాఖలో పలు హోదాల్లో పని చేశారు. ప్రస్తుతం ఆర్టీసీ విజిలెన్స్ డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్నారు. గతంలో విశాఖ ఎలమంచిలిలో పని చేస్తుండగా పాయకరావుపేట మాజీ ఎమ్మెల్యే నూకరాజు కూతురు, మాజీ మండల అధ్యక్షురాలు పద్మలతతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఆమెది రాజకీయ కుటుంబం కావడంతో కలిసి వస్తుందని భావించాడు. పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. కానీ తర్వాత ఎన్నికల్లో నూకరాజు ఎమ్మెల్యేగా గెలవకపోవడంతో రవిబాబు.. పద్మలతను దూరంగా పెట్టాడు. అలాగే, వారి మధ్య విభేదాలు వచ్చాయి. దీంతో తనను పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని రవిబాబుపై పద్మలత కేసు పెట్టారు. ఆ తర్వాత ఆమె అనుమానాస్పదస్థితిలో మృతి చెందారు. ఈ హత్య వెనుక రవిబాబు హస్తం ఉందని పోలీసులు గుర్తించారు.
గేదెల రాజు మృతి
ఆ తర్వాత రౌడీషీడర్ గేదెల రాజు హత్యకు గురయ్యాడు. గతేడాది మే వరకు రవిబాబు మధురవాడ ఏసీపీగా పని చేశారు. రౌడీషీటర్ గేదెల నాగరాజు హత్య కేసులో గాజువాకలోని క్షత్రియభేరి పత్రిక ఎడిటర్ భూపతిరాజు శ్రీనివాసరాజును పోలీసులు ఏ2 నిందితునిగా చూపించారు. మరో పది మందిని నిందితులుగా గుర్తించారు. వారిలో తొమ్మిది మందిని అదుపులోకి తీసుకుని రిమాండుకు తరలించారు. రవిబాబు, భూపతిరాజు శ్రీనివాసరాజు పరారీలో ఉన్నట్టు పోలీసులు చెబుతున్నా వీరిద్దరినీ ఇప్పటికే అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోందని వార్తలు వస్తున్నాయి. పరారీలో ఉన్న డ్రైవర్ కేశవ్ కోసం గాలిస్తున్నారు.
Recommended Video
ఏం జరిగిందంటే
హత్యకు సంబంధించిన వివరాలను పోలీసులు వెల్లడించారు. గాజువాకలోని శ్రీనగర్లో నివసిస్తున్న రౌడీషీటర్ కొప్పెర్ల సత్యనారాయణరాజు అలియాస్ గేదెల రాజు భార్య కుమారి తన భర్త కనిపించడంలేదని ఈ నెల 7న న్యూ పోర్టు పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. అదే రోజు సబ్బవరం మండలం గాలి భీమవరం శివారు ప్రాంతంలో ఓ వ్యక్తి మృతదేహం సగం వరకు కాలి ఉండడాన్ని పోలీసులు గుర్తించారు. కుమారిని అక్కడకు తీసుకెళ్లి చూపించగా శరీరంపై ఉన్న ఆభరణాల ఆధారంగా అది గేదెల రాజు మృతదేహంగా నిర్ధరించారు. ఈ ఘటనకు ముందు రోజు రాత్రి అతని బైక్ను ఓ వ్యక్తి నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అతను క్షత్రియ భేరి పత్రికా కార్యాలయంలో పనిచేస్తున్న గుమ్మడి రవిగా గుర్తించారు. అతని తీరు అనుమానాస్పదంగా ఉండడంతో పోలీసులు గట్టిగా నిలదీయడంతో అన్ని విషయాలు బయటపడ్డాయి.
రవిబాబుపై పద్మలత ఫిర్యాదు
ఆర్టీసీలో విజిలెన్స్ డీఎస్పీగా పని చేస్తున్న దాసరి రవిబాబు విశాఖ జిల్లా పాయకరావుపేటలో గతంలో సీఐగా పని చేశారు. అక్కడి నుంచి పదోన్నతిపై విశాఖ వచ్చిన అతను పలు విభాగాల్లో ఏసీపీగా పని చేశారు. 2014 నవంబరు 9న మధురవాడ ఏసీపీగా బదిలీ అయ్యారు. పాయకరావుపేటలో రవిబాబు పనిచేసేటప్పుడు తనను నమ్మించి మోసం చేశారంటూ కాకర్ల పద్మలత 2016 మార్చి 22న నగర పోలీసు కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు.
