జాతకాలు చెప్పే విశాఖ ఆక్టోపస్కు ఆ మాత్రం తెలియదా? మేయర్గా ఉంటూ పార్కుల ఆక్రమణ: సాయిరెడ్డి
విశాఖపట్నం: లోక్సభ మాజీ సభ్యుడు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు సబ్బం హరిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి విమర్శల జడివాన కురుస్తోంది. అంతు చూస్తానంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి సబ్బం హరి చేసిన హెచ్చిరకల పట్ల వైఎస్ఆర్సీపీ శ్రేణులు భగ్గుమంటున్నాయి. ఆయనపై ఘాటు విమర్శలతో విరుచుకుపడుతున్నాయి. కబ్జా చేసింది చాలక.. ముఖ్యమంత్రినే తప్పు పట్టడం పట్ల ఉత్తరాంధ్రకు చెందిన వైసీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
తొలగింపుపై సబ్బం హరి ఆగ్రహావేశాలు..
గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఆధీనంలోని పార్కు స్థలాన్ని ఆక్రమించి నిర్మించిన ఆయన ఇంటిని అధికారులు పాక్షికంగా కూల్చివేశారు. అక్రమ కట్టడాన్ని తొలగించారు. పార్కునకు చెందిన 12 అడుగుల కబ్జా చేశారని, ఆ స్థలంలో సొంత నిర్మాణాన్ని చేపట్టారనే కారణంతో దాన్ని కూల్చివేశారు జీవీఎంసీ అధికారులు. శనివారం ఉదయం జేసీబీతో వచ్చిన అధికారులు సబ్బం హరి ప్రభుత్వ స్థలంలో నిర్మించిన అక్రమ భవనంలో కొంత భాగాన్ని తొలగించారు.
కక్ష సాధింపు చర్యలంటూ..
ఆక్రమించిన ఖాళీ స్థలంలో కంచె ఏర్పాటు చేశారు. తన ఇంటిలో కొంతభాగాన్ని అధికారులు కూల్చివేయడం పట్ల సబ్బం హరి ప్రభుత్వంపై మండిపడ్డారు. వైఎస్ జగన్, వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డిపై ఘాటు విమర్శలు చేశారు. తన డాఖా చూపిస్తానని సవాల్ చేశారు. ముందస్తు నోటీసు ఇవ్వకుండా హుటాహుటిన ఇంటి ప్రహరీగోడ, టాయ్లెట్ను కూల్చివేశారని మండిపడ్డారు. తాను ఎలాంటి అక్రమాలు చేపట్టలేదని, రాజకీయంగా ప్రభుత్వం తనపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తానేంటో చూపిస్తాననీ హెచ్చరించారు.
సబ్బం హరి వ్యాఖ్యల పట్ల వైసీపీ నేతల మండిపాటు..
తనతో పెట్టుకున్నందుకు సాయిరెడ్డి త్వరలోనే పశ్చాత్తాప పడేలా చేస్తాననీ హెచ్చరించారు. ఆయన చేసిన వ్యాఖ్యలపై వైఎస్ఆర్సీపీ ఉత్తరాంధ్ర నేతలు మండిపడుతున్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసిన సబ్బం హరి ముఖ్యమంత్రి, విజయసాయి రెడ్డిని బెదిరించడం ఏమిటంటూ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ విమర్శించారు. సీతమ్మధారలో మూడు కోట్ల విలువైన ప్రభుత్వ స్థలాన్ని ఆయన కబ్జా చేశారని ఆరోపించారు.
సాయిరెడ్డి అభ్యంతరం..
సబ్బం హరి తనను హెచ్చరించడం పట్ల సాయిరెడ్డి భగ్గుమన్నారు. మేయర్గా పనిచేసిన వ్యక్తికి నిబంధనల గురించి తెలియవా? అని నిలదీశారు. తాను పార్కు స్థలాన్ని ఆక్రమించుకున్నాననే విషయం సబ్బం హరికి ముందే తెలుసునని, అందుకే న్యాయపోరాటం చేయడానికి వెనుకాడుతున్నారని చెప్పారు. తాను నిర్మించినది అక్రమ కట్టడమని, అది పార్కునకు చెందిన స్థలం అనీ ఆయనకు తెలుసునని అన్నారు. చట్టం తన పని తాను చేసుకుపోతుంటే ముఖ్యమంత్రిపై రంకెలేస్తున్నారని విమర్శించారు.
Recommended Video
విశాఖ ఆక్టోపస్కు తెలియదా?
మేయర్గా ప్రభుత్వ స్థలాలను కాపాడాల్సిన వ్యక్తే దాన్ని కబ్జా చేశాడని, దీన్ని ఎవరూ హర్షించరని చెప్పారు. మేయర్గా పని చేసినవాడే పార్కులను ఆక్రమించాడని ఆరోపించారు. ఏపీ రాజకీయాలపై తరచూ మీడియాలో జాతకాలు చెప్పే విశాఖ ఆక్టోబస్కు తాను ఆక్రమించినది ప్రభుత్వ స్థలం అనే విషయం తెలియదా? అని ప్రశ్నించారు. అక్రమంగా ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన వారు ఎలాంటి వారైనా వదలబోమని సాయిరెడ్డి హెచ్చరించారు.