అఫైర్: భార్యను వదిలేసి నకిలీ భార్యతో విదేశాలకు చెక్కేశాడు
విశాఖపట్నం: భార్యాపిల్లలను వదిలేసి ఓ వ్యక్తి మరో స్త్రీని భార్యగా చూపించి పాస్పోర్టు పొంది విదేశాలకు చెక్కేశాడు. అతనికి వివాహమై 37 ఏళ్లు. అతనికి ముగ్గురు పిల్లలు. వారందరిని వదిలేసి మరో మహిళతో విదేశాలకు వెళ్లిపోయాడు. ఈ మేరకు మీడియాలో వార్తలు వచ్చాయి.
ఆ విషయం తెలుసుకున్న బార్య గుంటూరు జిల్లా కలెక్టర్కు, ఎస్పీకి ఫిర్యాదు చేసింది. విశాఖ పాస్పోర్టు అధికారులకు విషయం చెప్పింది. గుంటూరు జిల్లా అగ్రహారానికి చెందన దాసరి భవానికి 1980లో ఈశ్వరప్రసాద్ అనే వ్యక్తితో పెళ్లి జరిగింది.
వారికి ఇద్దరు కూతుళ్లు, ఓ కుమారుడు ఉన్నారు. అయితే, ఈశ్వర ప్రసాద్ వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. దానికి భార్య అడ్డంగా ఉందని భావించి విదేశాలకు పారిపోవడానికి పథకం వేసుకున్నాడు. ఆమెతో కలిసి విదేశాలకు వెళ్లిపోయాడు.
అతను 2015లో పాస్పోర్టు కోసం హైదరాబాదులో దరఖాస్తు చేసుకున్నాడు. అయితే, అధికారులు దాన్ని తిరస్కరించారు. 2017లో విశాఖ పాస్పోర్టు కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నాడు. వివరాలు సరిగా లేకపోవడంతో ఆ దరఖాస్తు తిరస్కరణకు గురైంది.
మళ్లీ పరిశీలన కోసం అతను దరఖాస్తు చేసుకున్నాడు. విశాఖ పాస్పోర్టు కార్యాలయం సూచన మేరకు గుంటూరు స్పెషల్ బ్రాంచ్ పోలీసులు విచారణ జరిపారు. విచారణలో అసలు విషయం బయటపడింది.
Recommended Video
దాంతో పాస్పోర్టు మంజూరు చేయకూడదని స్పెషల్ బ్రాంచ్ పోలీసులు నివేదిక ఇచ్చారు. అయినా అతను ప్రయత్నం మానుకోలేదు. అడ్డదారిలో పాస్పోర్టు సంపాదించి, నిరుడు ఆ మహిళతో బ్రిటన్ వెళ్లిపోయాడు అక్కడ అతను ఉద్యోగం చేస్తున్నాడు.