పద్మలతను హత్య చేసేందుకు రూ.1 కోటి ఒప్పందం
ఆ తరువాత ఆమె తరచూ విశాఖకు వస్తూ రౌడీషీటర్ గేదెల రాజు ఇంట్లో ఉండేది. ఇద్దరికీ రాజీ కుదురుస్తానని గేదెల రాజు చెప్పినా, పద్మలత వినలేదు. మరోవైపు, రవిబాబు ఆమెను అంతం చేయాలనుకున్నాడు. పద్మలతను హత్య చేయడానికి కోటి రూపాయలకు గేదెల రాజుతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. తొలుత రూ.50 లక్షలు ఇచ్చాడు. పనయ్యాక మిగిలిన రూ.50 లక్షలు ఇస్తానని నమ్మబలికాడు.
గేదెల రాజును కూడా చంపేయాలని
ఈ నేపథ్యంలో గత ఏడాది పద్మలత అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఆమె గుండెపోటుతో మరణించిందంటూ అప్పట్లో పోలీసులు కేసు కూడా నమోదు చేయలేదు. అనంతరం మిగిలిన రూ. 50 లక్షల కోసం గేదెల రాజు... రవిబాబుపై ఒత్తిడి తెచ్చాడు. తనకు డబ్బులు ఇవ్వకుంటే తన వద్ద ఉన్న ఆడియో టేపులు బయటపెడతానని హెచ్చరించాడు. దీంతో గేదెల రాజు ఉంటే ఎప్పటికైనా ప్రమాదమని రవిబాబు భావించాడు. విసిగిపోయిన ఆయన అతడిని కూడా అంతం చేసేందుకు పథకం వేశాడు.
కార్యాలయంలో హత్య చేసేందుకు ప్లాన్
భూదందాల్లో ఆరితేరిన క్షత్రియభేరి పత్రిక ఎడిటర్ భూపతిరాజు శ్రీనివాసరాజుకు విషయం చెప్పాడు. సహకరిస్తానని చెప్పాడు. ఇందుకు విశాఖ ఆదర్శనగర్లో నివసిస్తున్న సువ్వాడ మహేష్(32)ను ఎంచుకున్నారు. ఇతను పలు కేసుల్లో ప్రధాన నిందితుడు. అతనితో రూ.5 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. మహేష్తో పాటు మరో ఎనిమిది మందిని సిద్ధం చేశారు. ఈ నెల 6న గాజువాకలోని క్షత్రియభేరి ప్రాంతీయ కార్యాలయంలో హత్య చేయాలని పథకం పన్నారు.
కార్యాలయానికి పిలిపించి దాడి చేసి, చంపేశారు
రాజుని ఈ నెల ఆరో తేదీన మధ్యాహ్నం మూడున్నర గంటలకు క్షత్రియభేరీ కార్యాలయానికి పిలిపించారు. రాజు లోపలకు రాగానే అతనిపై ఒక్కసారిగా సువ్వాడ మహేష్, ఎర్ని శ్రీనివాసరావు, కేశవ్, అల్లా గోపి, మైలపిల్లి విజయ్కుమార్ అలియాస్ బిల్లా వెనకవైపు నుంచి కర్రలతో, బొంగా మురళి, ఆనంద్కుమార్ కత్తులతో దాడిచేశారు. ఈ ఘటనలో గేదెలరాజు అక్కడికక్కడే మృతి చెందాడు.
నిప్పు అంటించి వచ్చి శుభ్రం చేశారు
సబ్బవరం మండలం గాలి భీమవరం శివారు ప్రాంతానికి తీసుకు వెళ్లి పెట్రోలు పోసి నిప్పు అంటించారు. అనంతరం క్షత్రియ భేరి కార్యాలయానికి వచ్చి అంతా శుభ్రం చేశారు.
ఎలా పట్టుబడ్డారంటే
గేదెల రాజు కనిపించడం లేదంటూ ఆయన భార్య ఫిర్యాదు చేసింది. అదే సమయంలో సగం కాలిన మృతదేహం లభించింది. ఈ క్రమంలో భూపతిరాజు వద్ద పని చేసే రవి.. గేదెల రాజు బైక్ పైన వెళ్తూ పోలీసుల కంటపడ్డారు. గేదెల రాజు చివరి ఫోన్ కాల్ భూపతిరాజుదే. వీటిపై పోలీసులు ఆరా తీయగా విషయం వెలుగు చూసింది.