21వేల మంది ఉద్యోగాల తొలగింపు: చంద్రబాబుపై విష్ణు ఫైర్, గంటాకు 10సార్లు ఫోన్ చేసినా..
అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్ర సాక్షార భారత్ పథకంలో పనిచేస్తున్న 21వేల మంది ఉద్యోగులను ఒక లేఖ ద్వారా తొలగించి రోడ్డున పడేశారని మండిపడ్డారు.
బాబు వస్తే.. జాబొస్తుందని..
మంగళవారం విష్ణుకుమార్ రాజు మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల ముందు బాబు వస్తే జాబ్ వస్తుందని చెప్పి.. ఇప్పుడు 21వేల మందిని నిరుద్యోగులు చేశారని మండిపడ్డారు. ఉద్యోగాల నుంచి తొలగించిన వారికి భద్రత కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.
గంటాకు 10సార్లు ఫోన్ చేసినా..
తొలగించిన వారిని తిరిగి ఉద్యోగంలోకి తీసుకోవాలని విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావుకి 10సార్లు ఫోన్ చేసినా, ఆ విషయంపై వారు స్పందించలేదన్నారు. 21వేల మంది ఉద్యోగుల ఉసురు తగులుతుందని విష్ణుకుమార్ రాజు దుయ్యబట్టారు.
చీకటి రోజు.. ఉన్నఫళంగా తీసేస్తే..
చంద్రబాబు ప్రభుత్వం 24,470మంది నిరుద్యోగులను మోసం చేసిందని బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. ఏపీ నిరుద్యోగులకు ఇది చీకటి రోజని అన్నారు. సాక్షార భారత్లో పనిచేస్తున్న 21వేల మంది ఉద్యోగులను తొలగించారని, 8ఏళ్లుగా పనిచేస్తున్న వారిని ఉన్నఫలంగా తీసేస్తే వారి పరిస్థితి ఏంటని ప్రభుత్వాన్ని నిలదీశారు.
దీంట్లోకి కూడా మోడీని లాగుతారేమో..
వయోపరిమితి దాటిన వారికి అక్షరాలు నేర్పడం వారి పని అని, అయితే, వారితో ప్రభుత్వానికి సంబంధించిన పనులు చేయించుకున్నారని విమర్శించారు. 600మెమో కాపీని వారికి ఇవ్వకుండానే ఉద్యోగాల నుంచి తొలగించడం అన్యాయమని.. ఇది కూడా ప్రధాని నరేంద్ర మోడీ చేసిన పని చెప్పి విమర్శలు చేస్తారేమోనని చంద్రబాబుపై మండిపడ్డారు. మానవతా దృక్పథంతో ఆలోచించి ప్రభుత్వం తక్షణమే స్పందించి మెమోని ఉపసంహరించుకోవాలని విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు.