విశాఖ విషాదం: ఎల్జీతో జగన్ కుమ్మక్కు.. సాక్ష్యాలు బయటపెట్టిన టీడీపీ.. విజయసాయి కౌంటర్
ఈ మిలీనియంలో చోటుచేసుకున్న అతిపెద్ద పారిశ్రామిక ప్రమాదాల్లో ఒకటిగా విశాఖపట్నం గ్యాస్ లీకేజీ ఘటన నిలిచింది. స్థానిక ఆర్ఆర్ వెంకటాపురంలోని ఎల్జీ పాలిమర్స్ ప్లాంటులో విషపూరిత స్టెరీన్ మోనోమర్ గ్యాస్ లీకేజీ కారణంగా చనిపోయినవారి సంఖ్య 12కు పెరిగింది. మరో 193 మంది బాధితులు విశాఖ కేజీహెచ్లో చికిత్స పొందుతున్నారు. వారిలో 45 మంది చిన్నారులు ఉన్నారు.
కాగా, మల్టీనేషనల్ కంపెనీ అయిన ఎల్జీతో ఏపీ సీఎం జగన్ కుమ్మక్కై, అడ్డగోలుగా పర్మిషన్లు ఇచ్చినందుకే ఈ దుర్ఘటన జరిగిందని ప్రతిపక్ష టీడీపీ సంచలన ఆరోపణలు చేసింది. ఆ మేరకు కొన్ని సాక్ష్యాలను కూడా బయటపెట్టింది. అధికార వైసీపీ మాత్రం ఈ ఆరోపణల్ని ఖండించింది. చంద్రబాబుకు మెంటలెక్కిందంటూ ఎంపీ విజయసాయి ఘాటుగా కౌంటరిచ్చారు.
ప్లాంటులో ఏం జరిగిందంటే..
అసలే బరువుగా ఉండే స్టెరీన్.. ఏమాత్రం ఉష్ణోగ్రత పెరిగినా.. గ్యాస్ రూపంలోకి మారి.. ట్యాంకర్ల నుంచి లీకవుతుంది కాబట్టి, ఎప్పటికప్పుడు రిఫ్రిజిరేషన్ చేస్తూ ఉష్ణోగ్రతలు 25 డిగ్రీలను మించకుండా చూసుకుంటారు. లాక్ డౌన్ కారణంగా అతి తక్కువ మంది సిబ్బంతితో పర్యవేక్షణ జరుపుతుండటం, రిఫ్రిజిరేషన్ పై అంచనాలు తలకిందులయ్యాయి. ట్యాంకర్ కింది భాగం చల్లగానే ఉన్నా, పై భాగంలో వేడి పెరిగిపోయి, గ్యాస్ లీకేజీ ప్రారంభమైంది. అప్పటికే ఆ ట్యాంకులో రెండువేల మెట్రిక్ టన్నుల స్టెరీన్ ఉన్నట్లు కంపెనీయే ప్రకటించింది. కాగా,
రెండో ట్యాంకర్ నిండుకుండ..
విశాఖలోని ఎల్జీ పాలిమర్స్ ప్లాంటులో స్టెరీన్ రసాయనాన్ని నిలువ చేయడానికి 2,500 మెట్రిక్ టన్నుల ట్యాంకర్ ఉండగా.. సామర్థ్యాన్ని పెంచుకోవడంలో భాగంగా ఏడాది కిందటే 3,000 మెట్రిక్ టన్నుల సామర్థ్యం ఉన్న మరో ట్యాంకర్ ను ఏర్పాటు చేశారు. గురువారం తెల్లవారుజామున గ్యాస్ లీకైంది పాత ట్యాంకర్ నుంచే. నిజానికి అప్పటికప్పుడు దాన్ని వేరే ట్యాంకులోకి మార్చాలి. కానీ కొత్త ట్యాంకులోకూడా 3 వేల మెట్రిక్ టన్నుల స్టెరీన్ నిల్వ ఉండటంతో సిబ్బందికి వేరే దారిలేకపోయింది. సేఫ్టీ లేకుండా రెండు ట్యాంకర్లు ఏర్పాటుచేయడాన్ని, దానికి అనుమతులు లభించిన విధానాన్నే టీడీపీ హైలైట్ చేస్తోంది..
