ఊరిస్తున్న విశాఖ..! అంతా అనుకూలమంటూనే గుబులు వ్యక్తం చేస్తున్న నేతలు..!!
అమరావతి/హైదరాబాద్ : ఏపీ గడ్దపై పదేళ్లలో ఎంతతేడా.. రాష్ట్ర రాజకీయాల్లో ఊహించని మార్పులు. ప్రత్యర్థులు మిత్రులయ్యారు. మిత్రులు శత్రువులయ్యారు. ఎవరు ఎవరిని దెబ్బతీస్తారనేది ఊహకందని విషయంగా పరిణమించింది. అటువంటి ఆంధ్రప్రదేశ్ పార్లమెంటరీ స్థానాల్లో కీలకమైంది విశాఖపట్టణం పార్లమెంటరీ నియోజకవర్గం. ఒకప్పటి కాంగ్రెస్ కంచుకోట క్రమంగా పసుపు జెండా ఎగురవేసేలా మార్పు సంతరించుకుండి. బీసీలు, బ్రాహ్మణులు, కాపులు ఈ మూడు సామాజిక వర్గాలకు సమానంగా కమ్మ ఓటర్లు కూడా అక్కడ ఉండడం విశేషం..!
నాలుగు రోజుల్లో ఎన్నికలు..! ఏంది ఆ దూకుడు..? సింహా చిందులపై చిరాకు పడుతున్న తమ్ముళ్లు..!!
భిన్న సంస్క్రుతిని సొంతం చేసుకుంటున్న విశాఖ..! ఓటర్లలో వచ్చిన మార్పు ఎవరికి కలిసొస్తుందో..!!
హైదరాబాద్ తరువాత వ్యాపార కార్యకలాపాల్లో కమ్మ సామాజికవర్గం విశాఖలో పాగా వేసింది. క్రమంగా రాజకీయాల్లో పట్టుసాధించేంత ఎదిగింది. అటువంటి చోట.. 2019 గెలుపు నందమూరి కుటుంబానికి సవాల్ గా మారిందనే చెప్పాలి. ఎందుకంటే.. బీజేపీ తరపున పురందేశ్వరీ, టీడీపీ నుంచి బాలయ్య చిన్న అల్లుడు భరత్ పోటీపడుతున్నారు. వైసీపీ నుంచి ఎంవివి సత్యనారాయణ, జనసేన నుంచి సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వి.వి.లక్ష్మినారాయణ బరిలో నిలిచారు. నలుగురూ ధీటైన అభ్యర్థులే. పైగా, విశాఖ రైల్వేజోన్ ఇచ్చామనే ఇమేజ్.. ఎన్టీ ఆర్ కూతురుగా పురందేశ్వరిపై మమకారం బీజేపి తమ అనుకూలతలుగా భావిస్తోంది.
త్రిముఖ పోరు తప్పేట్టు లేదు..! నువ్వానేనా అనుకుంటున్న అభ్యర్థులు..!!
గతంలో 1991, 1999లో ఎంపీగా గెలిచిన మూర్తి మనవడిగా టీడీపీ తరపున భరత్ కు ప్రాధాన్యత ఉంది . అదే సమయంలో చంద్రబాబుతో బంధుత్వం.. లోకేష్ తోడల్లుడు.. ఇవన్నీ అదనపు బలాలు. పరిశ్రమల ఏర్పాటు, తుఫాన్ల సమయంలో చంద్రబాబు పనితీరు విశాఖ వాసులు తమకే పట్టం కడతారనేది తెలుగు తమ్ముళ్ల ధీమా. ప్రభుత్వ వ్యతిరేకత.. వైసీపీ బలం అన్నీ కలిసొస్తాయనేది జగన్ ఆత్మవిశ్వాసం. పైగా 2014 ఎన్నికల్లో జగన్ అమ్మ విజయమ్మ విశాఖ ఎంపీగా పోటీచేసి ఓటమి చవిచూశారు. దీన్ని సమం చేసేందుకు వైసీపీ ఎలాగైనా తమ అభ్యర్థి గెలవాలనే వ్యూహరచన బలంగా చేస్తోంది.
లక్ష్మీ నారాయణ పైనే అందరి చూపు..! పురందేశ్వరి ప్రభావం ఎంత..?!
కీలకమైన వ్యక్తి జేడీ లక్ష్మినారాయణ అలియాస్ వి.వి. లక్ష్మినారాయణ. నిజాయతీ గల అధికారిగా అన్నివర్గాల్లోనూ మంచి పేరుంది. పైగా జనసేన తరపున పవన్ ఇమేజ్ అదనపు బలం కానుంది. పార్టీలకు అతీతంగా.. జేడీ వంటి నేత ఒకరు ఉండాలనే ప్రజల భావన కూడా ఆయనను గెలిపిస్తుందనే జనసేన భరోసా. తాను కూడా అదేస్థాయిలో తాను గెలిస్తే చేయబోయే పనుల చిట్టాను ప్రజలకు వివరిస్తున్నారు. తొలిసారి బాండ్ పేపర్ పై తన హామీలను చట్టబద్ధత కల్పిస్తున్నానంటూ ప్రకటించారు. కాపు, బ్రాహ్మణ, మధ్యతరగతి కుటుంబాలు ఆయన వైపు మొగ్గుచూపుతున్నాయంటూ పలు సర్వేలు చెబుతున్నాయి.
గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్న అభ్యర్థులు..! ఓటరు డిసైడ్ చేసేది ఎవరినో చూడాలి..!!
అయితే.. ఇప్పటికే అక్కడ బలమైన కేడర్ ఉన్న టీడీపీ, వైసీపీలను తట్టుకుని కేవలం పవన్ గ్లామర్ తో జేడీ లక్ష్మినారాయణ ఎంత వరకూ నెట్టుకురాగలరనే చర్చ కూడా ఉంది. తన కేసుల్లో కీలకమైన అధికారిని ఓడించాలని జగన్ . తన నిజాయతీకు గుర్తింపు దక్కాలనే జేడీ, పంతం నెగ్గించుకుని నందమూరి అల్లుళ్లు ఇద్దరినీ చట్టసభలకు పంపాలని తెలుగు తమ్ముళ్లు తెగ పోరాటం చేస్తున్నారు. ఇంతటి ఉత్కంఠత రేకెత్తిస్తున్న పోరులో ఎవరు గెలిచినా రికార్డు సాధించినట్టే. ఎవరు ఓడినా రేపటి రాజకీయాలకు గుణపాఠంగా మారినట్టేనంటూ రాజకీయ విశ్లేషకులు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.