విజయసాయి రెడ్డి పేరుతో విశాఖలో భూధందా: వైసీపీ నేతపై వేటు: అక్రమార్కులపై చర్యలు తప్పవంటూ
విశాఖపట్నం: విశాఖపట్నానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ మాజీ ఛైర్మన్ కొయ్యా ప్రసాద్ రెడ్డిపై వేటు పడింది. ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు వైఎస్ఆర్సీపీ వెల్లడించింది. ఈ మేరకు గుంటూరు జిల్లా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటన జారీ చేసింది. సస్పెన్షన్ ఎత్తి వేసేంత వరకూ ఆయనతో పార్టీకి సంబంధం ఉండదని స్పష్టం చేసింది. తక్షణమే ఆదేశాలు అమల్లోకి వస్తాయని పార్టీ పేర్కొంది. ఆయనను సస్పెండ్ చేయడానికి గల కారణాలను వెల్లడించింది.
అమరావతి హత్య: రాజధాని శంకుస్థాపనకు ప్రధాని ఏ ముఖం పెట్టుకుని వస్తారు: సుంకర పద్మశ్రీ ఫైర్
వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు వీ విజయసాయి రెడ్డి పేరును అడ్డుగా పెట్టుకుని కొయ్యా ప్రసాద్ రెడ్డి విశాఖపట్నంలో అక్రమాలకు పాల్పడినట్లు తమ దృష్టికి వచ్చిందని ఈ ప్రకటనలో పేర్కొన్నారు. సాయిరెడ్డి పేరు మీద కొన్ని భూములకు సంబంధించిన డీలింగ్లను నిర్వహించారని, వాటిల్లో ఆయన ప్రమేయం ఉందంటూ ఫిర్యాదులు అందాయని తెలిపారు. కొయ్యా ప్రసాద్ రెడ్డిపై వచ్చిన ఫిర్యాదులు, ఇతరత్రా ఆరోపణలపై అంతర్గతంగా విచారణ నిర్వహించడానిగా.. అవన్నీ వాస్తవమేనని తేలినట్లు పేర్కొన్నారు.
ఆయనపై వచ్చిన ఫిర్యాదులపై పార్టీ క్రమశిక్షణా సంఘం ద్వారా విచారణ నిర్వహించినట్లు స్పష్టం చేసింది. భూధందాల్లో కొయ్యా ప్రసాద్ రెడ్డి ప్రమేయం ఉందని తేలడం వల్లే ఈ నిర్ణయాన్ని తీసుకున్నామని పేర్కొన్నారు. క్రమశిక్షణా సంఘం సభ్యుల సిఫారసు మేరకు కొయ్యా ప్రసాద్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపారు. పార్టీ పేరును అడ్డుగా పెట్టుకున్నా, నేతల పేరు చెప్పుకొంటూ అక్రమాలకు ఎవరు పాల్పడినా క్షమించేది లేదని అన్నారు. వారిపై పార్టీపరంగా చర్యల తప్పవని అన్నారు.
Recommended Video
ఏ స్థాయిలో ఉన్న నాయకుడయినా తీవ్ర స్థాయి క్రమశిక్షణా చర్యల నుంచి తప్పించుకోలేరని హెచ్చరించారు. పార్టీ ప్రతి విషయంపైనా జవాబుదారీతనంతో వ్యవహరిస్తుందని అన్నారు. అదే తరహా జవాబుదారీతనం, పారదర్శకతను నాయకులు కూడా కలిగి ఉండాలని చెప్పారు. చిత్తశుద్ధితో ప్రజలకు సేవ చేయడానికి కృషి చేయాల్సి ఉంటుందని అన్నారు. పార్టీ, నాయకుల పేర్లను వినియోగించుకుని అక్రమార్జనకు పాల్పడిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ తాము ఉపేక్షించబోమని తెలిపారు. కొయ్యా ప్రసాద్ రెడ్డి సస్పెన్షన్ వ్యవహారం.. అక్రమాలకు పాల్పడాలనుకునే వారికి గుణపాఠం అవుతుందని అన్నారు.