విస్తరణ అనుమతులపై రగడ..
ఎల్జీ ప్లాంటులో తగిన జాగ్రత్తలు, పర్యావరణ నిబంధనలు పాటించకుండానే విస్తరణ చేపట్టారని టీడీపీ తెలిపింది. 2018లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఎల్జీ యాజమాన్యం ప్లాంటు విస్తరణకు దరఖాస్తు చేసుకుందని, అయితే సరైన జాగ్రత్త చర్యలు తీసుకోని కారణంగా ఆ దరఖాస్తును బాబు పక్కన పెట్టేశారని, 2019లో జగన్ అధికారంలోకి వచ్చిన నెల రోజులలోపే ఎల్జీ ప్లాంటు విస్తరణకు అనుమతులిచ్చేశారని, కనీస ప్రామాణాలు కూడా పరిశీలించకుండానే పర్మిషన్లు ఇచ్చేశారని టీడీపీ ఆరోపించింది. ఈ మేరకు ఆయా తేదీల్లో చంద్రబాబు, జగన్ ప్రభుత్వాలు జారీచేసిన అధికారిక ఉత్తర్వులే సాక్ష్యాధారాలుగా టీడీపీ నేతలు పేర్కొన్నారు. పైగా..
ఎల్జీని కాపాడేందుకు..
గురువారం గ్యాస్ లీకేజీ ఎల్జీ కంపెనీని కాపాడుకునేందుకు సీఎం జగన్ చాలా తాపత్రయపడ్డారని, ఎయిర్ పోర్టులోనే ఆ కంపెనీ ప్రతినిధులతో మంతనాలు చేశారని టీడీపీ నేతలు ఆరోపించారు. ఆ ఫొటోలను కూడా టీడీపీ హైలైట్ చేసింది. పైగా ప్రమాదఘటనపై ఎల్జీ కంపెనీపై నమోదైన సెక్షన్లు కూడా చాలా బలహీనంగా ఉన్నాయని, ఐపీసీ 278, 284, 285, 304, 337, 338 ప్రకారం ఎల్జీకి గరిష్టంగా రూ.2వేల జరిమానాతో సరిపుచ్చే ఎత్తుగడ వేశారని, ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి, ఎల్జీ కంపెనీతో నెగోషియేషన్ చేస్తామనడం జగన్ దిగజారుడుతనానికి నిదర్శనమని టీడీపీ ఆరోపించింది. విశాఖ గ్యాస్ లీకేజీ ఘటనపై గురు, శుక్రవారాల్లో జాతీయ స్థాయిలోనూ చర్చలు ఉధృతంగా సాగాయి.
బాబుకు మెంటల్..
ఎల్జీ పాలిమర్స్ ఘటనపై సీఎం జగన్ స్పందించిన తీరును దేశమంతా ప్రశంసిస్తోన్నదని, రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా గ్యాస్ లీకేజీ బాధిత కుటుంబాల పట్ల ఆయన కనబర్చిన ఉదారత అసాధారణమని, ఆపదలో ఆదుకునే సీఎం ఉన్నందుకే ప్రజలు సంతోషిస్తున్నారని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. ఈ వ్యవహారంలో టీడీపీ, దాని చీఫ్ చంద్రబాబు నీచరాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు యాంటీ సోషల్ పర్సనాలిటీ డిజార్డర్ అనే మెంటల్ కండిషన్ లో ఉన్నారని, భ్రమలు, భయాలు, ఫ్యాంటసీలు, అబద్ధాలనే నిజాలుగా నమ్ముతూ బుతుకీడుస్తున్నారని ఎద్దేవా చేశారు.