'నేను చెప్తే జగన్కు అదే ఫైనల్': ఆ నేతపై అసంతృప్తి, హెచ్చరించిన విజయసాయి?
విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి తాను ఏం చెబితే అదేనని విశాఖ జిల్లా అధ్యక్షులు గుడివాడ అమర్నాథ్ చెబుతున్నారని, దీంతో ఆయన తీరు పైన పార్టీలో అసంతృప్తి నెలకొందని పుకార్లు వస్తున్నాయి.
జగన్కు తాను ఏది చెబితే అది అనే ధీమాతో.. సీనియర్లను కూడా పట్టించుకోవడం లేదని అంటున్నారు. పార్టీ అగ్రనేతల సమాచారం కూడా అందించడం లేదని ఆరోపిస్తున్నారని అంటున్నారు. అమర్నాథ్ గురించి నేరుగా జగన్కు ఫిర్యాదు చేసే యోచనలో కొందరు ఉన్నారని అంటున్నారు.
2014లో జరిగిన సాధారణ ఎన్నికల్లో వైసీపీ జిల్లాలో ఘోర పరాజయాన్ని చవిచూసింది. నగర పరిధిలో ఏడు నియోజకవర్గాలు ఉండగా ఒక్క దాంట్లో గెలవలేదు. ఎన్నికల ఫలితాల తర్వాత పార్టీ నగర అధ్యక్ష పదవికి మళ్ల విజయ్ ప్రసాద్ రాజీనామా చేశారు. అనంతరం కొణతాల రామకృష్ణ, దాడి వీరభధ్ర రావు వంటి సీనియర్ నేతలు కూడా దూరమయ్యారు.
దీంతో జిల్లా బాధ్యతలను గుడివాడ అమర్నాథ్కు అప్పగించారు. అయితే పార్టీలో వున్న మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలను ఆయన కలుపుకొని వెళ్లడం లేదని పార్టీలో అసంతృప్తి కనిపిస్తోందని వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా వ్యక్తిగత ఇమేజ్ పెంచుకోవాలనే తాపత్రయంలో ఉన్నారని అంటున్నారు.
తాను ఏం చెబితే జగన్కు అదే ఫైనల్ అని మిగిలిన వారిని మాట్లాడనివ్వడం లేదంటున్నారు. రెండు రోజుల క్రితం పార్టీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు విజయ సాయి రెడ్డి వస్తున్న విషయం మాటవరుసకైనా చెప్పలేదంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారంటున్నారు.
ఇదిలా ఉండగా, విషయం తెలియడంతో.. పార్టీ కార్యాలయంలో జీవీఎంసీ పరిధిలోని నియోజకవర్గాల సమన్వయకర్తలతో అదే రోజు జరిగిన సమావేశంలో అందరినీ కలుపుకుపోవాలంటూ పరోక్షంగా అమర్కు విజయ సాయి రెడ్డి హెచ్చరికలు జారీ చేశారని నేతలు చెబుతున్నారని సమాచారం.
కాగా, త్వరలో జరిగే జీవీఎంసీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపే ధ్యేయంగా అందరూ పని చేయాలని విజయ సాయి రెడ్డి సూచించారు. ఇందుకు పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు ప్రతి మూడు వార్డులకు ఒక నాయకుడిని ఇంచార్జిగా నియమించాలన్నారు. కాగా, జగన్కు ఫిర్యాదు చేయాలని యోచిస్తున్నారని తెలుస్తోంది.