టీడీపీ కొత్త డిమాండ్: ఆర్థిక రాజధానిగా, ఫిల్మ్ ఇండస్ట్రీ క్యాపిటల్గా విశాఖ ఓకే: పరిపాలన మాత్రం నో..
Recommended Video
విశాఖపట్నం: రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన ఏపీ వికేంద్రీకరణ బిల్లు శాసనసభలో ఆమోదం పొందిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ సరికొత్త నినాదానికి తెర తీసింది. వినూత్న డిమాండ్ను వినిపిస్తోంది. మూడు రాజధానుల ఏర్పాటు, విశాఖపట్నాన్ని పరిపాలనా రాజధానిగా మార్చడంపై పార్టీ తీసుకున్న నిర్ణయంపై ఉత్తరాంధ్ర ప్రజల నుంచి వెల్లువెత్తుతున్న వ్యతిరేకతను దృష్టిలో ఉంచుకుని ఈ డిమాండ్ను అందుకున్నట్లు చెబుతున్నారు.
పిక్చర్ క్లియర్: వైసీపీ ఒకవైపు: టీడీపీ-కమ్యూనిస్టులు, జనసేన-బీజేపీ మరోవైపు
ఆర్థిక రాజధానిగా, చిత్ర పరిశ్రమ క్యాపిటల్గా ఓకే..
ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలకు కేంద్రబిందువుగా, అతి పెద్ద నగరంగా గుర్తింపు తెచ్చుకున్న వైజాగ్ను ఆర్థిక రాజధానిగా ప్రకటించాలని తెలుగుదేశం పార్టీ విశాఖపట్నం జిల్లా నాయకులు తాజాగా డిమాండ్ చేస్తున్నారు. అలాగే- తెలుగు చలన చిత్ర పరిశ్రమ మొత్తాన్నీ హైదరాబాద్ నుంచి విశాఖపట్నానికి తీసుకుని రావాలని వారు పట్టుబడుతున్నారు. తెలుగు సినిమా రాజధానిగా మార్చాలని నినదిస్తున్నారు. ప్రస్తుతం విశాఖపట్నంలో దీనికి సంబంధించిన బ్యానర్లు, ఫ్లెక్సీలు విస్తృతంగా కనిపిస్తున్నాయి.
పరిపాలన మాత్రం అమరావతి నుంచే..
విశాఖపట్నాన్ని ఆర్థిక రాజధానిగా, తెలుగు చలన చిత్ర పరిశ్రమకు కేంద్రబిందువుగా మార్చాలంటూ పట్టుబట్టుతున్న విశాఖపట్నం జిల్లా టీడీపీ నాయకులు..అదే విశాఖపట్నాన్ని పరిపాలనా రాజధానిగా మార్చడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుండటం కొసమెరుపుగా చెప్పుకోవచ్చు. రాష్ట్ర రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. అమరావతిని కొనసాగిస్తూనే.. విశాఖపట్నాన్ని అభివృద్ధి చేయలని ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేస్తున్నారు.
ఉత్తరాంధ్ర నుంచి వెల్లువెత్తుతోన్న నిరసన వల్లే..
విశాఖపట్నాన్ని పరిపాలన రాజధానిగా మార్చడాన్ని తెలుగుదేశం పార్టీ ముందు నుంచీ వ్యతిరేకిస్తూ వస్తోంది. దీనిపై ఆందోళనలను చేపట్టింది. నిరసన ప్రదర్శనలకు దిగింది. టీడీపీ వైఖరి ఉత్తరాంధ్ర ప్రజల్లో మింగుడు పడట్లేదు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల ప్రజల్లో టీడీపీ మీద అసహనం, ఆగ్రహం వ్యక్తమౌతోంది. వారిని శాంతింపజేయాలనే ఉద్దేశంతోనే తెలుగుదేశం పార్టీ విశాఖపట్నం జిల్లా నాయకులు ఈ సరికొత్త డిమాండ్ను లేవనెత్తినట్లు చెబుతున్నారు.
శాసనభలో ఆమోదం పొందిన రోజే..
మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన ఏపీ వికేంద్రీకరణ బిల్లు శాసనసభలో ప్రవేశపెట్టిన రోజే విశాఖపట్నంలో ఈ బ్యానర్లు, ఫ్లెక్సీలు వెలిశాయి. విశాఖపట్నం జిల్లా నాయకులు ఈ బ్యానర్లను కట్టారు. వాటిని ప్రదర్శిస్తూ నిరసన కార్యక్రమాలను కూడా చేపట్టారు. పరిపాలనా రాజధానిగా అమరావతిని కొనసాగించాలని, విశాఖపట్నాన్ని ఆర్థిక, చిత్ర పరిశ్రమ రాజధానులుగా మార్చాలని వారు నినాదాలు చేశారు.
టీడీపీ రాష్ట్రస్థాయి నాయకుల వైఖరేంటీ..?
ఈ సరికొత్త డిమాండ్కు పార్టీ రాష్ట్ర స్థాయి నాయకత్వం పెద్దగా పరిగణనలోకి తీసుకున్నట్లు కనిపించట్లేదు. ఓ జిల్లా స్థాయి నాయకులు లేవనెత్తిన ఈ డిమాండ్ పట్ల టీడీపీ అగ్ర నాయకత్వం కూడా స్పందించకపోవచ్చు. రాజధానిగా అమరావతిని కొనసాగించాలనే పట్టుబడుతోంది. విశాఖపట్నం టీడీపీ జిల్లా నాయకులు లేవనెత్తిన డిమాండ్ ప్రస్తుతం ఉత్తరాంధ్ర జిల్లాల్లో చర్చనీయాంశమౌతోంది. దీన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లి.. పార్టీ పట్ల సానుభూతిని కూడబెట్టుకోవాలని జిల్లా నాయకులు భావిస్తున్నారు.