కేఏ పాల్కు విశాఖ తహసీల్దార్ షాక్, ఎస్తేరు రాణికే గమ్ సొసైటీ ఆస్తులు
విశాఖపట్నం: క్రైస్తవ మత ప్రబోధకుడు కేఏ పాల్ వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉన్న గమ్ సొసైటీకి చెందిన ఆస్తులను ఆయన సోదరుడు దివంగత డేవిడ్ రాజు భార్య ఎస్తేరు రాణికి అప్పగించాలని విశాఖ అర్బన్ తహశీల్దారు నాగభూషణం నోటీసులు జారీ చేశారు.
తద్వారా కేఏ పాల్కు విశాఖపట్నం అర్బన్ తహసీల్దార్ షాకిచ్చారు. ఈ మేరకు ఇరు పార్టీలకు నోటీసులు పంపించారు. గమ్ సొసైటీకి వందల కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. ఈ ఆస్తులకు సంబంధించి అన్నదమ్ములు ఇద్దరి మధ్య వివాదం నడిచింది. ఈ సమయంలో డేవిడ్ రాజు హత్యకు గురయ్యారు.
ఆ తర్వాత ఆస్తుల కోసం డేవిడ్ రాజు భార్య, ఆయన కుమారులు న్యాయ పోరాటం చేస్తున్నారు. అయితే, ఈ ఆస్తులన్నీ కేఏ పాల్కే చెందుతాయని, వాటిని ఆయనకే అప్పగించాలని గతంలో హైకోర్టు ఆదేశించింది.
దీంతో ఈ ఏడాది మే 16న గమ్ సొసైటీ ఆస్తులను కేఏ పాల్కు అప్పగించారు. దీనిని సవాల్ చేస్తూ డేవిడ్ రాజు భార్య ఎస్తేరు రాణి సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
ఈ పరిస్థితుల్లో విశాఖ అర్బన్ తహసీల్దార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కేఏ పాల్ అధీనంలో ఉన్న ఆస్తులను అర్బన్ ఎమ్మార్వోకు స్వాధీనం చేయాలని, వాటిని ఎస్తేరు రాణికి అప్పగించాలంటూ ఉత్తర్వులిచ్చారు.